Thieves Robbery on Train At Kurnool District: రైళ్లలో ప్రయాణికుల ఆభరణాలు తరచూ చోరీకి గురవుతున్నాయి. జనావాసం ఎక్కువగా ఉండే రైళ్లలోకి దోపీడీ దొంగలు ప్రవేశించి ప్రయాణికులకు మాయమాటలు చెప్పి వారి వద్ద ఉన్న డబ్బులు, నగలను ఆగంతకులు దోచుకుని పోతున్నారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో అర్థరాత్రి రెండు రైళ్లలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఆ ఘటన మరవక ముందే కర్నూలు జిల్లాలో గురువారం అర్ధరాత్రి వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో మరో దోపిడీ చోటు చేసుకుంది.
కర్నూలు జిల్లా బోగోలు రైల్వేస్టేషన్లో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రైలులో చోరీ జరిగిన ఘటన గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. తిరుపతి నుంచి కాచిగూడకు వెళ్లే వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ రైలు క్రాసింగ్ నిమిత్తం కర్నూలు జిల్లా బోగోలు రైల్వే స్టేషన్లో ఆగింది. కిటికీలో నుంచి S2 బోగీలో ఉన్న ఇద్దరు మహిళల మెడలో ఉన్న రెండు బంగారు గోలుసులను దుండగులు లాక్కొన్నారు. మహిళలు కేకలు వేయడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు.
ఈ రైల్వే స్టేషన్లో చోరీలు జరగడం ఇది మూడోసారి. ఇది చిన్న స్టేషన్ కావడం వల్ల ఇక్కడ పోలీస్ గస్తీ ఉండదు. ఈ రైల్వేస్టేషన్ చుట్టుపక్కల 10 కిలోమీటర్ల మేర ఏ ఊరు లేదు. దుండగులు ఈ స్టేషన్ను లక్షంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నారు. కాచిగూడ రైల్వే పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ చేపట్టారు.
గతంలో సైతం: రెండు రోజుల క్రితమే నెల్లూరు జిల్లాలో అర్థరాత్రి రెండు రైళ్లలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. రెండు ట్రైన్లలోని బోగీల్లో చొరబడి బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు దోచుకుని పరారయ్యారు. జిల్లాలోని అల్లూరు రోడ్ రైల్వే స్టేషన్, పడుగుపాడు రైల్వే స్టేషన్ల వద్ద దోపిడీ దొంగలు రైలు పట్టాలపై సాంకేతిక సమస్యలు సృష్టించారు.
మొదట చండీగఢ్-మధురై ఎక్స్ప్రెస్ను నిలిపి వేశారు. S2, S-4, S-5 కోచ్లలో మహిళల మెడలోని బంగారు నగలు, ప్రయాణికుల నుంచి విలువైన వస్తువులు దోచుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ ప్రయాణికులు అరుపులు కేకలు వేశారు. కేబుల్ కట్ చేయడంతో చండీగఢ్, మధురై వెనుక వస్తున్న మరో రైలు కూడా పడుగుపాడు స్టేషన్లో ఆగిపోయింది. దుండగులు ఈ రైలులోకి కూడా చొరబడి S-2, S-3, S-5 బోగీల్లో ఉన్న ప్రయాణికులపై దాడి చేసి బంగారు నగలు లాక్కుపోయారు.
ఈ ఘటన కారణంగా 6 ఎక్స్ప్రెస్ రైళ్లు 25 నిమిషాలు ఆలస్యంగా నడిచాయి. ప్రయాణికుల నుంచి వివరాలు సేకరించడానికి పోలీసులు రైలును నెల్లూరు, గూడూరు స్టేషన్లో ఆపకుండా నేరుగా చెన్నై సమీపంలోని పెరంబూర్ స్టేషన్లో ఆపారు. నెల్లూరుకు చెందిన ఆర్పీఎఫ్, జీఆర్పీ బృందాలు నిర్లక్ష్యంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దోపీడీపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అల్లూరు రోడ్ స్టేషన్లోని CCTV ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు.
గుంతకల్లు రైల్వే జంక్షన్లో దొంగలు స్వైరవిహారం.. రెండు రైళ్లలో చోరీ
రాళ్లు రువ్వి, చెయిన్ లాగి- నర్సాపూర్ ఎక్స్ప్రెస్లో చోరీకి యత్నం