Wood Temple in Adilabad District : అదో మారుమూల అటవీ ప్రాంతం. అక్కడి వారంతా ఆదివాసీలే. సహజంగానైతే ఆ గ్రామంతో ఎవరికీ సంబంధం ఉండదు. బాహ్య ప్రపంచానికి దూరంగా జీవిస్తుంటారు. అడవే ఆలంబనగా బతికే ఆదివాసీలు అక్కడ లభించే కలపతో మహంకాళి అమ్మవారికి అద్భుతమైన దివ్య మందిరం నిర్మించారు.
ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవులు, ఆదివాసీల పుట్టిళ్లులాంటిది. సిరికొండ మండలం వాయిపేట ఆదివాసీ గూడానికి శతాబ్ధాల చరిత్ర ఉంది. అక్కడున్న ఆదివాసీలంతా మహంకాళి ఆరాధకులు. బాహ్య ప్రపంచంతో పెద్దగా సంబంధం లేకుండా వ్యవసాయమే జీవనాధారంగా సాగే ఆ గ్రామంలో గతంలో చిన్న పూరి గుడిసెలో మహంకాళి మందిరం ఉండేది. పదేళ్ల క్రితం పశుపతినాథ్ ఆలయ దర్శనం కోసం నేపాల్ వెళ్లిన ఆ గ్రామానికి చెందిన కినక శంభూని కర్రతో చేసిన ఆలయం ఆకట్టుకుంది.

ఆయనలో కలిగిన ఆలోచనతో వాయిపేటలో కలపతో చేసిన మహంకాళి ఆలయం రూపుదిద్దుకుంది. ఎంతో నైపుణ్యంతో మలిచిన 26 పిల్లర్లు, పైకప్పు, ఆలయ శిఖరం, అబ్బురపర్చే గర్భగుడి ఇలా ప్రతీది ఆకట్టుకుంటుంది. కలప చెక్కల గోడలతో ఈ మందిరం అద్భుతంగా రూపుదిద్దుకుంది. ఇలా అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. మనసుకు ప్రశాంతతను చేకూరుస్తోంది.

ఆధ్యాత్మిక మనిషిగా మారిన వేటగాడు : కినకశంభూకి ఒకప్పుడు అడవి జంతువుల వేట తప్పితే మరో ధ్యాస ఉండేది కాదు. మహారాష్ట్రలోని చంద్రపూర్లో మహంకాళి, నేపాల్లోని పశుపతినాథ్ ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత ఆయన జీవన విధానం పూర్తిగా మారిపోయిది. ఆధ్యాత్మికం వైపు జీవితం మళ్లింది. ఇంజనీర్ల పాత్ర లేకుండా, ఆధునిక పనిముట్లు వినియోగించకుండా శంభూ సూచనలకు అనుగుణంగా స్థానిక వడ్రంగులు ఆ ఆలయాన్ని నిర్మించారు. ఆది, మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చి కలపతో నిర్మించిన దివ్య మందిరంలోని మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటారు.

చెట్లను నరికి కలప సేకరించలేదు : ఆలయానికి వినియోగించిన కలపంతా చెట్లను నరికివేసింది కాదని శంభూ తెలిపారు. దట్టమైన అటవీ ప్రాంతంలో పడిపోయిన వృక్షాలని పోగుచేసి ఆలయం నిర్మించినట్లు చెబుతున్నారు. అడవితోనే ఆదివాసీల జీవితం ముడిపడి ఉందని శంభూ పునరుద్ఘాటించారు. సీతారామచంద్రుడు, హనుమంతుడి చిత్రాలు అందరినీ అబ్బురపరుస్తున్నాయని తెలిపారు. 26 స్తంభాలతో మహంకాళీ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో అనువనువు ఆదివాసీల సంప్రదాయం ఉట్టిపడేలా దేవతా ప్రతిమలున్నాయి. కలప గోడలతో అందమైన నగిషీలు భక్తుల్ని మంత్రముగ్ధులను చేస్తున్నాయి.

"ఈ ఆలయానికి వినియోగించిన కలపంతా చెట్లను నరికేస్తే వచ్చింది కాదు. దట్టమైన అటవీ ప్రాంతంలో పడిపోయిన వృక్షాలను పోగు చేసి ఆలయం నిర్మించాం. చెట్లు పడిపోయిన తర్వాత సుమారు 10 ఏళ్లు ఉంటాయి. వాటిని వృథాగా పోనీకుండా తీసుకువచ్చి మహంకాళి ఆలయం నిర్మించాం. అడవితోనే అందరి జీవితం ఉంది. అడవితోనే ఆదివాసీల జీవితం కూడా ముడిపడి ఉంది. అందరూ అడవులను రక్షించాలి. అప్పుడే మనుగడ సాధ్యం అవుతుంది." - శంభూ, మహంకాళి ఆలయ నిర్వాహకులు
నదిపై వంతెన కట్టిన గ్రామస్థులు.. అధికారుల అలసత్వానికి 'శ్రమదానం'తో పరిష్కారం
Wooden Villas: కలప ఇళ్లు నిర్మాణం... ఎక్కడో కాదు.. మనదగ్గరే!