JEE Main Session 2 Result : జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు విజయ దుందుభి మోగించారు. హైదరాబాద్కు చెందిన ఇద్దరు జాతీయ స్థాయిలో ప్రథమ ర్యాంకును సాధించారు. బనిబ్రత మాజీ, వంగల అజయ్ రెడ్డి 300కి 300 మార్కులు పొందటంతో ఇద్దరికీ ఎన్టీఏ ఒకే ర్యాంకును కేటాయించింది. ఇతర రాష్ట్రాలకు చెందిన మరో ఇద్దరికి కూడా ఒకటో ర్యాంకు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈడబ్ల్యూఎస్ విభాగంలో కూడా అజయ్రెడ్డి ప్రథమ ర్యాంకు దక్కించుకున్నారు. అజయ్రెడ్డి సొంతూరు ఏపీలోని నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలంలోని తాటిపాడు. అతడు 9వ తరగతి నుంచి హైదరాబాద్లోనే చదువుతున్నారు.
ఈసారి వయసు కొలమానం తొలగించడంతో సమానమైన మార్కులు వచ్చిన వారికి ఒకటే ర్యాంకు కేటాయించారు. ఎన్టీఏ శుక్రవారం అర్ధరాత్రి జేఈఈ మెయిన్ ఫలితాలను వెల్లడించింది. మధ్యాహ్నం సవరించిన తుది కీని విడుదల చేసిన జాతీయ పరీక్షల సంస్థ, 19వ తేదీ నాటికి ర్యాంకులు విడుదల చేస్తామని ప్రకటించింది. కానీ చిత్రంగా 18వ తేదీ అర్ధరాత్రే ఫలితాలను వెల్లడించింది. ఈసారి జనరల్ విభాగంలో కటాఫ్ ర్యాంకుకు 93.102 పర్సంటైల్గా నిర్ణయించారు. ఇది గతేడాది 93.236గా ఉంది.
ఈసారి పరీక్షకు 14.75 లక్షల మంది : ఈసారి జేఈఈ పరీక్షను మొత్తం 14.75 లక్షల మంది రాశారు. ఇందులో కటాఫ్ మార్కులు జనరల్ విభాగంలో 93.102, ఈడబ్ల్యూఎస్ 80.383, ఓబీసీ 79.431, ఎస్సీ 61.15, ఎస్టీ 47.90 పర్సంటైల్ స్కోర్ను కటాఫ్గా నిర్ణయించారు. ఈ స్కోరుకు సమానంగా లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ పొందిన వారు మాత్రమే మే 18వ తేదీన నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అర్హత సాధించనున్నారు. రెండు విడతల్లో నిర్వహించిన పరీక్షలో మొత్తం 24 మంది 100 పర్సంటైల్ స్కోర్ సాధించారు. ఇందులో తెలంగాణ నుంచి బనిబ్రత మాజీ, హర్ష్ ఎ.గుప్తా, అజయ్ రెడ్డి ఉండగా, ఏపీ నుంచి సాయి మనోజ్ఞ గుత్తికొండ ఉన్నారు.
జేఈఈ మెయిన్ ఫలితాలు విడుదల - ఇలా ఈజీగా చెక్ చేసుకోండి
జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షపై యూటర్న్ - మూడుసార్లు కాదు రెండుసార్లు మాత్రమే ఛాన్స్