Guntur Student Died in Texas At America: మంచి భవిష్యత్తు కోసం అమెరికా వెళ్లిన విద్యార్థిని ఆశలను రోడ్డు ప్రమాదం చిదిమేసింది. చదువును పూర్తి చేసుకుని కేవలం నెల రోజుల్లో పట్టాతో తిరిగి వస్తుందనుకుంటే మృత్యువు కబళించిందన్న వార్త ఆ కుటుంబాన్ని శోక సంద్రంలో నెట్టివేసింది. అమెరికాలోని టెక్సాస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థిని మృతి చెందింది. వివరాల్లోనికి వెళ్తే
గుంటూరులోని రాజేంద్రనగర్కు చెందిన వంగవోలు దీప్తి (23) కొన్నాళ్ల క్రితం టెక్సాస్లోని డెంటన్ సిటీలో యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సాస్లో ఎంఎస్ చేసేందుకు వెళ్లారు. మరో నెల రోజుల్లో కోర్సు పూర్తవుతుంది. కానీ ఇంతలోనే ఈ నెల 12వ తేదీన స్నేహితురాలైన మేడికొండూరుకు చెందిన స్నిగ్ధతో కలిసి రోడ్డుపై దీప్తి నడచి వెళ్తుండగా వేగంగా ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో దీప్తి తలకు తీవ్ర గాయమవ్వగా ఆమె స్నేహితురాలు స్నిగ్ధకు సైతం గాయాలయ్యాయి.
పెమ్మసాని సహకారంతో క్రౌడ్ఫండింగ్, చికిత్స: అనంతరం దీప్తి స్నేహితురాళ్లు ప్రమాద విషయాన్ని ఆమె తండ్రి హనుమంతరావుకు తెలిపారు. ఆయన గుంటూరులోని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ క్యాంప్ కార్యాలయంలో సంప్రదించగా సమాచారాన్ని అమెరికాలో ఉన్న పెమ్మసానికి తెలియజేశారు. చంద్రశేఖర్ తన బృందాన్ని అప్రమత్తం చేసి మెరుగైన చికిత్స అందించేలా చొరవ తీసుకున్నారు. గుంటూరులో ఉన్న పెమ్మసాని సోదరుడు రవిశంకర్ బాధిత కుటుంబానికి క్రౌడ్ ఫండింగ్ వచ్చేలా చూడాలని సూచించారు. ఆన్లైన్లో విరాళాల రూపంలో దాదాపు 80,000 డాలర్ల వరకు రాగా వాటిని చికిత్సకు వినియోగించారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ నెల 15న దీప్తి కన్నుమూశారు. శనివారం నాటికి మృతదేహం గుంటూరుకు వచ్చే అవకాశం ఉందని, ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు పెమ్మసాని రవిశంకర్ తెలిపారు.
అవే చివరి మాటలు అవుతాయనుకోలేదు: దీప్తి తండ్రి హనుమంతరావు చిరు వ్యాపారి. తల్లి రమాదేవి గృహిణి. సోదరి శ్రీలక్ష్మి ఇంజినీరింగ్ రెండో సంవత్సర విద్యార్థిని. ఈ నెల 10 న తేదీన దీప్తితో ఫోన్లో మాట్లాడామని కానీ అవే మాతో మాట్లాడిన చివరి మాటలవుతాయని అనుకోలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. చదువులో ఎప్పుడూ ముందుండేదని, పదో తరగతి, ఇంటర్, ఇంజినీరింగ్లో టాపర్గా నిలిచిందని, అందుకే కొంత పొలం అమ్మి అమెరికా పంపించామన్నారు. ఆమె కోర్సు పూర్తవుతున్నందున గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకునే సమయానికి మమ్మల్ని అమెరికా రావాలని కోరిందన్నారు. ఇంతలోనే దీప్తి దీప్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం మమ్మల్ని కలచివేస్తుందని తండ్రి హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. దీప్తి స్నేహితురాలు స్నిగ్ధ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అమెరికాలో రోడ్డు ప్రమాదం- తెలంగాణ విద్యార్థిని మృతి - Telangana Student Died In America