Amid India-Pak Tension Telangana Students Stay in Telanganabhavan : దేశ సరిహద్దుల్లో పాకిస్థాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో జమ్ముకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు ఇంటి బాట పట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు రాష్ట్రానికి చెందిన విద్యార్థులు దిల్లీలోని తెలంగాణభవన్లో బస చేస్తున్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలను అందిస్తోంది. అయితే ఇప్పుడు సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో ఇంటికెళ్లాలా? లేదంటే క్యాంపస్లకు తిరిగి వెళ్లాలా? అనే సందిగ్ధంలో విద్యార్థులు ఉన్నారు.
ఉద్రిక్తతల పరిస్థితుల కారణంగా కశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల నుంచి విద్యార్థులు ఇంటికి పయనమై దిల్లీకి చేరుకునేసరికి భారత్, పాకిస్థాన్లు కాల్పుల విరమణకు అంగీకారం తెలిపాయి. ఈ నేపథ్యంలో అందరూ తిరిగి క్యాంపస్లకు చేరుకునేలా కళాశాలల నుంచి సందేశాలు విద్యార్థులకు వచ్చాయి. కాల్పుల విరమణ జరిగినా ఎప్పుడు ఎలాంటి సంఘటన జరుగుతుందోనని విద్యార్థుల్లో ఆందోళన ఉంది. ఈ క్రమంలో విద్యార్థులు ఇంటికి వెళ్లాలా, లేదంటే క్యాంపస్లకు తిరిగి వెళ్లాలా? అన్న సందిగ్ధంలో పడిపోయారు.
ఈ విషయంపై దిల్లీలోని తెలంగాణభవన్లో బస చేస్తున్న విద్యార్థులతో సోమవారం తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడారు. ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. తాము ముందుగా ఇంటికెళ్లి పరిస్థితులు పూర్తిగా సాధారణ స్థితికి వచ్చిన తర్వాతే క్యాంపస్లకు వెళతామని వారంతా చెప్పారు. వారి మనోభావాలను గ్రహించి గౌరవ్ ఉప్పల్ సంబంధిత యూనివర్సిటీల అధికారులతో మాట్లాడారు. విద్యార్థులు మానసికంగా పూర్వస్థితికి వచ్చేంత వరకూ తాత్కాలికంగా ఆన్లైన్ తరగతులు నిర్వహించాలని కోరారు.
ఫైనల్ ఇయర్ విద్యార్థులు దిల్లీలోనే : అందుకు యూనివర్సిటీలు కూడా సానుకూలంగా స్పందించాయి. కొంతమంది ఫైనల్ ఇయర్ విద్యార్థులు పరిస్థితి మెరుగుపడే వరకు దిల్లీలోనే ఉండి తిరిగి క్యాంపస్లకు వెళ్లాలనుకుంటున్నట్లు చెప్పడంతో అందుకు రెసిడెంట్ కమిషనర్ సైతం అంగీకారం తెలిపారు. అంతవరకూ వారికి తెలంగాణ భవన్లోనే వసతి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. సోమవారం వరకు తెలంగాణ భవన్కు మొత్తం 162 మంది విద్యార్థులు చేరుకోగా, అందులో కొందరు వారి స్వస్థలాలకు వెళ్లగా, మిగిలిన వారు ఇక్కడే బస చేస్తున్నారు.
'రాత్రంతా బాంబుల శబ్ధం - భయంతో నిద్రలేకుండా అలానే ఉండిపోయాం'
ఉగ్రవాదులకు ఊహించని చావుదెబ్బ-పాక్ న్యూక్లియర్ బ్లాక్మెయిల్స్కు భయపడేది లేదు : మోదీ