Capital Income of Telangana 2025 : దేశంలో ప్రజల తలసరి ఆదాయం 8 ఏళ్లకు రెట్టింపు అవుతుండగా, తెలంగాణలో మాత్రం ఆరేళ్లకే రెట్టింపు అవుతోంది. తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో ఉండగా, వికారాబాద్ జిల్లా అట్టడుగున ఉంది. తెలంగాణ స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు రాష్ట్ర ఆవిర్భావం నుంచి జాతీయ వృద్ధి రేటు కంటే అధికంగానే ఉంటోంది. ప్రత్యేక కేటగిరీ లేని రాష్ట్రాలన్నింటిలోనూ తెలంగాణ జీఎస్డీపీ వృద్ధి రేటు అధికంగా ఉంది. రాష్ట్ర ప్రణాళిక శాఖ సోమవారం తెలంగాణ రాష్ట్ర గణాంకాల సంకలనం (అట్లాస్)ను విడుదల చేసింది. జనాభా, ఆర్థిక, విద్య సహా వివిధ అంశాలకు సంబంధించిన గణాంకాలను విశ్లేషించింది.
సంపదలో భాగ్యనగరమే నెంబర్ వన్ : సంపదలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ బ్యాంకు డిపాజిట్లలో సగంపైగా డిపాజిట్లు హైదరాబాద్లోనే ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 2024-2025 మొదటి త్రైమాసికంలో బ్యాంకుల్లో 7.69 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్లు ఉండగా, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలోనే రూ.5.18 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ఇందులో హైదరాబాద్ జిల్లా వాటా రూ.4.62 లక్షల కోట్లు.
తలసరి ఆదాయంలో రంగారెడ్డి : తలసరి ఆదాయంలో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో ఉండగా, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలు తర్వాతి స్థానంలో ఉన్నాయి. జిల్లా స్థూల ఉత్పత్తిలో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉండగా, హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో తొలి త్రైమాసికంలో రూ.4.63 లక్షల కోట్ల రుణాలు అందజేశారు. ఎస్సీలు, ఎస్టీలు అత్యల్పంగా ఉన్న జిల్లాల్లో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది. హైదరాబాద్ జనసాంద్రత 18,161. రాష్ట్ర సగటు జన సాంద్రత 312 మాత్రమే.
కొత్త వాహనాలు : రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అవుతున్న కొత్త వాహనాల్లో 53 శాతం వాహనాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోనే ఉన్నాయి. రాష్ట్రంలో 9,76,073 వాహనాలు రిజిస్ట్రేషన్ కాగా, ఇందులో 5,18,375 ఈ మూడు జిల్లాల్లోనే ఉన్నాయి.
- తల్లులకు సప్లిమెంటరీ న్యూట్రిషన్ హైదరాబాద్లో 51.79 శాతం మందికి మాత్రమే అందింది. పిల్లలకు సప్లిమెంటరీ న్యూట్రిషన్ నమోదు చేసుకున్న వారిలో 60.3 శాతం మందికే అందింది.
- జీహెచ్ఎంసీ పరిధిలో మొత్తం 9013 కిలోమీటర్ల రోడ్లు ఉండగా ఇందులో 2846 కిలోమీటర్లు బీటీ రోడ్లు, 6167 కిలోమీటర్లు సిమెంట్ కాంక్రీట్ రోడ్లు.
- అత్యధిక డొమెస్టిక్ విద్యుత్ కనెక్షన్లు ఉన్న జిల్లా హైదరాబాద్. ఇందులో 79 వ్యవసాయ కనెక్షన్లు ఉండటం గమనార్హం.
- రాష్ట్రంలో ఉన్న పాఠశాలల్లో అత్యధికంగా మొదటి మూడు స్థానాల్లో రంగారెడ్డి జిల్లా, హైదరాబాద్, మేడ్చల్- మల్కాజిగిరి ఉన్నాయి.
- రంగారెడ్డిలో 2907 స్కూళ్లు ఉన్నాయి. అందులో విద్యార్థులు 7.70 లక్షలు మంది ఉన్నారు.
- హైదరాబాద్లో 2865 స్కూళ్లు ఉండగా విద్యార్థులు 9.02 లక్షలు మంది ఉన్నారు.
- మేడ్చల్-మల్కాజిగిరి 2070 స్కూళ్లు ఉన్నాయి. వాటిలో విద్యార్థులు 7.67 లక్షలు
రాష్ట్రంలో 90 లక్షలకు పైగా రేషన్కార్డులు - 1.19 కోట్ల వంట గ్యాస్ వినియోగదారులు