Rajiv Yuva Vikasam Scheme : నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద రూ.50 వేల నుంచి రూ.4 లక్షల వరకు రుణ సాయం అందించనుంది. ఇందుకు యూనిట్ ఆధారంగా ధర నిర్ణయించారు.
సొంతంగా వ్యాపారం చేసుకునేలా ఎయిర్ కూలర్లు, బేకరీలు, స్టీల్ సామగ్రి, బట్టలు, గాజుల దుకాణం, ఎలక్ట్రిక్ దుకాణం, మగ్గం టైలరింగ్, చెప్పుల షాపు, జ్యూస్ షాపు, కిరాణా, టెంట్ హౌజ్, పేపర్ ప్లేట్ల తయారీ, మెడికల్ అండ్ జనరల్ స్టోర్, చీరలు, సెల్ఫోన్, టీవీల రిపేరింగ్, చికెన్ సెంటర్, కర్రీ పాయింట్, కూరగాయల షాపు ఇలా దాదాపు 75 రకాల యూనిట్లకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది.
అలాగే వీటితో పాటు వ్యవసాయ రంగంలో ఎడ్ల బండ్లు, వేరుసెనగ యంత్రం, ఆయిల్ ఇంజిన్, ఎయిర్ కంప్రెషర్, పంప్సెట్ ఇలా 8 రకాలను యూనిట్గా చేర్చింది. పశు పోషణలో గేదెలు, ఆవులు, కోడిగుడ్ల వ్యాపారం, మేకలు, ఫౌల్ట్రీ వంటి 9 రకాల యూనిట్లు కేటాయించారు. వీటన్నింటిలో ఏదైనా ఒక రకమైన వ్యాపారాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీల రుణాలు వర్తింపజేశారు. ఇందులో ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా అన్ని వర్గాలు కలిపి 34 వేలకు పైగా నిరుద్యోగులు ఈ ఆర్థిక సహాయానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను ఆన్లైన్లో పరిశీలించగా, అధిక మంది కిరాణా, టెంట్హౌజ్ వ్యాపారానికే మొగ్గు చూపినట్లు అధికారులు గుర్తించారు. దీంతో అధికారులు యూనిట్ల మార్పులు చేర్పులకు పలు సూచనలు చేశారు.
మార్చుకోవాల్సినవి :
- ఉపాధి కోసం అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా గ్రామాల్లో ఒకే రకమైన వ్యాపారాలు ముగ్గురు నలుగురు చేస్తే ఎవరికీ గిట్టుబాటు కాదు.
- ఎవరూ ఆర్థికంగా అంతగా లాభం పొందరు.
- అందుకే వేర్వేరు వ్యాపారాలకు దరఖాస్తు చేసుకుంటే అందరికీ ప్రయోజనకరంగా ఉంటుందనేది ప్రభుత్వ ఉద్దేశం.
- ఇటు మున్సిపల్ వార్డుల్లో ఒకేచోట ఒకే రకమైన వ్యాపారాలు నడపకుండా జాగ్రత్త పడనున్నారు.
- ఈ మేరకు క్షేత్రస్థాయిలో అర్హుల పరిశీలనకు వెళ్లినప్పుడు అధికారులు ఒకే రకమైన యూనిట్లు అక్కడ ఎక్కువగా ఉంటే మార్పులు చేసుకోవాలని, వేరే యూనిట్ ఎంచుకోవాలని సూచిస్తున్నారు.
రాజీవ్ యువ వికాసం పథకం - అర్హుల ఎంపికకు దరఖాస్తుల వడపోత
రాజీవ్ యువ వికాసం - పాన్కార్డు తప్పనిసరా? రేషన్కార్డులో ఉన్న భార్యాభర్తలు అప్లై చేసుకోవచ్చా?