Telangana Migrant Workers Facing Problems In Dubai : ఉపాధికి విదేశాల బాటపట్టిన వలస జీవుల కష్టాలు తీరడంలేదు. దశాబ్దాలుగా ఏజెంట్ల మోసాలకు గురికావడం, ప్రమాదాల్లో గాయపడటం, మరణించటం, అప్పులు వేదనతో గుండెపగిలి కుటుంబం పెద్ద దిక్కును కోల్పోవటం వంటి ఎన్నో విషాదాలు నేటికి చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఇద్దరు బాధితులు తమను స్వదేశానికి తీసుకొని వచ్చే ప్రయత్నం చేయానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
స్నేహితుడు చేసిన తప్పుకు జైలు : మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం పెద్దదర్పల్లికి చెందిన ఎం.గోపాల్ తన కుటుంబ ఆర్థిక భారం తట్టుకోలేక 2019 సంవత్సరంలో దుబాయ్కి వలస వెళ్లారు. అక్కడ ఓ కంపెనీలో కార్మికుడిగా పని చేస్తూ కుటుంబానికి చేదోడువాదోడుగా ఉన్నారు. మధ్యలో ఓసారి ఇంటికి వచ్చి వెళ్లారు. గత సంవత్సరం సెప్టెంబరులో స్వదేశానికి రావడానికి సిద్ధం అవుతుతుండగా స్నేహితుడు కలిశాడు. గుర్తింపు కార్డు ఇవ్వమని కోరగా గోపాల్ తాను పని చేస్తున్న కంపెనీకి సంబంధించిన ఉద్యోగ గుర్తింపు కార్డు ఇచ్చారు. స్నేహితుడు నిబంధనలకు విరుద్ధంగా గోపాల్ పేరుతో సిమ్ కార్డు తీసుకుని అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడ్డాడు. దీంతో ఆ తప్పు గోపాల్పై పడింది. తాను పని చేస్తున్న కంపెనీ ఒప్పందం పూర్తి కావడంతో స్వదేశానికి వస్తున్నసందర్భంలో దుబాయ్ ఎయిర్ పోర్టులో గోపాల్ను పోలీసులు అరెస్టు చేశారు. తాను తప్పు చేయకపోయినా సిమ్ కార్డు గోపాల్ పేరుపై ఉండటంతో దుబాయ్ కోర్టు తొమ్మిది వేల దినార్ల జరిమానా విధించింది. అంత నగదు లేకపోవడంతో 3 నెలలు జైలు శిక్షను అనుభవించారు.

అక్కడి ప్రభుత్వం అతని పాస్ పోర్టు సీజ్ చేసి ప్రయాణ నిషేధాన్ని విధించింది. ఆ నిషేధాన్ని ఎత్తివేస్తేనే స్వదేశానికి వచ్చే అవకాశం ఉంది. తాను పని చేసిన కంపెనీ వద్దకు వెళ్లి సమస్యను అధికారులకు విన్నవించినా వారు కనికరించడం లేదు. వారు ఎలాంటి సహాయం చేయడం లేదు. చేతిలో డబ్బులు లేక, నిలువ నీడ కరవై, తినడానికి ఆహారం లేక దుర్భర జీవితం అనుభవిస్తున్నారు. రోడ్లపైనే పడుకుంటున్నారు. తనతో పాటు పని చేసిన కార్మికులు కలిసినప్పుడు ఒక పూట భోజనం చేస్తున్నారు. 2 పూటలు ఖాళీ కడుపుతోనే అలమటిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి తనను ఆదుకోవాలని, తనపై ఉన్న ప్రయాణ నిషేధాన్ని ఎత్తివేసి తన పాస్పోర్టును ఇప్పించి దేశానికి తిరిగి వచ్చేలా చూడాలని ఆ యువకుడు వీడియో సందేశంలో వేడుకుంటున్నాడు. బాధితుడి తల్లితో పాటు, గ్రామస్థులు కూడా గోపాల్ను స్వదేశానికి రప్పించడానికి తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
అప్పులు తీర్చేందుకు వెళ్లారు : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని హనుమాన్నగర్కు చెందిన చొప్పరి లింగం మార్చి 8న దుబాయికి వెళ్లారు. షార్జాలో పవర్ కంపెనీలో కూలీ పనికి కుదిరాడు. నెల తరువాత చేతులు, కాళ్లు వాచాయి. మలమూత్రాలకు వెళ్లాలన్నా ఇతరుల సహాయం తీసుకునే పరిస్థితి తలెత్తింది. కంపెనీ వారు పాస్పోర్టు తీసుకున్నారు. ఆవేదనతో వీడియో చేసి తనకు తెలిసిన వారికి పంపగా వారు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్లలో పోస్టు చేశారు.

హుస్నాబాద్లో నివాసం ఉంటున్న తనకు ఇద్దరు కుమారులు కూలీ పని చేసుకుని జీవనం గడుపుతున్నామని చొప్పరి లింగం భార్య రజిత తెలిపారు. తనకు వైద్యపరంగా ఖర్చులకు సుమారు రూ.5 లక్షలకు పైగా అప్పులు అయ్యాయని, వాటిని తీర్చేందుకు మరో లక్షన్నర అప్పు చేసి దుబాయికి వెళ్లారని అన్నారు. అక్కడ అనారోగ్యంతో వారం రోజుల నుంచి అన్నం కూడా తినడం లేదని వాపోయారు. దుబాయి కంటే ముందు మలేసియా వెళ్లి డ్రైవర్గా చేశారని గుర్తు చేశారు. ఇక్కడకి వచ్చేలా చేస్తే వైద్యం చేయించుకుంటామని తెలిపారు.
గల్ఫ్ వెళ్లినా అప్పులతోనే సావాసం - అవగాహన లేకపోవడమే పెద్దకారణం