Telangana High Court on Teachers Promotions Petition : పదోన్నతులు, బదిలీలతోపాటు నియామకాల ద్వారా ప్రభుత్వం చేపట్టిన స్కూలు అసిస్టెంట్ పోస్టుల భర్తీ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఎస్జీటీలకు పదోన్నతులు ద్వారా ఎంత నిష్పత్తిలో స్కూలు అసిస్టెంట్ పోస్టులు కేటాయించాలన్నది ప్రభుత్వ విధాన నిర్ణయమని తేల్చి చెప్పింది.
స్కూలు అసిస్టెంట్ పోస్టుల్లో పదోన్నతులు : స్కూల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో సెకండరీ గ్రేడ్ టీచర్లకు పదోన్నతులు, ప్రత్యక్ష నియామకాలకు సంబంధించి సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ కె.కిరణ్ కుమార్ మరో 19 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ పి శ్యాంకోశీ, జస్టిస్ నందికొండ నర్సింగరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. 1999 నాటి జీవో 108 కింద స్కూలు అసిస్టెంట్ పోస్టులను ప్రభుత్వం భర్తీ చేస్తోందని అన్నారు. స్కూలు అసిస్టెంట్ పోస్టుల్లో పదోన్నతుల ద్వారా ఎస్జీటీలకు 20 శాతం అంతకంటే తక్కువగా ఉండేలా చూడాలని, అదే విధంగా ప్రత్యక్ష నియామకాల ద్వారా 80 శాతం అంతకంటే ఎక్కువగా ఉండేలా చూడాలని తెలిపారు. ఏర్పడిన ఖాళీలను నోటిఫై చేసి డీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
ఎస్జీటీ పదోన్నతులు ప్రభుత్వ విధాన నిర్ణయం : వాదనలను విన్న ధర్మాసనం ప్రస్తుత పిటిషనర్లు బీఈడీ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేని నిరుద్యోగులని పేర్కొంది. ప్రస్తుతం స్కూలు అసిస్టెంట్ పోస్టులను ప్రత్యక్ష నియామకాల ద్వారా 33.33 శాతం, ఎస్జీటీలకు పదోన్నతులు, బదిలీల ద్వారా 66.66 శాతం భర్తీ చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయమని తెలిపింది. ఎస్జీటీ పదోన్నతులు ప్రభుత్వ విధాన నిర్ణయమని స్పష్టం చేసింది. పాలసీ రూపకల్పనలో భాగంగా ఎస్జీటీలకు పదోన్నతుల కల్పనపై ప్రభుత్వం నిర్ణయించిన నిష్పత్తిని మార్చాలని ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంది. పిటిషనర్లు వ్యక్తిగతంగా కానీ, ప్రతినిధి ద్వారా గానీ తమ అభ్యర్ధనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లవచ్చంటూ పిటిషన్పై విచారణను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.