Food Testing Mobile Labs in Telangana : రెస్టారెంట్లు, హోటళ్లలో ఆహార నాణ్యతపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఫుడ్ క్వాలిటీ పరీక్షలను హైదరాబాద్ లాంటి సిటీలకే పరిమితం కాకుండా ప్రతి జిల్లాలో చేసే ఏర్పాట్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ), భారత ఆహార పరిరక్షణ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటెవ్ మెడిసిన్ (ఐపీఎం)ల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ఫుడ్ ల్యాబ్లను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం జిల్లాల్లో తనిఖీలకు ఐదు మొబైల్ ల్యాబ్లు ఉన్నాయి. అవి హైదరాబాద్ నుంచే వెళ్తుంటాయి. వీటికి అదనంగా మరో 28 మొబైల్ ల్యాబ్లను తీసుకురానున్నారు. ఒక్కోదానికి రూ.50 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా.
అలా చేస్తే నాణ్యత పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం : రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ట్రక్లు, తోపుడు బండ్లు, రెస్టారెంట్లు, రహదారి పక్కన హోటళ్ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. జీహెచ్ఎంసీలోనే 70,000పైగా ఆహార విక్రయ కేంద్రాలు ఉంటాయని ఓ అంచనా. చిరుతిళ్ల తోపుడు బండ్లు, ఫుడ్ట్రక్లు మరో 20,000 వరకు నిర్వహిస్తున్నారు. చాలా వరకు లైసెన్సులు లేకుండానే నడిపిస్తున్నారు. ఆహార పరిరక్షణ విభాగం కింద జిల్లాల్లో తనిఖీల కోసం 32, గ్రేటర్లో 30 సర్కిళ్లు ఉన్నాయి. వీటి పరిధిలోని ఆహార కేంద్రాల తనిఖీకి తగినన్ని ల్యాబ్లు లేవు. సరిపడా తనిఖీ అధికారులు (ఎఫ్ఎస్వోలు) కూడా లేరు. గ్రేటర్లో 30 సర్కిళ్లకు 22 మంది ఎఫ్ఎస్వోలు మాత్రమే ఉన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి అంతటికి హైదరాబాద్లోని నాచారంలో మాత్రమే ప్రధాన ల్యాబ్ ఉంది. ఇక్కడికి నెలకు 1,400 వరకు శాంపిళ్లు వస్తున్నాయి. నిబంధనల ప్రకారం ఒక శాంపిల్ పరిశీలించి 14 రోజుల్లో నివేదిక ఇవ్వాలి. ప్రస్తుతం అంతకంటే ఎక్కువే టైం పడుతోంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో మరో ఐదు ప్రధాన ల్యాబ్ను ఏర్పాటు చేయనున్నారు. వీటితో పాటు మొబైల్ ల్యాబ్లు కూడా అందుబాటులోకి వస్తే హోటళ్ల నిర్వహణలో నాణ్యత పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఆహార ప్రియులకు గుడ్న్యూస్ - కల్తీ ఫుడ్కు త్వరలోనే చరమగీతం!