500 సినిమాల పైరసీ - సినిమా ఇండస్ట్రీకి రూ.3,700 కోట్లు నష్టం : సీవీ ఆనంద్
సినిమాలు పైరసీ చేస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు - పైరసీ ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్టు చేసిన పోలీసులు - సినిమా ఇండస్ట్రీకి దాదాపు రూ.3,700 కోట్లు నష్టం

Published : September 29, 2025 at 11:28 AM IST
|Updated : September 29, 2025 at 3:02 PM IST
Movie Piracy Gang Arrested : సినిమా పరిశ్రమకు పెను సవాల్గా మారిన పైరసీ ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. దేశంలోనే అతి పెద్దదైన ముఠాను ఛేదించి ఆరుగురిని అరెస్టు చేశారు. తెలుగు సహా పలు భాషల సినిమాలను పైరసీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీని ద్వారా సినిమా ఇండస్ట్రీకి దాదాపు రూ.3,700 కోట్లు నష్టం జరిగింది.
గతంలో హ్యాష్ ట్యాగ్ సింగిల్ సినిమా పైరసీపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ చేపట్టి నిందితుడిని జులై 3న వనస్థలిపురంనకు చెందిన కిరణ్ను అరెస్టు చేశారు. అతడిని కస్టడీలోకి తీసుకుని విచారించగా, ఆ పైరసీ ముఠా సభ్యులు దుబాయ్, నెదర్లాండ్, మయన్మార్లో ఉన్నట్లు గుర్తించారు.
ఐడీ, పాస్వర్డ్లను క్రాక్ చేస్తున్న నేరగాళ్లు : ఈటీవీ విన్ కంటెంట్ను పైరసీ చేసి అమ్ముకున్న మరో నిందితుడిని అరెస్టు చేశారు. ఇలా రికార్డ్ చేసి ఒరిజినల్ కంటెంట్ను తీసుకుని ఇతర వెబ్సైట్లకు ముఠా విక్రయిస్తోంది. థియేటర్లలో ప్లే అయ్యే శాటిలైట్ కంటెంట్ ఐడీ, పాస్వర్డ్లను సైతం నేరగాళ్లు క్రాక్ చేస్తున్నారు. కొన్ని సార్లు క్రాక్ అవ్వని పక్షంలో ఏజెంట్లకు కెమెరాలు అందజేసి, రహస్యంగా రికార్డు చేయడాన్ని నేర్పిస్తున్నారు. అనంతరం ఆ ఏజెంట్లకు టికెట్లు బుక్ చేసి మరీ థియేటర్లలో సినిమాలు రికార్డ్ చేస్తున్నారు.
పాప్ కాన్ డబ్బాల్లో కెమెరాలు పెట్టి : చొక్కా జేబు, పాప్ కాన్ డబ్బా, కోక్ టిన్లలో కెమెరాలు పెట్టి చిత్రీకరిస్తున్నారు. ఏజెంట్లకు క్రిప్టో కరెన్సీ రూపంలో నిందితులు కమీషన్లు ఇస్తున్నారు. కేవలం తెలుగు సినిమాలే కాదు, తమిళ్, మళయాళం, హిందీ సినిమాలపై నేరగాళ్లు ప్రత్యేక దృష్టి పెట్టారు. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పైరసీ విధానంపై నిర్మాతలు, నటులకు వివరించనున్నారు. సినిమాలు పైరసీ చేయడం వల్ల తెలుగు చిత్ర పరిశ్రమకు రూ.3,700 కోట్ల మేర నష్టం జరిగిందని సీపీ సి.వి. ఆనంద్ వెల్లడించారు.
'సినిమా పైరసీ వల్ల నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు. టెలిగ్రామ్ ఛానెల్స్, టొరెంట్స్ ద్వారా సినిమాల పైరసీ జరుగుతోంది. కొత్తగా ఎంవో అనే విధానంలోనూ పైరసీ జరుగుతోంది. కొత్తగా విడుదలైన సినిమాలను థియేటర్కు వెళ్లి కెమెరా ద్వారా రికార్డింగ్ చేసి పైరసీకి పాల్పడుతున్నారు. అందరూ విస్తుపోయేలా శాటిలైట్ను కూడా హ్యాక్ చేసి పైరసీ చేస్తున్నారు' - సీవీ ఆనంద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్
ఇప్పటివరకు 500 సినిమాలను పైరసీ : ఈ పైరసీ కేసులో జానా కిరణ్కుమార్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడు. ఈయన సినిమాకు వెళ్లి కెమెరా ద్వారా రికార్డింగ్ చేసి ఆ తర్వాత టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా సిరిల్ రాజుకు పంపించాడు. ఈ ముఠా హైఎండ్ కెమెరా ఉన్న సెల్ఫోన్తో సినిమాను రికార్డింగ్ చేస్తారు. ఇప్పటి వరకు కిరణ్ ముఠా 500 సినిమాలను పైరసీ చేసింది. సినిమాను ప్రత్యేకమైన యాప్ ద్వారా థియేటర్లో రికార్డింగ్ చేశారు. సెల్ఫోన్లను జేబులోనూ, పాప్కార్న్ డబ్బాలో పెట్టి రికార్డింగ్ చేస్తుంటారు. ఈ సమయంలో సెల్ఫోన్ స్క్రీన్లైట్ సైతం ఆఫ్లో ఉంటుంది.
ఎవరికీ అనుమానం రాకుండా : మొబైల్ స్క్రీన్ లైట్ ఆఫ్లో ఉండటంతో ఎవరికీ అనుమానం రాదని ఉద్దేశంతో ఇలా రికార్డింగ్ చేస్తారు.ఇతర భాష చిత్రాలను రికార్డింగ్ చేసేందుకు వీరికి ఏజెంట్లు కూడా ఉన్నారని తెలిపారు. సినిమా పైరసీలకు నెదర్లాండ్స్కు చెందిన ఐపీ అడ్రస్ వాడుతున్నారు. ఈ పైరసీ ముఠాను పట్టుకునేందుకు అత్యాధునిక టెక్నాలజీ వినియోగించారని సీపీ పేర్కొన్నారు. పోలీసులు ఎప్పటికీ పట్టుకోలేని టెక్నాలజీ వాడుతున్నామని నిందితులు తెలిపారు.
''క్రిప్టో కరెన్సీ పేమెంట్స్ ద్వారా కొంత క్లూ దొరికింది. మరో ప్రధాన నిందితుడు పట్నాకు చెందిన అశ్వనీకుమార్ హ్యాకింగ్లో నిపుణుడు. డిజిటల్ మీడియా సర్వర్స్ మొత్తం హ్యాక్ చేసే నైపుణ్యం అతడికి ఉంది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ వెబ్సైట్లను సైతం హ్యాక్ చేశాడు. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ను కూడా హ్యాక్ చేశాడు. ప్రభుత్వ వెబ్సైట్లు హ్యాక్ చేసి ఉద్యోగులు, జీతాల వివరాలు పొందగలిగాడు. పోలీసుల టీమ్ బిహార్లో ఉన్న అతని ఇంటికి వెళ్లింది. అతని ఇంటికి 22 సీసీటీవీ కెమెరాలు అమర్చాడు. పట్నాలో కూర్చుని పలు కంపెనీల సైట్లను హ్యాక్ చేశాడు. నిందితుల వల్ల పలు కంపెనీలు వాళ్ల ఉద్యోగులను అనుమానించే పరిస్థితి వచ్చింది. ఇలా చేయడం ద్వారా ప్రధానంగా బెట్టింగ్, గేమింగ్ యాప్ నిర్వాహకులను పోత్సహిస్తున్నది. పైరసీ సైట్లలోని లింక్లను క్లిక్ చేస్తే యూజర్ వివరాలన్నీ పైరసీ ముఠాకు వెళ్తాయి.''- సీవీ ఆనంద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్
పైరసీ ద్వారా లక్ష డాలర్లు : నిందితులు ఈసీ వెబ్సైట్ను హ్యాక్ చేసి ఎన్నికల జాబితాను మాత్రమే చూశారు. పైరసీ ద్వారా నిందితులు లక్ష డాలర్ల వరకు సంపాదించారు. ఈటీవీ కంటెంట్ను హర్షవర్ధన్ అనే వ్యక్తి పైరసీ చేశాడు. అతడు సాఫ్ట్వేర్ ఉద్యోగి సినిమాలను పైరసీ చేయడంతో సహజ సేవ ఏమీలేదు. పైరసీలు చేసి బెట్టింగ్ యాప్ల ద్వారా డబ్బు సంపాదించారు. నిందితుడు సిరిల్ అనే వ్యక్తి నెదర్లాండ్, ప్యారిస్ ఐపీ అడ్రస్లు పెట్టి సినిమాలు పైరసీ చేసి అప్లోడ్ చేస్తున్నాడు. బెట్టింగ్ యాప్ల నిర్వాహకులు నెలకు రూ.9లక్షల ఇస్తున్నారు. ఇప్పటి వరకు 500 సినిమాలు పైరసీ చేసినట్లు గుర్తించారని సీవీ ఆనంద్ తెలిపారు.
విడుదలైన రోజే HD క్వాలిటీలో ఆన్లైన్లో - కొత్త సినిమాల పైరసీ దొంగ దొరికేశాడు
'ఐపీటీవీ' చూస్తున్నారా? - వెంటనే అలా చేయండి - లేదంటే తట్టాబుట్టా సర్ధాల్సిందే!

