Telangana CM Revanth Reddy on KTR Arrest Issue : తాము కక్షపూరిత రాజకీయాలు చేయాలనుకుంటే కేటీఆర్ ఇప్పటికే చంచల్గూడ జైలులో ఉండేవారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అసెంబ్లీలో ఆయన బడ్జెట్పై చర్చకు సమాధానం ఇచ్చారు. అనుమతి లేకుండా ఎవరైనా డ్రోన్ ఎగరవేస్తే రూ.500 జరిమానా విధిస్తారని, డ్రోన్ ఎగరవేశారని ఒక ఎంపీ మీద కేసు పెట్టి చర్లపల్లి జైలులో వేశారని గుర్తు చేశారు. రూ.500 జరిమానా వేసే కేసులో తనను జైలులో పెట్టి వేధించారని ఆరోపించారు. తన బిడ్డ పెళ్లికి కూడా మధ్యంతర బెయిలుపై వచ్చి వెళ్లానని గుర్తు చేసుకున్నారు.
తాను కూడా అలా ప్రతీకార రాజకీయాలు చేయదలిస్తే ఇప్పటికే కొందరు జైలులో ఉండేవారని అన్నారు. కేటీఆర్, కేసీఆర్కు జైలులో డబుల్బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇస్తానని అన్నానని గుర్తు చేశారు. కానీ అక్రమ కేసులు పెట్టి వాళ్లను జైలుకు పంపే కక్ష రాజకీయాలు చేసే వ్యక్తిని కాదని, కేటీఆర్, కేసీఆర్ను జైలులో వేయాలని చాలామంది మమ్మల్ని అడుగుతున్నారని అన్నారు.
రూ.7625 కోట్లు తాము చెల్లించాం : బీఆర్ఎస్ మొదటి విడత ప్రభుత్వం కేవలం రూ.13 వేల కోట్లు రుణమాఫీ చేసిందని, తొలి విడత రుణమాఫీకి ఐదేళ్లు తీసుకున్నారని, రెండోసారి గెలిచాక రుణమాఫీని అసలు పూర్తే చేయలేదని సీఎం ఆరోపించారు. నాలుగేళ్ల తర్వాత మాత్రం రూ.11 వేల కోట్ల రుణమాఫీ చేశారని, నాలుగేళ్ల తర్వాత రుణమాఫీ చేసినందుకు వాటికి వడ్డీ రూ.8500 కోట్లు పైగా అయ్యిందని అన్నారు. తాము అధికారంలోకి వచ్చిన ఆర్నెళ్లలోనే రూ.26 వేల కోట్లు రుణమాఫీ చేశామని తెలిపారు. ఎన్నికల కోడ్ అడ్డుపెట్టుకుని రైతుబంధు కూడా వేయలేదని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ఎగవేసిన రైతుబంధు రూ.7625 కోట్లు తాము చెల్లించామని అన్నారు.
వరి వేస్తే ఉరే అని స్వయంగా సీఎం బెదిరించారని, తాము మాత్రం వరి వేసిన వారికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చామని గుర్తు చేశారు. రైతుల ఉచిత కరెంట్ కోసం రూ.33 వేల కోట్లు ఖర్చు చేశామని, గత ప్రభుత్వం పదేళ్లలో చేయని పనులు మేం పది నెలల్లో చేశామని పేర్కొన్నారు. వడగళ్ల వానతో పంట నష్టం జరిగితే గత ప్రభుత్వం ఏనాడు పరిహారం చెల్లించలేదని, వడగళ్ల వానతో పంట నష్టం జరిగితే గత ప్రభుత్వం ఏనాడు పరిహారం చెల్లించలేదని ఆరోపించారు.
57,946 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం : 2014లో తెలంగాణ ఏర్పడిన రోజు రాష్ట్ర అప్పు రూ.72 వేల కోట్లని, కార్పోరేషన్ అప్పులు కూడా కలిపితే రూ.90 వేలో కోట్ల అప్పని గుర్తు చేశారు. ఈ పదేళ్లలో ఎఫ్ఆర్బీఎం అప్పులే రూ.3.50 లక్షల కోట్లు దాటిందని, తమకు అధికారం అప్పగించేనాటికి ఉన్న అప్పు రూ.6.69 లక్షల కోట్లని తెలిపారు. పెండింగ్ బిల్లులే రూ.40వేల కోట్లు పెట్టిపోయారని, కేసీఆర్ దిగిపోయే నాటికి అన్ని అప్పులు కలిపితే రూ.8.19 లక్షల కోట్ల అప్పు ఉందని అన్నారు.
తాము 15 నెలల్లో రూ.1.58 లక్షల కోట్లు అప్పు చేశామని, కొత్తగా చేసిన అప్పులో రూ.1.53 లక్షల కోట్లు పాత అప్పులకే చెల్లించామని చెప్పారు. కూలిపోయిన కాలేశ్వరానికి కూడా రూ.5వేల కోట్లకు పైగా చెల్లించామని, గత ప్రభుత్వం చేసిన అప్పుల చెల్లింపులకే వచ్చే ఐదేళ్లలో రూ.6 లక్షల కోట్ల అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వివరించారు. నోటిఫికేషన్లు వేయటం, కేసులు వేసిన నియామకాలు నిలిపివేయటం గత ప్రభుత్వం చేసిన పని అని, ఈ ప్రభుత్వం 15 నెలల్లోనే 25 శాఖల్లో 57,946 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని అన్నారు.
మేడిగడ్డ మూడేళ్లకే కూలింది : గత సీఎం డాక్టర్, ఇంజినీర్, డిజైనర్ తానే అంటూ కాళేశ్వరం కట్టారని ఎద్దేవా చేశారు. సీనియర్లు ఇంజినీర్లు చెప్తే కూడా వినకుండా మేడిగడ్డ వద్ద ప్రాజెక్టు నిర్మించారని, ఇంజినీర్లు చెప్తే వినకుండా నిర్మించిన మేడిగడ్డ మూడేళ్లకే కూలిందని, ఏడో వింత అని గొప్పగా చెప్పుకుంటే మూడేళ్లకే పనికిరాకుండా పోయిందని అన్నారు. ఇప్పుడు నీళ్లు నిలిపితే మొత్తానికే కూలుతుందని జాతీయ డ్యామ్ సేఫ్టీ నిపుణులు చెప్తున్నారని తెలిపారు. దశాబ్దాల క్రితం కాంగ్రెస్ నిర్మించిన ప్రాజెక్టుల వల్లే రాష్ట్రంలో వరి దిగుబడి పెరిగిందని కొనియాడారు. కాంగ్రెస్ ఘనతలను బీఆఎర్ఎస్ ఘనతగా చెప్పుకోవటం సిగ్గుచేటని వెల్లడించారు.
పరిహారం పెంచాలని మాత్రమే ధర్నాలు చేశా : మల్లన్నసాగర్ కింద రైతులు ఆందోళన చేయలేదా? అని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. 14 గ్రామాల ప్రజలను పోలీసులతో కొట్టించి బలవంతంగా భూసేకరణ చేశారని ఆరోపించారు. ప్రాజెక్టుల వద్ద ఎవరికి భూములు, ఫామ్హౌజ్లు ఉన్నాయో నిజనిర్ధారణ కమిటీ వేద్దామా? అని నిలదీశారు. కేసీఆర్ ఫామ్హౌజ్ చుట్టూ కాలువలు తీసింది నిరూపిస్తానని, ప్రాజెక్టుల కోసం పేదల భూములు తీసుకుని కేసీఆర్, వాళ్ల బంధువుల భూములు తప్పించారని ఆరోపించారు. తాను భూసేకరణను వ్యతిరేకించలేదని, పరిహారం పెంచాలని మాత్రమే ధర్నాలు చేశానని గుర్తు చేశారు. కమీషన్ల కోసం ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేశారని, రూ.36వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టును పక్కకు పెట్టారని, కమీషన్ల కోసం రూ.లక్ష కోట్ల నిధులతో కాళేశ్వరం చేపట్టారని అన్నారు.
పెద్దాయనను నాలుగు కాలాలు బతకనీయండి : కాళేశ్వరం అవినీతి విషయంలో త్వరలోనే వీళ్లు జైలుకు వెళ్తారని, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఏకసభ్య కమిషన్ నివేదిక ఇచ్చిందని తెలిపారు. మూసీని పునరుద్ధరించాలా వద్దా? విపక్షాలు చెప్పాలని, మెట్రోరైలు విస్తరించాలా వద్దా చెప్పాలని, ఆర్ఆర్ఆర్కు రేడియల్ రోడ్లు నిర్మించాలా వద్దా చెప్పాలని ప్రశ్నించారు. ప్రభుత్వ స్కూల్లో చదివిన వ్యక్తి సీఎం అయితే ఓర్వలేక పోతున్నారని, నాలుగు ఇంగ్లీష్ ముక్కలు ఎక్కువ వచ్చినంత మాత్రాన గొప్ప కాదని అన్నారు. పెద్దాయన కుర్చీ కోసం మీలో మీరే కొట్లాడవద్దని అన్నారు. పెద్దాయనను ఖతం చేసి ఆయన కుర్చీలో కూర్చుందామని చూడొద్దని, పెద్దాయనను నాలుగు కాలాలు బతకనీయండని తెలిపారు.
"మేం కక్షపూరిత రాజకీయాలు చేయాలనుకుంటే కేటీఆర్ ఇప్పటికే.. చంచల్గూడ జైలులో ఉండేవారు. అనుమతి లేకుండా ఎవరైనా డ్రోన్ ఎగరవేస్తే రూ.500 జరిమానా విధిస్తారు. డ్రోన్ ఎగరవేశారని ఒక ఎంపీ మీద కేసు పెట్టి చర్లపల్లి జైలులో వేశారు. రూ.500 జరిమానా వేసే కేసులో జైలులో పెట్టి వేధించారు. నా బిడ్డ పెళ్లికి కూడా మధ్యంతర బెయిలుపై వచ్చి వెళ్లాను. కేటీఆర్, కేసీఆర్ను జైలులో వేయాలని చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు"- రేవంత్ రెడ్డి, సీఎం
'అసెంబ్లీ నియోజకవర్గాలు 153కు పెంచాలి' - డీలిమిటేషన్కు వ్యతిరేకంగా శాసనసభలో తీర్మానం