Telangana Cabinet Meeting : తెలంగాణ రైజింగ్-2047 విజన్ పాలసీ డాక్యుమెంట్ తయారు చేయాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు వెలువరించిన అనంతరమే ముందుకెళ్లాలనే అభిప్రాయం వ్యక్తమైంది. రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలు ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు రీజనల్ రింగ్రోడ్డు ప్రాజెక్టు, తెలంగాణ రాష్ట్ర క్రీడా పాలసీకి మంత్రిమండలి ఆమోదించింది.
బనకచర్ల ప్రాజెక్టు ముందుకెళ్లకుండా : సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన సుమారు ఐదున్నర గంటల పాటు మంత్రివర్గం సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు గట్టిగా వ్యతిరేకించాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. చట్టపరంగా, న్యాయపరంగా అన్ని చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. తీవ్రంగా శ్రమించైనా సరే బనకచర్ల ప్రాజెక్టు ముందుకెళ్లకుండా అడ్డుకోవాలని తీర్మానించింది.
బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకునేందుకు చట్టపరంగా అన్ని చర్యలు చేపట్టి, ఎంతవరకైనా పోరాడాలని రాష్ట్ర మంత్రివర్గం తీర్మానించింది. విభజన చట్టంలోని పెండింగ్ అంశాల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల అధికారుల కమిటీలు సమావేశం కావాలని నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను ఈ నెల 30 నాటికి జస్టిస్ ఘోష్ కమిషన్కు ఇవ్వాలని తీర్మానించింది.
జులై మొదటి వారంలో సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరికీ బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలన్నీ పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల అధికారుల కమిటీ సమావేశంలో చర్చించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అధికారుల కమిటీ సమావేశం ఏర్పాటు కోసం ఏపీ ప్రభుత్వానికి లేఖ రాయనున్నారు.
201 కిలోమీటర్ల అలైన్మెంట్ : ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం మార్గానికి మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు 201 కిలోమీటర్ల అలైన్మెంట్కు ఆర్అండ్బీ రూపొందించిన మూడు మార్గాలను పరిశీలించి పచ్చజెండా ఊపింది. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లలో డిసెంబరు 9 నాటికి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తెలంగాణ రైజింగ్-2047 విజన్ పాలసీ డాక్యుమెంట్ రూపొందించాలని కేబినెట్ నిర్ణయించింది.
తెలంగాణ రైజింగ్-2047 విజన్ పాలసీ : డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం సందర్భంగా ఈ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించాలని నిర్ణయించారు. తెలంగాణ రైజింగ్ విజన్ రూపకల్పన, ప్రణాళికల తయారీకి వివిధ రంగాల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయి ప్రముఖులు, నిపుణులతో అడ్వైజరీ కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2035 నాటికి ట్రిలియన్ డాలర్ 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా వృద్ధి సాధించాలనే లక్ష్యంతో డాక్యుమెంట్ తయారు చేయనున్నారు.
"ఈరోజు అమెరికా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అగ్రస్థానంలో ఉంది. అనంతరం చైనా రెండో ప్లేస్లో ఉంది. ఆర్థికంగా భారతదేశం మరింత అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో తెలంగాణలో 2047 - విజన్ డాక్యుమెంట్ తీసుకురాబోతున్నాం. అన్ని శాఖల నుంచి వచ్చే సమాచారం తెలుసుకుంటూ సుస్థిర అభివృద్ధితో భారత్ ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఏర్పడేందుకు క్యాబినెట్ ఆలోచన ప్రకారం నిర్ణయం తీసుకున్నాం" -పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ మంత్రి
కాళేశ్వరం ప్రాజెక్టు : కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు ఇవ్వాలని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రాసిన లేఖపైనా మంత్రిమండలిలో సుదీర్ఘ చర్చ జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి రాసిన లేఖపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం వద్ద ఉన్న పూర్తి వివరాలను ఈ నెల 30లోగా కమిషన్ కు అందివ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సీఎస్ రామకృష్ణారావు, సీఎంవో ముఖ్యకార్యదర్శి శేషాద్రి, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా కమిటీకి ఈ బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది.
అన్ని శాఖలు, అన్ని విభాగాలు ఇందులో భాగస్వామ్యం పంచుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఆశించిన వృద్ధి లక్ష్యంగా ఎంచుకునే కార్యక్రమాలు, చేపట్టాల్సిన కార్యాచరణను విజన్ డాక్యుమెంట్లో పొందుపరుస్తారు. విజన్ డాక్యుమెంట్ తయారీకి నీతి అయోగ్తో పాటు, ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్ రాష్ట్ర ప్రభుత్వానికి నాలెడ్జ్ పార్టనర్గా వ్యవహరిస్తారు.
రైతులు, యువకుల సంక్షేమానికి : కేంద్రం ప్రకటించిన వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా అన్ని రంగాల్లో సుస్థిర సమ్మిళిత అభివృద్ధి, రాష్ట్రం లో మౌలిక సదుపాయల వృద్ధి తో పాటు మహిళలు, రైతులు, యువకుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. దేశ ఎకానమీలో పదో వంతు సంపదను అందించే రాష్ట్రంగా తెలంగాణ వృద్ధి సాధించాలనే భారీ లక్ష్యం తో ఈ విజన్ రూప కల్పన చేయాలని కేబినెట్ అధికారులకు దిశా నిర్దేశం చేసింది.
స్పోర్ట్స్ హబ్ బోర్డు ఆఫ్ గవర్నెన్స్ : తెలంగాణ స్పోర్ట్స్ పాలసీకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. పాలసీ లో భాగంగా తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు ఆఫ్ గవర్నెన్స్ ఏర్పాటు కానుంది. తెలంగాణ క్రీడా అభివృద్ధి నిధిని ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో క్రీడా అభివృద్ధికి ప్రతి ఏడాది కలెక్టర్ల వద్ద ఉండే క్రూషియల్ బ్యాలెన్స్ ఫండ్లో పది శాతం కేటాయించాలని నిర్ణయించారు. స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్లకు అర్హత జాబితాలో సీఎం కప్ రాష్ట్ర స్థాయి విజేతలకు అవకాశం కల్పించాలని కేబినెట్ నిర్ణయించింది.
స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాతే వ్యూహం ఖరారు చేయాలని కేబినెట్లో అభిప్రాయం వ్యక్తమైంది. పరిపాలన సంస్కరణల్లో భాగంగా ఇకపై ప్రతి మూడు నెలలకోసారి కేబినెట్ సమావేశాన్ని స్టేటస్ రిపోర్ట్ మీటింగ్ గా నిర్వహించాలని నిర్ణయించారు. ఆ మూడు నెలల్లో జరిగిన కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు పై ఈ ప్రత్యేక భేటీలో సమర్పించి చర్చిస్తారు.
మూడు నెలల ప్రత్యేక భేటీకి మంత్రివర్గంతో పాటు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు ఈ సమావేశం లో పాల్గొంటారు. ఎలక్ట్రానిక్ విధానంలో కేబినెట్ సమావేశాల నిర్వహణ కోసం ఈ-కేబినెట్ విధానానికి మంత్రివర్గం ఆమోదించింది. సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇస్నాపూర్ మున్సిపాలిటీని అప్గ్రేడ్ చేయాలని నిర్ణయించింది.
క్యాన్సర్ నివారణ కోసం : రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మున్సిపాలిటీల్లో కమిషనర్లతో పాటు వివిధ విభాగాల్లో 316 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో క్యాన్సర్ నివారణ కోసం ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేయుడును సలహాదారుడిగా నియమించాలని కేబినెట్ నిర్ణయించింది. మహబూబ్నగర్లో బాసర ట్రిపుల్ ఐటీ, హుస్నాబాద్లో శాతవాహన యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ, కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీ లా కాలేజీలో ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులను ప్రారంభించేందుకు కేబినెట్ నిర్ణయించింది.
తెలంగాణ కేబినెట్ విస్తరణ - ప్రమాణ స్వీకారం చేసిన నూతన మంత్రులు
ఉద్యోగులకు 2 డీఏలు - మహిళా సంఘాల సభ్యులు మృతి చెందితే రూ.10 లక్షలు