Mall Practice In Tenth Class Exams: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే వారిని గాడి తప్పేలా చేస్తే ఆ విద్యార్థి జీవితం ఆగమ్యగోచరంగా తయారవుతుంది. ఈ ఉదంతం ఎక్కడో సినిమాల్లో జరిగిందనుకుంటే మీరు పొరబడినట్లే. పదో తరగతి పరీక్షల్లో చూచిరాతకు సహకరించిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది. రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతో జిల్లా విద్యాశాఖను అప్రమత్తం చేసి దాడులు చేయడంతో అసలు బండారం బయటపడింది. వివరాల్లోనికి వెళ్తే
అసలేం జరిగిందంటే? ఎచ్చెర్ల మండలం, కుప్పిలి ఆదర్శ పాఠశాలలో పదో తరగతి పరీక్షలకు రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులోని మొదటి కేంద్రంలో 207 మంది, రెండవ కేంద్రంలో 218 మంది విద్యార్థులకు కేటాయించారు. జిల్లా విద్యాశాఖాధికారి తిరుమల చైతన్య ఆదేశాల మేరకు నాలుగు స్క్వాడ్ బృందాలు శుక్రవారం ఆయా కేంద్రాలపై ఏకకాలంలో దాడులు చేశాయి. విద్యార్థులు ఆంగ్ల పరీక్షను చూసి రాస్తున్నట్లు గుర్తించారు. ఇందుకు సహకరించిన సిట్టింగ్ స్వ్కాడ్ ఎంవీ కామేశ్వరరావు, డిపార్టుమెంట్ అధికారులు బీవీ సాయిరాం, పి.హరికృష్ణ, ఇన్విజిలేటర్లు ఎం.కనకరాజు, ఎస్.కృష్ణ, పి.నాగేశ్వరరావు, కె.కామేశ్వరరావు, ఎ.శ్రీరాములునాయుడు, ఎస్.శ్రీనివాసరావు, బి.రామ్మోహన్రావు, పి.ఫల్గుణరావులను, బోధనేతర సిబ్బంది ఒకరిని డీఈవో సస్పెండ్ చేశారు. ఏ కేంద్రంలో ముగ్గురు, బీ కేంద్రంలో ఇద్దరు విద్యార్థులను డిబార్ చేశారు.
ఆర్జేడీకి నివేదిక: కుప్పిలిలోని జడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులే స్లిప్పులు తయారు చేసి ఆదర్శ పాఠశాల కేంద్రంలో పరీక్ష రాస్తున్న విద్యార్థులకు అందజేస్తున్నారు. ఇక్కడ సిట్టింగ్ స్వ్కాడ్ ఉన్నప్పటికీ పక్కా ప్రణాళికతో విచ్చలవిడిగా చూచిరాతకు సహకరిస్తుండటాన్ని గమనించిన తనిఖీ బృందాలు నిర్ఘాంతపోయాయి. అందుకుగాను కుప్పిలి జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జె.పద్మకుమారి, చీఫ్ సూపరింటెండెంట్లు పీవీ దుర్గారావు ఎం.లక్ష్మణరావులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ డీఈవో ఆర్జేడీకి నివేదికను పంపారు.
పదో తరగతి పరీక్షల మాల్ ప్రాక్టీస్లో దర్యాప్తు ముమ్మరం.. వెలుగులోకి కీలక అంశాలు
పదో తరగతి పేపర్ లీకేజీ కేసు.. ఏ 1గా బండి సంజయ్.. పరారీలో మరో నలుగురు