TEACHER TEACHING CALLIGRAPHY: విద్యార్థుల్లో చదువుపై జిజ్ఞాస పెంచడంతో పాటు వారి చేతిరాతను సైతం మారుస్తున్నారు ఆ ఉపాధ్యాయుడు. గుంటూరు సమీపంలోని పొత్తూరు జడ్పీ ఉన్నత పాఠశాల గణిత ఉపాధ్యాయుడు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఉప్పాల రామ్మోహనరావు వేల మంది విద్యార్థులకు చేతిరాత శిక్షణ ఇస్తున్నారు.
ఇలా ఇప్పటివరకు సుమారు 60,000 మంది విద్యార్థులతో పాటు, 4,900 మంది ఉపాధ్యాయుల చేతిరాతను సైతం మార్చే క్రతువులో భాగస్వాములయ్యారు. సుమారు 123 ట్రైనింగ్ క్యాంప్లు నిర్వహించారు. తొలుత ఆయన విద్యార్థులకు చేతి రాతను మార్చేందుకు రాత పుస్తకాలు ఫ్రీ ఇచ్చేవారు. స్వయానా తానే రాసి చూపిస్తే సత్ఫలితాలుంటాయని భావించారు. అయితే తన చేతిరాత బాగోలేక పోవడంతో రామ్మోహనరావు ఒంగోలు నుంచి ట్రైనర్ని పిలిపించుకొని, తోటి ఉపాధ్యాయులతో కలిసి కాలీగ్రఫీలో శిక్షణ తీసుకున్నారు.
తరువాత కాలీగ్రఫీ పాఠాలను తమ విద్యార్థులకు సైతం నేర్పించారు. క్రమంగా విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తూ, వారి సాయంతో చేతిరాత మార్పు ఉద్యమాన్ని రామ్మోహనరావు కొనసాగిస్తున్నారు. చేతిరాత బాగోలేక తక్కువ మార్కులు వచ్చిన వారిని ఉదాహరణలతో వివరిస్తున్నారు. ఇదే సమయంలో ‘రాతే మన భవిత’ అనే పుస్తకాన్ని క్యూఆర్ కోడ్తో తీసుకొచ్చారు. ఏవైనా ప్రభుత్వ స్కూళ్లు ఆహ్వానిస్తే ఆదివారం, సెలవు రోజుల్లో ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాలు, కర్నూలు జిల్లాలకు వెళ్లి రామ్మోహనరావు ట్రైనింగ్ క్యాంప్లు నిర్వహిస్తున్నారు.

పిల్లలను పర్యవేక్షించేందుకు కాలీగ్రఫీ ఫ్యామిలీ పేరుతో వాట్సప్ గ్రూప్ సైతం క్రియేట్ చేశారు. దీనివల్ల చేతి రాత మెరుగుపడి ప్రతి సబ్జెక్టులో నాలుగైదు మార్కులు ఎక్కువగా వస్తున్నాయని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. అందమైన చేతి రాత విద్యార్థి వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మవిశ్వాసానికి దోహదపడుతుందని ఉప్పాల రామ్మోహనరావు అంటున్నారు. విద్యార్థులు నలుగురిలో ప్రత్యేక గుర్తింపు సాధిస్తారని చెప్తున్నారు. నెెల్లూరులో శిక్షణ పొందిన పలువురు విద్యార్థులు ఏ టీమ్గా ఏర్పడి రెండేళ్లలో 10,000 మంది విద్యార్థులకు, 900 మంది ఉపాధ్యాయులకు ట్రైనింగ్ ఇచ్చారని తెలిపారు. ఈ ఏడాది చివరినాటికి లక్ష మంది విద్యార్థులకు, 10,000 మంది ఉపాధ్యాయులకు శిక్షణనిస్తామన్నారు.
ఆకలితో పాఠశాలకు పిల్లలు - సొంత ఖర్చులతో టిఫిన్ అందిస్తున్న ఉపాధ్యాయుడు
భావితరాల కోసం తెలుగు ఉపాధ్యాయుడి తపన - 247 దేశాల నాణేలు సేకరణ