Telangana Gurukul Schools Students In Jee Mains : రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్ధ విద్యార్థులు జేఈఈ ఫలితాల్లో తమ సత్తా చాటారు. జేఈఈ మెయిన్స్ 2025లో గురుకులాలకు చెందిన 525 మంది విద్యార్థులు 61 పర్సెంటైల్ కంటే అధికంగా మార్కులు సాధించి అడ్వాన్స్కు అర్హత సాధించారని గురుకులాల కార్యదర్శి డాక్టర్ అలుగు వర్షిణి వెల్లడించారు. గురుకుల పాఠశాలల చరిత్రలోనే తొలిసారి ఇంత మంది ఎంపికయ్యారని ఆమె పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి చొరవతో ప్రైవేటు కోచింగ్ సంస్థలకు ధీటుగా తమ విద్యార్థులకు జేఈఈ శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. జేఈఈ 2025 మెయిన్స్లో జనవరి, ఏప్రిల్లో రెండు విడతల్లో జరిగిన పరీక్షల్లో 90 ఆపై పర్సెంటైల్ సాధించిన విద్యార్థులు 40మంది, 80 ఆపై పర్సెంటైల్ సాధించిన విద్యార్థులు 164 మంది ఉన్నారని వివరించారు.
అద్భుతమైన ప్రతిభతో : గౌలిదొడ్డి బాలుర కళాశాలకు చెందిన ఆర్.మణి దీప్ 99.03, కె. చరణ్ తేజ్ 98.30, రామ్ చరణ్ తేజ 98.08, అలాగే బాలికల కళాశాల విద్యార్థినిలు బి.తేజస్విని 98.27, షేక్ పేట గురుకులానికి చెందిన టి. అఫ్రయాం 97.87, నల్గొండ జిల్లా జీవీ గూడెం కళాశాలకు చెందిన కె.కీర్తన 96 .71 పర్సెంటైల్లను సాధించి ముందంజలో ఉన్నారని గురుకులాల కార్యదర్శి వివరించారు.
మంచి విజయాలు : ర్యాంకులు సాధించిన వారిలో నిరుపేద దళిత, రోజు కూలి, పారిశుధ్య కార్మికులు, దినసరి కూలీలకు చెందిన పిల్లలే ఉండడం మరో విశేషం. ఈ సందర్భంగా విజయాలు సాధించిన విద్యార్ధులను, వారి తల్లిదండ్రులను, అందుకు కృషి చేసిన సిబ్బందిని, సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్, గురుకులాల కార్యదర్శి డాక్టర్ అలుగు వర్షిణి ప్రత్యేకంగా అభినందించారు.
నిన్న అర్థరాత్రి విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జనరల్ విభాగంలో 93.102, ఈడబ్ల్యూఎస్- 80.383, ఓబీసీ-79.431, ఎస్సీ-61.15, ఎస్టీ-47.90 పర్సంటైల్ స్కోర్ను కటాఫ్గా నిర్ణయించారు. ఈ స్కోర్కు సమానం, అంతకంటే ఎక్కువ స్కోర్ పొందిన వారికి మాత్రమే మే 18వ తేదీన నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అర్హత లభిస్తుంది.
గురుకులాల్లో కాబోయే సాప్ట్వేర్ ఇంజినీర్ల తయారీ!
ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలల నిర్మాణానికి రూ.11 వేల కోట్లు - మంజూరు చేసిన విద్యాశాఖ