Srikakulam SSC Student Commits Death : నేటి సమాజంలో చాలా మంది యువత చిన్నచిన్న కారణాలకే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంలో వారు తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలు ఎన్నో జీవితాల్ని తలకిందులు చేస్తున్నాయి. అప్పటి వరకు, ఆ క్షణం ముందు వరకు మనతో, మన మధ్యనే ఉంటున్న వారు శాశ్వతంగా మన మధ్య నుంచి దూరమైపోయారనే మాటే వారి కుటుంబాల్లో కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రేమలో విఫలమయ్యామని ఒకరు, పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని మరొకరు, తల్లిదండ్రులు మందలించారని ఇంకొందరు. ఇలా వివిధ కారణలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కారణం ఏదైనా విలువైన జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ఫలితంగా అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాలతో తమను నమ్ముకున్న వారిని విషాదంలోకి నెడుతున్నారు.
ఇటీవలే ఆ విద్యార్థి పదో తరగతి పరీక్షలు రాశాడు. ఇవాళ వాటి ఫలితాలను విడుదల చేశారు. ఈ క్రమంలో అందులో తక్కువ మార్కులు వచ్చాయని మనస్తాపం చెందాడు. దీంతో ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన శ్రీకాకుళంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. శ్రీకాకుళంలోని బలగ ప్రాంతానికి చెందిన గురుగుబిల్లి వేణుగోపాలరావు 10వ తరగతి పరీక్షలు రాశాడు.
SSC Student Ends Life : ఈరోజు విడుదలైన ఫలితాల్లో ఆ విద్యార్థికి 393 మార్కులు వచ్చారు. ఈ నేపథ్యంలో మార్కులు తక్కువ వచ్చాయని వేణుగోపాలరావు తీవ్ర మనస్తాపానికి లోనయ్యాడు. ఈ క్రమంలోనే ఇంట్లోని గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు తలుపులు తెరచి చూడగా విగతజీవిగా పడి ఉన్నాడు. ఇది చూసి తల్లిదండ్రులు ఒక్కసారిగా హతాశులయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై రెండో పట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎంతో కష్టపడి చదివించామని కానీ ఇలా తమకు దూరమవుతాడని, గుండె కోత మిగులుస్తాడని కలలో కూడా ఊహించలేదంటూ గుండెలవిసేలా రోదించిన తీరు అక్కడి వారిని కలచివేసింది.