Srikurmam Tortoises Death Incident : శ్రీకాకుళం జిల్లా గార మండలం శ్రీకూర్మంలోని ప్రసిద్ధ కూర్మనాథ క్షేత్రంలో నక్షత్ర తాబేళ్ల మరణాలు భక్తులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇక్కడ రెండు రోజులుగా సుమారు 15కు పైగా కూర్మాలు మృత్యువాత పడినట్లు సమాచారం. ఈ విషయాన్ని అధికారులు, తాబేళ్ల సంరక్షణ గుత్తేదారు దృష్టికి తీసుకెళ్లకుండా సిబ్బంది గుట్టుగా దహనం చేసేస్తున్నారు.
ఆదివారం ఉదయం మరణించిన కొన్ని కూర్మాలను అక్కడ పని చేసే ఓ వ్యక్తి శ్వేతపుష్కరిణి ఒడ్డున పడేయడాన్ని భక్తులు గమనించారు. అక్కడకు వెళ్లి చూడగా ఏడు మృతి చెందిన కూర్మాలు, కాలిపోయిన స్థితిలో మరో 9 తాబేళ్ల కళేబరాలు కనిపించాయి. వెంటనే వారు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు.
పర్యవేక్షణ లోపమే కారణం : కూర్మనాథ క్షేత్రం పార్కులో 187 వరకు నక్షత్ర తాబేళ్లు ఉన్నాయని సిబ్బంది పేర్కొంటున్నారు. వీటి సంరక్షణ బాధ్యతలను ఓ గుత్తేదారుకు అప్పగించారు. ఆయన శ్రీకాకుళంలో ఉండడం, స్థానికంగా ఈవో కూడా అందుబాటులో లేకపోవడంతో పూర్తిగా పర్యవేక్షణ కొరవడింది. నిబంధనల ప్రకారం మృత్యువాత పడిన కూర్మాలకు పోస్ట్మార్టం నిర్వహించి ఖననం చేయాలి.
ఇవేమీ ఇక్కడ జరగకపోగా క్షేత్ర ప్రతిష్ఠ దెబ్బతినేలా వాటిని దహనం చేయడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై గుత్తేదారు రమణమూర్తిని వివరణ కోరగా ఆదివారం రెండు కూర్మాలు మాత్రమే చనిపోయినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. మరోవైపు దీనిపై స్పందించిన దేవదాయశాఖ సహాయ కమిషనర్ (ఇంఛార్జ్) భద్రాజీ సిబ్బందితో మాట్లాడి ఏం జరిగిందో తెలుసుకుంటామని వివరించారు.