Special Story On Vanjangi Hills In Paderu : ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సమీపంలోని వంజంగి మేఘాల కొండకు పర్యాటకులు విశేషంగా తరలివచ్చారు. మంచు దుప్పటి కప్పినట్లుగా ఉండే ఈ ప్రాంతంలో కొండల మధ్య నుంచి ఉదయించే సూర్యుడిని చూసేందుకు పర్యాటకులు పోటెత్తారు. తెల్లవారుజామున మూడు గంటల నుంచే అటవీ ప్రాంతంలో నడుస్తూ ఆపసోపాలు పడుతూ పైకి వచ్చారు. అయితే మేఘాల కొండలపైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించిన తర్వాత ఆ కష్టాన్ని మరచిపోయామని పర్యాటకులు చెబుతున్నారు.
మేఘాలకొండకు పొటెత్తిన పర్యాటకులు : ఆ మేఘాల కొండ కోనల్లో దాగున్న కైలాస శిఖరంను చూసేందుకు పర్యాటకులు ప్రాణాలకు తెగిస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని పాడేరు సమీపంలోని వంజంగి మేఘాలకొండ గత 4 ఏళ్లుగా పర్యాటకుల విశేష ఆదరణ పొందుతోంది. గత సర్కారు పట్టించుకోకపోవడంతో అభివృద్ధి చెందలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం పర్యాటకానికి పెద్ద పీట వేస్తున్న నేపథ్యంలో అధికారులు రహదారి నిర్మాణానికి సమాయత్తమయ్యారు.
ఎలా చేరుకోవాలంటే : తెల్లవారుజామున 3 గంటలకే పర్యాటకులు పాడేరు ప్రాంతంలోని వంజంగి చుట్టుపక్కల రిసార్ట్ల నుంచి ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. లగిసిపల్లి ప్రాంతం దాటిన తర్వాత చిన్న దారి ఎత్తైన మార్గం మధ్యలో వాహనాలు నిలిచిపోతుంటాయి. కొందరు నడిచి పైన మట్టి రహదారి గుండా చేరుకుంటారు. అక్కడి నుంచి చీకట్లో ఎత్తైన జారుడుమట్టు నుంచి మరో 2 కి.మీ దూరం వెళ్తారు. ఆ పైన మధ్యలో కి.మీ కొండ అటవీ ప్రాంతం గుండా నడిచి వెళ్లాలి. చివరిగా రాళ్లతో కూడిన ఎత్తైన కొండ వద్దకు పర్యటకులు చేరుకుని మేఘాలను అతి సమీపం నుంచి ఆస్వాదిస్తుంటారు. కొంతమంది మధ్య మధ్యలో ఆగిపోతున్నారు. ఎంతో కష్టపడి సుదూర ప్రయాణం చేసి చివరికి చేరుకుని అన్నీ మర్చిపోతారు ఆ మరో ప్రపంచం చూసి తన్మయత్వం చెందుతారు.
స్వర్గంలో ఉన్నట్లుగా ఉందంటున్న పర్యాటకులు : సూర్య కాంతి, తేలియాడే మేఘాలను చూస్తూ స్వర్గంలో ఉన్నట్లుగా ఉందని ఇక్కడకు వచ్చిన పర్యటకులు అనుభూతి చెందుతున్నారు. ఎంత వ్యయప్రయాసలకోర్చైనా అందుకే ఇక్కడికి చేరతారు. మళ్లీ కొండ దిగి రాళ్లు రప్పలగుండా వారి వాహనాల వద్దకు తిరిగి చేరుకుంటారు. 2020 కొవిడ్ తర్వాత వంజంగి మేఘాల కొండలు వెలుగులోకి రాగా ఏటా వేలాది మంది పర్యటకులు సందర్శిస్తున్నారు. వాహనాలకు కొంత ప్రవేశ రుసుము కూడా వసూలు చేస్తున్నారు. కానీ పర్యాటకులకు ప్రత్యేకంగా ఎక్కడా ఏ సదుపాయం లేదు. మధ్య మధ్యలో ట్రాఫిక్ జామ్ సమస్యలు ఎదురవుతున్నాయని యాత్రికులు చెబుతున్నారు. సూర్యోదయానికి చాలామంది అక్కడకు చేరుకోలేక మధ్యలోనే ఉండి పోతున్నారు.
వంజంగి కొండను చూస్తుంటే మరో అద్భుత ప్రపంచాన్ని చూస్తున్నట్లుగా ఉందని పర్యాటకులు చెబుతున్నారు. ఆ పకృతి అందాలను తమ సెల్ఫోన్లలో బంధించి మధురానుభూతి పొందామని చెబుతున్నారు. అయితే కొండపైకి వచ్చే మార్గంలో రోడ్డు వేస్తే బాగుంటుందని పర్యాటకులు కోరుతున్నారు.
'గోవా'ను మరిపించే టూరిస్ట్ స్పాట్ - మన తెలంగాణలోనే - లేట్ చేయకుండా వెళ్లొచ్చేయండి