Special Story on Tiger Killings : అటవీ ప్రాంతంలో కే8 పులిని చంపి పది రోజులైనా కాలేదు. ఇప్పుడు మరో పులిని వేటగాళ్లు విద్యుత్ ఉచ్చులను ఏర్పాటు చేసి హతమార్చారు. దీని అంతటికీ గ్రామాల్లో విద్యుత్ సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన లైన్లకు కొండీలు వేసి మరీ అంతమొందిస్తున్నారు. పులులు చనిపోయిన తర్వాత వాటి గోళ్లు, చర్మాన్ని వేరు చేసి విక్రయిస్తూ సొమ్మును సంపాదిస్తున్నారు. ముఖ్యంగా స్మగ్లర్లు మహారాష్ట్రలోని తడోబా, తిప్పేశ్వర్, ఛత్తీస్గఢ్లోని ఇంద్రావతి పులుల అభయారణ్యాల నుంచి తెలంగాణకు వస్తున్న పులులను లక్ష్యంగా చేసుకుంటూ వారి చీకటి దందాను సాగిస్తున్నారు.

వేటగాళ్ల విద్యుత్ ఉచ్చులకు బలైపోయిన పులుల వివరాలు ఇవే :
- ఈనెల 15న కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట మండలంలోని పాతచిచ్చాల అటవీ ప్రాంతంలో వేటగాళ్ల విద్యుత్ తీగను అమర్చి కే8 పులిని చంపేశారు. అనంతరం దాని గోళ్లు, చర్మాన్ని తీసుకెళ్లగా నాలుగు రోజుల అనంతరం పెంచికల్పేట, దహెగాం మండలాల్లోని 38 మంది అనుమానితులను అధికారులు పట్టుకొని గోళ్లు, చర్మాన్ని స్వాధీనం చేసుకున్నారు.
- ములుగు జిల్లా తాడ్వాయి మండలం కొడిశాల అడవుల్లో వేటగాళ్లు ఉచ్చు బిగించి 2021 అక్టోబరులో పులిని చంపేశారు. తర్వాత దాన్ని గోళ్లు, చర్మాన్ని అక్రమ రవాణా చేస్తుండగా అటవీ అధికారులకు పట్టుబడ్డారు.
- మంచిర్యాల జిల్లా శివ్వారం అటవీ ప్రాంతంలో 2019 జనవరిలో స్మగ్లర్లు విద్యుత్తు తీగను అమర్చి పులిని హతమార్చారు. దాని చర్మం, గోళ్లు విక్రయించే సమయంలో అధికారులు దుండగులను పట్టుకున్నారు.
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెజ్జూరు మండలం ఏటిగూడ, కోటపల్లి మండలం పిన్నారం, ఖానాపూర్ మండలం పెంబి, చెన్నూరు మండలం పంగిడి సోమారం ప్రాంతాల్లోనూ 2016లో వేటగాళ్లు కరెంటు ఉచ్చులను బిగించి పులులను అంతమొందించారు.
- చెన్నూరు అటవీ ప్రాంతంలో 2014లో, ఊట్పల్లి చెరువు వద్ద 2011లో, కాగజ్నగర్ మండలం పాపన్పేట్లో 2006లో కరెంటు షాక్తో పులులను చంపేశారు.
విద్యుత్ తీగలకు కవర్డ్ కండక్టర్స్ ఏర్పాటు చేయాలి : విద్యుత్ తీగలకు కవర్డ్ కండక్టర్స్ను(ఇన్సులేటెడ్ కోటింగ్) ఏర్పాటు చేస్తే కొండీలు వేసే అవకాశం ఉండదని ఆసిఫాబాద్ డీఎఫ్ఓ నీరజ్కుమార్ తెలిపారు. అడవి జంతువులను స్మగ్లర్ల బారి నుంచి రక్షించొచ్చని అభిప్రాయపడ్డారు. అడవుల్లో తీగలకు కవర్డ్ కండక్టర్స్ ఏర్పాటు చేయాలని పలుమార్లు విద్యుత్తుశాఖ అధికారులను కోరామన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని మరోవైపు ఆసిఫాబాద్ ఎస్ఈ శేషారావు పేర్కొన్నారు.
కరెంట్ షాక్ ఇచ్చి - కే-8 ఆడపులిని చంపేసిన స్మగ్లర్లు
పొలంలో ఓనర్పై పులి ఎటాక్- కాపాడిన పెంపుడు కుక్క- కానీ పోరాడిన కాసేపటికే!