అమరావతిలో జోరుగా పనులు - డిసెంబర్ నాటికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్స్: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
నిర్మాణంలోని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ను పరిశీలించిన సభాపతి - ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఈ డిసెంబర్ నాటికి అందుబాటులో ఉంటాయన్న సభాపతి

By ETV Bharat Andhra Pradesh Team
Published : July 9, 2025 at 5:49 PM IST
|Updated : July 9, 2025 at 6:05 PM IST
Speaker Ayyanna Visit MLA and MLCs Quarters : రాజధాని అమరావతిలో పనులు ఊపందుకున్నాయి. ప్రతిష్టాత్మక సంస్థల నిర్మాణాల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. శాశ్వత సచివాలయం, హైకోర్టు నిర్మాణం పనులు వేగం పుంజుకున్నాయి. గత నెలలో అమరావతికి వచ్చిన నిపుణుల బృందం ఐకానిక్ టవర్లు, శాశ్వత హైకోర్టు పునాదులను పరిశీలించింది. వారి సూచనల మేరకు ముందుకు సాగుతున్నారు.
ఈ క్రమంలో అమరావతిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్స్ను సభాపతి అయ్యన్నపాత్రుడు పరిశీలించారు. ఈ డిసెంబర్ నాటికి అమరావతిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అమరావతి క్వార్టర్స్లోనే ఉంటారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు. అక్కడ జోరుగా పనులు సాగుతున్న పనుల తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజనను దృష్టిలో పెట్టుకుని నివాస సముదాయాలు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచనలు చేశారు. చట్టసభ సభ్యుల కోసం మొత్తం 12 టవర్లలో 288 క్వార్టర్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు.
మార్చి నాటికి అందుబాటులోకి : 35 మంది మంత్రులు, 36 న్యాయమూర్తుల క్వార్టర్స్ మార్చి నాటికి అందుబాటులోకి వస్తాయన్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి ఛైర్మన్, డిప్యూటీ చైర్మన్ నివాస సముదాయాలు మంత్రుల క్వార్టర్స్తో పాటే ప్రత్యేక గుర్తింపు ఉండేలా చూడాలని సూచించారు. స్విమ్మింగ్ పూల్, ఆసుపత్రి, క్లబ్ హౌస్ వంటివి కూడా అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను స్పీకర్ ఆదేశించారు. సోలార్, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్, వేస్ట్ వాటర్ యూజెస్ వంటి అన్ని వసతులు ఉండేలా చూడాలని దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసం, రాజ్ భవసన్లు కృష్ణా నది వెంబడి ఉంటాయన్నారు.
మహిళ సాధికార సభ్యుల సదస్సు : అలాగే సెప్టెంబర్ 14, 15 తేదీల్లో తిరుపతి వేదికగా చట్టసభల జాతీయ మహిళ సాధికార సభ్యుల సదస్సు ఉంటుందని శాసనసభపతి అయ్యన్నపాత్రుడు వెల్లడించారు. అసెంబ్లీలోని తన ఛాంబర్లో సభాపతి అయ్యన్నపాత్రుడు మీడియాతో ముచ్చటించారు. ఏపీ ఆతిథ్యం ఇవ్వాలన్న పార్లమెంట్ స్పీకర్ సూచన మేరకు దీనిని నిర్వహిస్తున్నామని తెలిపారు. దాదాపు 500 మంది ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ కమిటీ సభ్యులు అన్ని రాష్ట్రాల నుంచి పాల్గొంటారన్నారు. ఆగస్టు మొదటి వారం లేదా రెండో వారంలో 10 రోజుల పాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఉంటాయని అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.
మరో 34,964 ఎకరాల సేకరణ : అయితే అమరావతి నిర్మాణానికి మలివిడతలో మరో 34,964 ఎకరాల సేకరణకు సీఆర్డీఏ ఇప్పటికే ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. తొలివిడతలో ఇచ్చిన ప్యాకేజీనే దీనికీ వర్తించనుంది. అలాగే రాజధానిలో 58 ఎకరాల్లో పీపీఏ విధానంలో నివాస, మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టాలని అథారిటీ సమావేశంలో నిర్ణయించారు. వీటికి టెండర్లు పిలిచేందుకు సైతం భేటీలో పచ్చజెండా ఊపారు. మరికొన్ని సంస్థలకు సైతం భూకేటాయింపులు చేస్తూ ఆమోదం తెలిపారు.
సమీకరణకు 16 ప్రత్యేక యూనిట్లు : రాజధాని అమరావతి నిర్మాణానికి మలివిడతలో 13 గ్రామాల పరిధిలో 34,964 ఎకరాల భూసమీకరణకు ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమోదం తెలిపారు. దీనిలో పట్టాభూమి 26,369.5 ఎకరాలు, ప్రభుత్వభూమి 5,207.42 ఎకరాలు ఉంది. మిగతావి ఎసైన్డ్, ఇతర కేటగిరీల భూములు. ఈ భూముల సమీకరణకు 16 ప్రత్యేక యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నారు. 16 మంది డిప్యూటీ కలెక్టర్లు, 16 మంది తహసీల్దార్లు సహా పలువురు అధికారుల్ని నియమిస్తారు.
అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్ - ఆమోదించిన ప్రభుత్వం
అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీం - విధివిధానాలు జారీ చేసిన ప్రభుత్వం

