Huge Investments for Telangana : ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన దక్షిణ కొరియా ఆటోమోటివ్ దిగ్గజం హ్యుందాయ్ మోటారు కంపెనీ తెలంగాణలో కార్ల మెగా టెస్ట్ సెంటర్ను స్థాపించనుంది. దాని భారతీయ విభాగమైన హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్(హెచ్ఎంఐఈ) ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ పని చేయనుంది. ఇందులో ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్ సదుపాయంతోపాటు అత్యాధునిక కార్ల తయారీ సౌకర్యం(విద్యుత్ వాహనాలు సహా) ఉంటుంది. ఈ కంపెనీ జహీరాబాద్లోని నిమ్జ్లో 675 ఎకరాల్లో సుమారు రూ.8,528 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టనుంది.
రాష్ట్రంలో ముందుగా గ్లోబల్ ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్(ఆర్ అండ్ డీ) సెంటర్ను మాత్రమే స్థాపించాలని హ్యుందాయ్ మోటార్స్ భావించగా, తాజాగా నిమ్జ్లో టెస్టింగ్ కార్ల తయారీ పరిశ్రమను కూడా ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాలను పరిశ్రమ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ కంపెనీ రావడం వల్ల సుమారు 4,200 మంది స్థానిక యువతకు ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అలాగే కంపెనీ ప్రతినిధులు ఈనెలలోనే రాష్ట్రానికి రానున్నట్లు పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి.
రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి తమ కంపెనీ తెలంగాణలో ప్రారంభించనున్న ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో ఇప్పటికే ఉన్న ఆ సంస్థకు చెందిన ఇంజినీరింగ్ కేంద్రం పునరుద్ధరణ, విస్తరణ, ఆధునీకరణ ద్వారా హెచ్ఎంఐఈ భారత్ సహా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మరింత మందికి ఉపాధిని కూడా కల్పించనుంది.
సీఎం రేవంత్ రెడ్డి చొరవతో : గతేడాది ఆగస్టులో దక్షిణ కొరియాలో రాష్ట్రానికి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సహా ఉన్నతాధికారుల బృందం పర్యటించింది. పర్యటన సందర్భంగా సియోల్లో హ్యుందాయ్ మోటార్ కంపెనీ అధికారులతో ఆ బృందం సమావేశమయింది. గతంలోనే నిమ్జ్లో సుమారు రూ.3 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు హ్యుందాయ్ సంస్థ ముందుకు వచ్చింది.
ఇప్పుడు మళ్లీ సీఎం రేవంత్ చొరవతో మరో రూ.5,528 కోట్ల పెట్టుబడులను పెట్టడానికి ఆ సంస్థ ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు. దీనికి సంబంధించి రాష్ట్ర పెట్టుబడుల ప్రచార మంత్రివర్గ ఉపసంఘం ఇటీవల సమావేశమై కంపెనీ స్థాపనకు అనుకూలంగా పచ్చజెండా సైతం ఊపింది. ఈ పరిశ్రమలో ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్, ప్రొటో టైపింగ్ సిస్టమ్, పైలట్ టెస్ట్ ట్రాక్లు ఉండనున్నాయి.
హైదరాబాద్కు మరో భారీ పెట్టుబడి - 10,500కోట్లతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్న జపాన్ కంపెనీలు
ముగిసిన బయో ఆసియా సదస్సు - రూ.5,445 కోట్ల పెట్టుబడులు - 10వేల కొత్త ఉద్యోగాలు