South Central Railway Diverted Visakhapatnam Trains : విశాఖ నుంచి ప్రయాణించే కొన్ని రైళ్లను వచ్చే నెల నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్కు కాకుండా చర్లపల్లి టెర్మినల్ రైల్వే స్టేషన్కు మళ్లిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై ప్రయాణికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వివిధ అవసరాల నిమిత్తం సికింద్రాబాద్ వెళ్లాలనుకునే వారు చర్లపల్లిలో దిగాల్సి రావడంతో దూరాభారమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో మరికొన్ని రైళ్లను మళ్లిస్తారంటున్నారు. ఈ నేపథ్యంలో వాటి స్థానంలో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి మరో వందేభారత్, కొత్త రైళ్లు ఏమైనా అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లలో రద్దీ నియంత్రణకు కాచిగూడ, లింగంపల్లి టెర్మినల్ స్టేషన్లను అప్పట్లో అభివృద్ధి చేశారు. అయితే వందల కోట్ల రుపాయలతో అత్యాధునికంగా చర్లపల్లిని తాజాగా అందుబాటులోకి తెచ్చారు. పూర్తిస్థాయిలో ఈ స్టేషన్ను వినియోగంలోకి తెచ్చేందుకు యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే విశాఖ నుంచి హైదరాబాద్ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే రైళ్లను సికింద్రాబాద్ స్టేషన్కు పంపకుండా చర్లపల్లి నుంచి వెళ్లేలా మళ్లించనున్నారు. ఇప్పటికే దీని మీద దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది.
తొలుత నాలుగు రైళ్లతో : ప్రస్తుతానికి నాలుగు రైళ్లను మళ్లిస్తుండగా వాటికి సికింద్రాబాద్ స్టేషన్ను తప్పించారు. లోకమాన్య తిలక్ నుంచి విశాఖకు వచ్చే రైలు వచ్చే నెల 22 నుంచి చర్లపల్లి మీదుగా రాకపోకలు సాగించనుంది. విశాఖ నుంచి లోకమాన్య తిలక్కు వెళ్లేది వచ్చే నెల 24 నుంచి రూటు మారుస్తున్నారు. వారానికి మూడు రోజులు రాకపోకలు సాగించే సంబల్పూర్-నాందేడ్-సంబల్పూర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను మళ్లించారు. సంబల్పూర్ నుంచి బయలు దేరినప్పుడు వచ్చే నెల 25న, నాందేడ్ నుంచి వచ్చినప్పుడు వచ్చే నెల 26 నుంచి మారుతోంది.
విశాఖ నుంచి నాందేడ్ వెళ్లే రైలు వచ్చే నెల 26 నుంచి, నాందేడ్ నుంచి విశాఖ వచ్చేది వచ్చే నెల 27 నుంచి మార్చారు. ఇది వారానికి మూడు రోజులు రాకపోకలు సాగిస్తుంది. విశాఖ-సాయినగర్ వీక్లీ రైలు సికింద్రాబాద్కు వెళ్లకుండా మళ్లిస్తున్నారు. విశాఖ నుంచి సాయినగర్కు బయలుదేరే రైలు వచ్చే నెల 24 నుంచి, సాయినగర్ నుంచి విశాఖ వచ్చేది వచ్చే నెల 25 నుంచి మళ్లిస్తున్నారు.
అదనపు రైళ్లపై ఆశలు : విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటవుతుండడంతో కొత్త రైళ్లకు ప్రాధాన్యం పెరగనుంది. ఏప్రిల్ 22 నుంచి సికింద్రాబాద్కు వెళ్లాల్సిన నాలుగు రైళ్లను ఆ స్టేషన్ నుంచి తప్పిస్తుండడంతో అక్కడి నుంచి విశాఖకు మరేవైనా కొత్త రైళ్లు నడుపుతారనే ఆశాభావం జనాల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుతానికి రోజూ పది నుంచి 12 రైళ్లు హైదరాబాద్కు విశాఖ నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి.
అయినప్పటికీ ప్రయాణికుల డిమాండు అధికంగా ఉంటుంది. సికింద్రాబాద్కు రాకపోకలు సాగిస్తున్న రెండు వందేభారత్ రైళ్లలో ఆక్యుపెన్సీ రేటు 150 శాతం దాటి ఉంటోంది. దీంతో మరో రైలుకు డిమాండు నెలకొంది. ఖాళీ అయిన వేళల్లో అదనపు రైళ్లపై నగర వాసులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
అమరావతిలో సబర్బన్ రైళ్లు - ORRతో పాటు రైల్వేలైన్కు ప్రణాళికలు
రైలు ప్రయాణికులకు గుడ్న్యూస్ - ఇకపై వారాంతాల్లో ప్రత్యేక రైళ్లు, ఏయే రూట్లంటే?