AP Police Constable Recruitment 2025 : పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జూన్ 1న తుది రాతపరీక్ష నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. విశాఖ, కాకినాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతిలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. జూన్ 1న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. 2023 జనవరిలో నిర్వహించిన ప్రాథమిక పరీక్షకు 4.59 లక్షల మంది హాజరుకాగా మొత్తం 95,208 మంది అర్హత సాధించారు.
వీరికి 2024 డిసెంబరులో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో 38,910 మంది నెగ్గారు. వీరందరికీ జూన్ 1న రాత పరీక్ష నిర్వహించనున్నారు. పూర్తి వివరాలు slprb.ap.gov.in వెబ్సైట్లో పొందుపరిచినట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది.
ప్రాథమిక రాత పరీక్షలో 95,208 మంది అర్హత : అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం 2022లో 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అనంతరం జనవరి 22న నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్షకు 4,58,219 మంది హాజరయ్యారు. వారిలో 95,208 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఫిబ్రవరి 5న ఈ ఫలితాలు విడుదలయ్యాయి. వీరందరికీ ఆ వెంటనే రెండో దశలో దేహదారుఢ్య, శారీరక సామర్థ్య (పీఎంటీ, పీఈటీ) పరీక్షలు నిర్వహించాలి. 2023 మార్చి 13 నుంచి 20వ తేదీ వరకూ నిర్వహిస్తామంటూ మొదట షెడ్యూల్ విడుదల చేసి హాల్టికెట్లూ జారీ చేశారు. చివరికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సాకుతో దానిని వాయిదా వేశారు.
కూటమి ప్రభుత్వం రాకతో అభ్యర్థుల్లో సంతోషం : ఆ ఎన్నికలైపోయాక కూడా నియామక ప్రక్రియ కొనసాగించకుండా వైఎస్సార్సీపీ సర్కార్ ఆపేసింది. దీంతో అసలు ఈ పరీక్షలు నిర్వహిస్తారో లేదో తెలియక అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నోటిఫికేషన్ జారీ కంటే రెండు సంవత్సరాల ముందు నుంచే అభ్యర్థులు ఈ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. వేరే పనులు చేసుకోలేక, ఈ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో అర్థం కాక వారు మనోవేదనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే వారికి ఊరట కలిగించేలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మిగిపోయిన దేహదారుఢ్య పరీక్షలను నిర్ణయించింది. తాజాగా జూన్ 1న తుది రాతపరీక్ష నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది.
కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు - రన్నింగ్ చేస్తూ యువకుడు మృతి
మహిళా కానిస్టేబుల్కు హోంమంత్రి సర్ప్రైజ్ - ఇంటికి వెళ్లి సీమంతం చేసిన అనిత