Fire Accidents In Hyderabad : హైదరాబాద్ నగరంలో అగ్ని ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. సగటున రోజుకు 3 నుంచి 5 అగ్ని ప్రమాద ఘటనలు వెలుగు చూస్తున్నాయి. గత నాలుగేళ్లలో ఏకంగా 66 మంది అగ్నికి ఆహుతయ్యారు. మరణాల సంఖ్య చూస్తే ఆదివారం(మే 18) పాతబస్తీ గుల్జార్హౌజ్లో జరిగిన ప్రమాదం చాలా పెద్దది. దీనిలో 17 ప్రాణాలు కోల్పోయారు. 2022, 2023 సంవత్సరాల్లోనూ భారీ అగ్ని ప్రమాదాలు జరిగాయి.
ముఖ్యంగా వ్యాపార, నివాస సముదాయాలు కలిసి ఉన్న భవనాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఇంత జరుగుతున్నా జీహెచ్ఎంసీ, అగ్నిమాపకశాఖ, ఈవీడీఎం, హైడ్రా, పోలీసులు నిర్లక్ష్యం వీడట్లేదు. నగరంలోని ప్రముఖ వ్యాపార కేంద్రాలలో వరుసగా ప్రమాదాలు జరుగుతుండటంతో ఆయా ప్రాంతాల్లో తగినట్టుగా నివారణ చర్యలు తీసుకోవట్లేదనే విమర్శలొస్తున్నాయి.
- 1 మార్చి 2025 : పుప్పాలగూడ ప్రాంతంలోని ఓ అపార్టుమెంటులో జరిగిన ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగగా క్రమంగా పెద్దగా మారాయి. భవనంలో ఉన్న మిగిలిన వారు మూడో అంతస్తు నుంచి కిందకు దూకి ప్రాణాలను కాపాడుకున్నారు.
- 13.11.2023 : నాంపల్లిలోని బజార్ఘాట్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో 9 మంది మరణించారు. అపార్టుమెంటు సెల్లార్లో షార్ట్సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. సెల్లార్లో కెమికల్ డబ్బాలు నిల్వ ఉంచడంతో మంటల తీవ్రత పెరిగి ప్రాణాలను బలిగొంది.
- 17.04.2023 : మేడ్చల్ జిల్లాలోని కుషాయిగూడ సాయినగర్ ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదంలో దంపతులు సహా తమ ఐదేళ్ల చిన్నారి మంటలకు ఆహుతయ్యారు. నివాస సముదాయాల మధ్య టింబరో డిపో ఏర్పాటు చేయడం, ప్రమాదం జరిగితే మంటల్ని నిలువరించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
- 10.03.2023 : సికింద్రాబాద్లో ప్రముఖమైన స్వప్నలోక్ కాంప్లెక్సు ఐదో అంతస్తులో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించింది. దీనివల్ల ఊపిరాడక ఆరుగురు చిరుద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. అత్యవసర పరిస్థితుల్లో బయటపడేందుకు ఉండే బయటి వైపు మెట్ల మార్గాన్ని అన్నీ రకాల వ్యర్థాలతో నింపేయడం, గడువు ముగిసిన అగ్నిమాపక పరికరాలు తదితర కారణాలతో ఆరుగురు చనిపోయారు.
- 19.01.2023 : సికింద్రాబాద్ డెక్కన్ స్పోర్ట్స్ మాల్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో ముగ్గురు మంటల్లోనే సజీవ దహనమయ్యారు. మృతదేహాల ఆనవాళ్లను గుర్తించడానికి రోజుల తరబడి అన్వేషించాల్సి వచ్చిన దుర్ఘటన అది. మంటలు నిరంతరం ఏకతాటిగా కొనసాగడంతో భవనం బలహీనంగా మారింది. తర్వాత దానిన జీహెచ్ఎంసీ సిబ్బంది దాన్ని కూల్చేశారు.
- 23.03.2022 : సికింద్రాబాద్ పరిధిలోని బోయిగూడలో తుక్కు గోదాంలో జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది మరణించారు. షార్ట్ సర్క్యూట్తో మంటలు మొదలవ్వడం, కనీస అగ్నిమాపక పరికరాలు లేకపోవడం, తప్పించుకోవడానికి ఎటువంటి చిన్న అవకాశం లేక దుర్మరణం పాలయ్యారు.
అఫ్జల్గంజ్లో భారీ అగ్నిప్రమాదం - ఇద్దరు చిన్నారులు సహా 9 మంది సేఫ్