Raj Kasireddy Case Updates : రాజ్ కసిరెడ్డిని కస్టడీకి ఇవ్వాలని విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో అతను పూర్తి విషయాలు చెప్పలేదన్నారు. అతడిని వారంపాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. రూ.3200 కోట్ల కమీషన్ల అంశంలో కీలక నిందితుడని పిటిషన్లో పేర్కొన్నారు. కేసు దర్యాప్తు కీలకదశలో ఉన్న దశలో ఉన్నందున కస్టడీకి ఇవ్వాలని వివరించారు. డిస్టిలరీల నుంచి కమీషన్లు తీసుకుని ఎవరికి ఇచ్చారో తేల్చాల్సి ఉందని చెప్పారు. అదేవిధంగా డిస్టిలరీల నుంచి డబ్బు ఎవరు వసూలు చేశారో తెలుసుకోవాల్సి ఉందని సిట్ పోలీసులు వెల్లడించారు.
అసలేం జరిగిదంటే : వైఎస్సార్సీపీ పాలనలో జరిగిన రూ.వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరఫున అన్నీ తానై రాజ్ కసిరెడ్డి వ్యవహరించారు. 2019-2024 మధ్య ఇలా ఏకంగా రూ.3200 కోట్ల ముడుపులు వసూలు చేశారు. ఈ మొత్తం కుట్ర రూపకల్పన, ముడుపుల వసూళ్ల నెట్వర్క్ నిర్వహణలో నాటి ముఖ్యమంత్రి జగన్కు ఐటీ సలహాదారుగా పనిచేసిన రాజ్ కసిరెడ్డి కీలక పాత్ర పోషించారు.
ఈ క్రమంలోనే సోమవారం నాడు అతడిని హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయంలో సిట్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతనిని విజయవాడ తీసుకొచ్చారు. మంగళవారం నాడు సిట్ కార్యాలయం రాజ్ కసిరెడ్డిని మద్యం స్కామ్కు సంబంధించి సుదీర్ఘంగా ప్రశ్నించి, కీలక ఆధారాలు సేకరించారు. రిమాండ్ రిపోర్టును కూడా సిట్ అధికారులు సిద్ధం చేశారు.వైద్య పరీక్షల అనంతరం రాజ్ కసిరెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.
ఈ మేరకు రిమాండ్ రిపోర్ట్లో 29 మంది ప్రమేయాన్ని పోలీసులు కోర్టులో ప్రస్తావించారు. ఏ-1గా రాజ్ కసిరెడ్డి పేరును చేర్చారు. సుమారు రెండున్నర గంటలకు పైగా ఇరుపక్షాల వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా న్యాయవాదులు సుప్రీంకోర్టు, పలు హైకోర్టుల తీర్పులను ప్రస్తావించారు. ఇరు వైపులా వాదనలు విన్న మూడో ఏడీజే కోర్టు న్యాయాధికారి రాజ్ కసిరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ఆదేశాలు చేశారు. దీంతో అతడిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.
ఆ బాధ్యత జగనే అప్పగించారు - విచారణలో గుట్టు విప్పిన రాజ్ కసిరెడ్డి
వెయిట్ అండ్ సీ - త్వరలోనే విజయసాయిరెడ్డి బండారం బయటపెడతా : రాజ్ కసిరెడ్డి