SIT OFFICIALS QUESTIONED MP MITHUN REDDY: మద్యం కుంభకోణం కేసులో సిట్ విచారణకు వైఎస్సార్సీపీ నేతలు వరుస కడుతున్నారు. తొలిరోజు విజయసాయిరెడ్డిని విచారించిన అధికారులు ఎంపీ మిథున్రెడ్డిపై శనివారం ప్రశ్నల వర్షం కురిపించారు. సుమారు 7 గంటల పాటు 100కు పైగా ప్రశ్నలను సంధించారు. విచారణకు సహకరించకుండా ఎదురు ప్రశ్నలు వేస్తూ మద్యంతో తనకేంటి సంబంధమని ఎంపీ బుకాయించారు. ముడుపుల వసూళ్ల నెట్వర్క్పై సమాధానాలివ్వకుండా దాటవేశారు. ఆధారాలు చూపించి దర్యాప్తు అధికారులు ప్రశ్నించగా మిథున్రెడ్డి నీళ్లు నమిలారు.
ఏడు గంటల పాటు వందకు పైగా ప్రశ్నలు: వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారుల్లో ఒకరిగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఆ పార్టీ నేత, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డిపై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. దాదాపు 7 గంటల పాటు వందకు పైగా ప్రశ్నలు అడిగారు. అత్యధిక ప్రశ్నలకు ఆయన సరిగ్గా సమాధానాలు చెప్పకుండా, విచారణకూ పూర్తిగా సహకరించలేదని తెలిసింది. మద్యం వ్యవహారంతో తనకు సంబంధమేంటి? అంటూ దర్యాప్తు అధికారులను ఎదురు ప్రశ్నించినట్లు తెలిసింది. మద్యం కుంభకోణం కేసులో శనివారం ఎంపీ మిథున్రెడ్డి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. విజయవాడ పోలీసు కమిషనరేట్లోని సిట్ కార్యాలయానికి ఉదయం 9.45కే చేరుకున్న ఆయన 10:00 గంటలకు విచారణకు హాజరయ్యారు.
సమాధానం చెప్పకుండా మౌనం వహించిన ఎంపీ: తిరిగి సాయంత్రం 6:30 గంటలకు బయటకొచ్చారు. తొలి విడతలో ఉదయం 10:00 నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు దర్యాప్తు అధికారులు అడిగిన ప్రశ్నలకు ఆయన తప్పించుకునే రీతిలో సమాధానాలు ఇచ్చారు. అసలు విషయాలు దాచిపెట్టారు. సంబంధం లేని అంశాలపై ప్రశ్నిస్తూ సమాధానాలు చెప్పమంటే ఎలాగంటూ అధికారులపై ఎదురుదాడి చేసినట్లు సమాచారం. అప్పటివరకూ ఓపికగా ఉన్న సిట్ అధికారులు మధ్యాహ్న భోజన విరామం తర్వాత జరిగిన విచారణలో తమ వద్దనున్న పత్రాలు, ఆధారాలను చూపించి సూటిగా ప్రశ్నించగా సమాధానం చెప్పకుండా మౌనం వహించినట్లు తెలిసింది. ఆయన చాలా ప్రశ్నలకు నీళ్లు నమిలినట్లు తెలుస్తోంది.
మళ్లీ విచారణకు పిలుస్తాం: ఏపీఎస్బీసీఎల్ పూర్వపు ఎండీ వాసుదేవరెడ్డి, ప్రత్యేక అధికారి సత్యప్రసాద్ వాంగ్మూలాల ఆధారంగా అధికారులు ప్రశ్నించారు. మిథున్రెడ్డి సిట్ కార్యాలయంలో మొత్తం 8 గంటలపాటు ఉన్నారు. భోజన విరామం గంట మినహా 7 గంటలపాటు అధికారులు ఆయన్ను న్యాయవాదుల సమక్షంలో ప్రశ్నించారు. విచారణ ముగిశాక మిథున్ రెడ్డి చెప్పిన వివరాల ఆధారంగా వాంగ్మూలాలు రెడీ చేసి వాటిపై సంతకాలు తీసుకున్నారు. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని, రావాల్సి ఉంటుందని చెప్పారు.
మద్యం కేసు - మిథున్రెడ్డిని 8 గంటలపాటు విచారించిన సిట్
అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం సిట్ అధికారులు మిథున్రెడ్డిని అడిగిన ప్రశ్నలు, వాటికి ఆయన సమాధానాలను పరిశీలిస్తే, ఇలా ఉన్నాయి.
- 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక తీసుకొచ్చిన నూతన మద్యం విధానం రూపకల్పనలో మీరే ప్రధాన పాత్ర వహించారని మా విచారణలో తేలింది? ఏ హోదాలో మీరు ఇందులో భాగస్వాములయ్యారు? మీకేంటి సంబంధం? అని సిట్ మిథున్రెడ్డిని ప్రశ్నించింది. మద్యం విధానం రూపకల్పనలో నా పాత్ర లేదు. సంబంధమూ లేదు. అసలు అందులో భాగస్వామినే కాలేదని మిథున్రెడ్డి జవాబిచ్చారు.
- మద్యం విధానం రూపకల్పనపై విజయసాయిరెడ్డి నివాసంలో జరిగిన తొలి రెండు సమావేశాల్లో మీరు పాల్గొన్నారని ఆయనే వెల్లడించారు కదా అని సిట్ ప్రశ్నించగా, విజయసాయిరెడ్డి అప్పట్లో మా పార్టీ ఎంపీ. సాధారణ సమావేశాల్లో భాగంగా కలిసుంటామే తప్ప మద్యం విధానంపై ఎలాంటి సమావేశాలు జరగలేదని ఎంపీ బదులిచ్చారు.
- అవి మద్యం విధానంపై జరిగిన సమావేశాలేనని, అందులో మీతోపాటు రాజ్ కసిరెడ్డి, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్రెడ్డి, ఏపీఎస్బీసీఎల్ అప్పటి ఎండీ వాసుదేవరెడ్డి, ప్రత్యేకాధికారి సత్యప్రసాద్ పాల్గొన్నారని విజయసాయిరెడ్డి మా విచారణలో చెప్పారని సిట్ అధికారులు ప్రశ్నించగా, అవేవీ వాస్తవాలు కావు. అలాంటి సమావేశాల్లో నేను పాల్గొనలేదని మిథున్రెడ్డి చెప్పారు.
- మద్యం సరఫరా ఆర్డర్లు పొందే కంపెనీలు, డిస్టిలరీల నుంచి ముడుపుల వసూళ్లకు, కొత్త బ్రాండ్ల తయారీకి వీలుగా ముందస్తు కుట్రలో భాగంగానే నూతన లిక్కర్ పాలసీ రూపొందించారా అని సిట్ ప్రశ్నించగా, నాకు సంబంధం లేదని చెబుతుంటే అవే ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారని ఎంపీ మిథన్రెడ్డి ఎదురు ప్రశ్నించారు.
- నూతన మద్యం విధానం అమల్లోకి వచ్చిన 2 నెలల్లోనే అదాన్ డిస్టలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటైంది. అప్పట్లో అత్యధికంగా లిక్కర్ సరఫరా ఆర్డర్లు ఈ కంపెనీకే అనుచితంగా దక్కాయి. ఇది మీరే ఏర్పాటుచేశారా అని సిట్ అడగగా, అదాన్ డిస్టలరీస్తో ఎలాంటి సంబంధమూ లేదని చెప్పారు.
- అదాన్ డిస్టలరీస్ ప్రైవేట్ లిమిటెడ్తో మీకు సంబంధం లేకపోతే దాని ఏర్పాటుకోసం రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్రెడ్డితో కలిసి అరబిందో సంస్థ నుంచి 60 కోట్లు ఎందుకు అప్పు తీసుకున్నారని అధికారులు ప్రశ్నించగా, అవేవీ వాస్తవాలు కావని మిథున్రెడ్డి చెప్పారు.
- మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలనుంచి ముడుపుల వసూళ్లకు నెట్వర్క్ రూపకల్పనలో మీ పాత్ర ఏంటని సిట్ ప్రశ్నించగా, అసలు ముడుపులే లేనప్పుడు దాని వసూళ్లు, నెట్వర్క్ రూపకల్పన ఎక్కడుంటుంది? ఇలాంటి ఊహజనిత ప్రశ్నలు సరికాదంటూ ఎంపీ చెప్పినట్లు తెలుస్తోంది.
- రాజ్ కసిరెడ్డితో కలిసి ముడుపులు వసూళ్ల నెట్వర్క్ను నడిపించినట్లు ఆధారాలున్నాయి. ఆయనకు, మీకు మధ్య నగదు లావాదేవీల సంగతేంటని కొన్ని బ్యాంకు స్టేట్మెంట్లను సిట్ అధికారులు చూపించగా, అవన్నీ తప్పుడు ఆధారాలని నాకు సంబంధం లేదని మిథున్రెడ్డి పాత మాటే మళ్లీ చెప్పారు.
- ముడుపుల వసూళ్ల కోసం క్యాష్ హ్యాండ్లర్లు, క్యాష్ కొరియర్లతో కూడిన ఏడంచెల వ్యవస్థ రూపొందించి సొమ్ము బిగ్బాస్కు చేర్చారా అని సిట్ ప్రశ్నించగా, తనకు తెలిసి అలాంటివేవీ జరగలేదని మిథున్రెడ్డి అన్నారు.
- వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే మెజార్టీ డిస్టలరీల్లో పాగా వేసి జేబ్రాండ్లు ఉత్పత్తి చేయడంటో మీదే ప్రధాన పాత్ర. కంపెనీలకు చెల్లించే మద్యం బేసిక్ ప్రైస్ను అడ్డగోలుగా పెంచేసి అనుచిత లబ్ధి ఎలా పొందారని సిట్ ప్రశ్నను సంధించగా, నాకు సంబంధం లేని ప్రశ్నలు అడిగి సమాధానాలు చెప్పమంటే ఎలా అంటూ మిథున్రెడ్డి అధికారులను ఎదురు ప్రశ్నించారు.
- మీ కుటుంబ సంస్థ పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవెట్ ఖాతా నుంచి అనుమానాస్పద లావాదేవీలు జరిగాయి. లిక్కర్ స్కామ్ సొమ్మును మళ్లించడానికి దీన్ని అడ్డం పెట్టుకున్నారని సిట్ ప్రశ్నించగా, తమ ఖాతాలన్నీ సక్రమమేనని అందులో ఎలాంటి అనుమానాస్పద లావాదేవీలు జరగలేదని మిథున్రెడ్డి బదులిచ్చారు.
అదాన్ డిస్టిలరీస్ వెనుక మిథున్రెడ్డి - నేను రూ.100 కోట్లు ఇప్పించా: విజయసాయిరెడ్డి
వెయిట్ అండ్ సీ - త్వరలోనే విజయసాయిరెడ్డి బండారం బయటపెడతా : రాజ్ కసిరెడ్డి