SIT Investigation in Liquor Scam During YSRCP Govt: వైఎస్సార్సీపీ హయాం నాటి వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణంలో బిగ్ బాస్ ఎవరో తేలిపోయింది. అంతిమ లబ్ధిదారు నాటి సీఎం జగనే అని సిట్ దర్యాప్తులో స్పష్టమైంది. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి రాజ్ కసిరెడ్డి ప్రతి నెలా రూ.50 నుంచి రూ.60 కోట్ల మేర ముడుపులు వసూలు చేసి ఆ సొమ్మంతా జగన్కే చేర్చేవారని గుర్తించింది. 2019-24 మధ్య రూ.3200 కోట్ల మేర ముడుపులు దండుకున్నట్లు వెల్లడించింది.
మూలధరపై 20 శాతం మేర ముడుపులు: 2014-19 మధ్య జరిగిన మద్యం కుంభకోణం కేసులో జగన్ ముఠాలోని ఒక్కొక్కరిని కటకటాల్లోకి నెడుతున్న సిట్ రిమాండ్ రిపోర్టుల ద్వారా వారివారి పాత్రను బయటపెడుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి ప్రతినిధిగా ముడుపుల వసూళ్ల నెట్వర్క్లో కీలక పాత్ర పోషించా బూనేటి చాణక్య అలియాస్ ప్రకాశ్ అరెస్టు సందర్భంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో కీలకాంశాలు ప్రస్తావించింది. మద్యం మూలధరపై 20 శాతం మేర ముడుపులు దండుకున్నట్లు సిట్ తేల్చింది. ఈ కేసులో ఏ6గా ఉన్న ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్రెడ్డి 2019లో హైదరాబాద్లో డిస్టిలరీల యజమానులతో ఓ సమావేశం నిర్వహించారు. ముడుపులు చెల్లించే కంపెనీలకే మద్యం సరఫరా ఆర్డర్లు ఇస్తామని కాదంటే నష్టపోతారని బెదిరించారు.
పలు డిస్టిలరీల ప్రతినిధులు మూలధరపై 12 శాతం ముడుపులు చెల్లించేందుకు తొలుత అంగీకరినప్పటికీ ఆ తర్వాత కొద్దిరోజులకే ఆ మొత్తాన్ని 20 శాతానికి పెంచేసినట్లు సిట్ తెలిపింది. ఆ ప్రాతిపదికన మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీలు ప్రతి నెలా సగటున రూ.50 నుంచి రూ.60 కోట్ల మేర ముడుపుల సొమ్మును రాజ్ కసిరెడ్డి బృందానికి అందజేసేవి. కసిరెడ్డి ఆ మొత్తాన్ని ఎంపీ మిథున్రెడ్డి, విజయసాయిరెడ్డి, జగన్మోహన్రెడ్డి సోదరుడైన వైఎస్ అనిల్రెడ్డి, జగన్ భార్య భారతి ఆర్థిక వ్యవహారాలు చూసే భారతి సిమెంట్స్ పూర్తికాల డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ ద్వారా ఈ ముడుపుల సొత్తు మొత్తం జగన్కు బదలాయించేవారని నిర్ధారించింది.
మద్యం ముడుపులు మళ్లించింది భారతి బంటు బాలాజీ - కీలకపాత్ర ఇతనిదే!
అక్రమ చెల్లింపుల్లో భాగమా లేక క్విడ్ ప్రోకోనా: నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్లో తయారైన మద్యం బ్రాండ్లకు విపరీతంగా సరఫరా ఆర్డర్లు ఇచ్చారని చాణక్య అలియాస్ ప్రకాశ్ రిమాండ్ రిపోర్టులో సిట్ తెలిపింది. ఆ డిస్టిలరీ బ్యాంకు లావాదేవీల విశ్లేషణలో సన్హోక్ ల్యాబ్స్, రాజ్ కసిరెడ్డి బినామీ సంస్థ డీకార్ట్ లాజిస్టిక్స్, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ మధ్య రూ.60 కోట్ల రూపాయల మేర రూటింగ్ జరిగినట్లు గుర్తించింది. 2021 అక్టోబరు 3న డీకార్ట్ లాజిస్టిక్స్ బ్యాంకు ఖాతా నుంచి పెద్దిరెడ్డి మిథున్రెడ్డికి చెందిన పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఖాతాలోకి రూ.5 కోట్లు జమయ్యాయి. ఈ లావాదేవీలు జరిగిన తీరు చూస్తుంటే ఇది భారీ అక్రమ చెల్లింపుల్లో భాగమా లేక క్విడ్ ప్రోకోనా అనే అనుమానాలు కలుగుతున్నట్లు సిట్ తెలిపింది.
అదాన్ డిస్టిలరీస్ రాజ్ కసిరెడ్డి, విజయసాయిరెడ్డిలదేనని ప్రకాశ్ రిమాండ్ రిపోర్ట్లో సిట్ తేల్చిచెప్పింది. అదాన్ డిస్టిలరీస్లో డైరెక్టర్లుగా ఉన్న కాశీచయనుల శ్రీనివాస్ విజయసాయిరెడ్డి ప్రతినిధి అని, ముప్పిడి అనిరుధ్రెడ్డి రాజ్ కసిరెడ్డి ప్రతినిధి అని గుర్తించింది. 2020లో రూ.60 కోట్ల రూపాయల వర్కింగ్ క్యాపిటల్తో అదాన్ డిస్టిలరీస్ ఏర్పాటు చేశారు. విజయసాయిరెడ్డి అల్లుడు పెనక రోహిత్రెడ్డి, ఆయన సోదరుడు పెనక శరత్చంద్రారెడ్డి ఖాతాల నుంచి తొలుత కాశీచయనుల శ్రీనివాస్ ఖాతాలోకి వర్కింగ్ క్యాపిటల్ సొమ్ము మళ్లించారు.
దీని వెనక ఉన్న భారీ కుట్రను వారే బయటపెట్టగలరని సిట్ తెలిపింది. అదాన్ డిస్టిలరీస్ 2020 మే నుంచి 2022 డిసెంబరు మధ్య మూడేళ్లలో రూ.732 కోట్లు, రాజ్ కసిరెడ్డి ఆధీనంలోని లీలా డిస్టిలరీ 2022 జూన్ నుంచి 2024 మార్చి మధ్య మూడేళ్లలో రూ.454 కోట్ల మేర వ్యాపారం చేసిందని వివరించింది. నిజానికి ఈ రెండు కంపెనీలకు సొంతంగా ఒక్క డిస్టిలరీ కూడా లేదని అయినా ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్, విశాఖ, పీఎంకే డిస్టిలరీలను సబ్ లీజు పేరిట ఆధీనంలోకి తీసుకుని సొంత మద్యం బ్రాండ్లు ఉత్పత్తి చేసినట్లు సిట్ తేల్చింది.
ఒకే జైలులో రాజ్ కసిరెడ్డి, ఐపీఎస్ సీతారామాంజనేయులు - ఖైదీ నెంబర్లు కేటాయింపు
ప్రభుత్వానికి రూ.3200 కోట్లు నష్టం: 2019 నుంచి 2024 మధ్య ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి వ్యక్తి ప్రభుత్వ అధికారుల సహకారంతోనే మద్యం కుంభకోణానికి పాల్పడ్డారన్న సిట్ దీని వెనకున్న భారీ కుట్రను వెలికి తీస్తున్నట్లు వెల్లడించింది. మద్యం సిండికేట్లో, కసిరెడ్డి, ఎంపీ మిథున్రెడ్డి, విజయసాయిరెడ్డి, వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్ సహా మరికొందరు కీలక భాగస్వాములని తెలిపింది. వీరంతా వారి అధికారిక హోదా, పరపతిని వాడి అనుచిత లబ్ధి పొందేందుకు ప్రభుత్వ ఖజానాకు రూ.3200 కోట్ల మేర నష్టం కలిగించినట్లు సిట్ స్పష్టం చేసింది.
కసిరెడ్డి, ఎంపీ మిథున్రెడ్డి, విజయసాయిరెడ్డిల విధులకు ఎక్సైజ్తోపాటు బెవరేజెస్ కార్పొరేషన్తో ఎలాంటి సంబంధం లేకపోయినా వారు అందులో తలదూర్చారని సిట్ తేల్చిచెప్పింది. ప్రాచుర్యం పొందిన మద్యం బ్రాండ్లేవీ లేవని వినియోగదారుల్లో ఆగ్రహం వ్యక్తమైనా నాటి పెద్దలకు ముడుపులు చెల్లించే కంపెనీల బ్రాండ్లే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో దొరికాయని నాటి అధికార పార్టీకి సంబంధించిన ‘అత్యున్నత పొలిటికల్ ఎగ్జిక్యూటివ్’ మద్దతు లేకుండా ఇది ఏ మాత్రం సాధ్యం కాదన్న సిట్ ఎక్సైజ్ విధానం ముసుగులో ప్రభుత్వంతోపాటు బెవరేజెస్ కార్పొరేషన్ నిధుల్ని భారీగా మళ్లించారని పేర్కొంది.
వ్యాపారుల ద్వారా ముడుపుల సొమ్ము: 2019-24 మధ్య మద్యం కొనుగోలుకు సంబంధించి బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి మద్యం సరఫరా కంపెనీ ఖాతాల్లో డబ్బు జమ కాగానే ముడుపుల సొమ్మును బంగారం వ్యాపారుల ఖాతాల్లోకి మళ్లేవి. వారి నుంచి బంగారం కొన్నట్లుగా జీఎస్టీ ఇన్వాయిసులు పొందేవారని సిట్ గుర్తించింది. ఆ బంగారం వ్యాపారులు కమీషన్ మినహాయించుకుని మిగతా డబ్బును కసిరెడ్డి, బూనేటి చాణక్య, వారి అనుచరులకు చెల్లించేవారని తెలిపింది. కొన్ని సందర్బాల్లో డిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీదారులు బంగారం వ్యాపారులతో కుమ్మక్కై నిందితులకు బంగారమే ఇచ్చేవారని పేర్కొంది. డిస్టిలరీలు, బంగారం వ్యాపారుల మధ్య దాదాపు రూ.300 నుంచి రూ.400 కోట్ల మేర అనుమానాస్పద లావాదేవీలు బయటపడినట్లు సిట్ స్పష్టం చేసింది.
లిక్కర్ దొంగల దుస్తులు సగమే విప్పారు - మిగతావి విప్పేందుకు సహకరిస్తా: విజయసాయి రెడ్డి