SIT Identify Suspicious Transactions Peddireddy PLR Company : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో, పార్టీలో నంబర్-2గా అధికారం చలాయించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సంస్థ అయిన పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంకు ఖాతా నుంచి అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న సిట్ గుర్తించింది. జగన్ పాలనలో నూతన మద్యం విధానం అమల్లోకి వచ్చిన 2019 అక్టోబరు 1 నుంచి 2024 మే 31 మధ్య ఆ సంస్థ బ్యాంకు ఖాతా నుంచి జరిగిన లావాదేవీలన్నింటినీ విశ్లేషిస్తోంది.
బ్యాంకు మేనేజర్కు నోటీసులు : గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న రూ.వేల కోట్ల విలువైన మద్యం కుంభకోణానికి ఈ లావాదేవీలతో సంబంధమున్నట్లు భావిస్తోంది. నల్లధనాన్ని వైట్గా మార్చేందుకు ఈ ఖాతా ఉపయోగించినట్లు అనుమానిస్తోంది. ఈ నేపథ్యంలోనే పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతా (నంబర్ 20092501613) నుంచి 2019 అక్టోబరు 1 నుంచి 2024 మే 31 మధ్య జరిగిన లావాదేవీలతోపాటు ఆ ఖాతాకు సంబంధించిన కేవైసీ, ఫోన్ నంబర్ సహా సమగ్ర వివరాలన్నీ ఇవ్వాలంటూ గత నెల 18నే విజయవాడలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజర్కు నోటీసులిచ్చింది. అవి తాజాగా వెలుగుచూశాయి. మనీ ట్రయల్లో భాగంగా సిట్ ఈ వివరాలన్నింటినీ సేకరించి విశ్లేషిస్తోంది.
పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్లో వాటాలు పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో మిథున్రెడ్డి తల్లి స్వర్ణలత, భార్య లక్ష్మీ దివ్యారెడ్డికి వాటాలున్నాయి. 2024 సార్వత్రిక ఎన్నికల నామినేషన్ సందర్భంగా మిథున్రెడ్డి ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో తన భార్య లక్ష్మీ దివ్యారెడ్డి పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్లో వాటాలున్నట్లు చూపించారు. మిథున్రెడ్డి తల్లి స్వర్ణలత 2024లో పుంగనూరు నుంచి పోటీకి నామినేషన్ వేసినప్పుడు సమర్పించిన అఫిడవిట్లోనూ పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్లో తనకు వాటాలున్నట్లు పేర్కొన్నారు.
కీలక పాత్రధారి ఆయనే : మద్యం కుంభకోణంలో ‘బిగ్బాస్’ తర్వాత కీలక పాత్రధారి మిథున్రెడ్డే అనే ఫిర్యాదులున్నాయి. మద్యం సరఫరా కంపెనీలతో సంప్రదింపులు జరపటం, అడిగినంత ముడుపులు ఇచ్చేందుకు అంగీకరించిన సంస్థలకే సరఫరా ఆర్డర్లు దక్కేలా చూడటం, వారి నుంచి వసూలు చేసిన ముడుపులు (జే ట్యాక్స్) ‘బిగ్బాస్’కు చేర్చటంలో ఆయనే మాస్టర్ మైండ్ అనేది ప్రధాన ఆరోపణ. కసిరెడ్డి రాజశేఖర్రెడ్డిని ముందుపెట్టి ముడుపుల వసూళ్ల కోసం ఏడంచెల హవాలా నెట్వర్క్ రూపొందించి, దాన్ని పర్యవేక్షించారనే ఫిర్యాదులున్నాయి. ఈ కుంభకోణంలో మిథున్రెడ్డి ప్రమేయంపై సిట్ ఇప్పటికే కీలక సమాచారం సేకరించింది.
ఎంపీ మిథున్రెడ్డికి నోటీసులు : ఈ నెల 18న విచారణకు రావాలంటూ సిట్ అధికారులు మిథున్రెడ్డికి తొలుత నోటీసులిచ్చారు. దాని ప్రకారం ఆయన శుక్రవారం విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఈలోగా తన విచారణను ఆడియో, వీడియో రికార్డ్ చేయాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించగా దాన్ని కోర్టు తిరస్కరించింది. ఈ నెల 19న విజయవాడ కమిషనరేట్లోని సిట్ కార్యాలయంలో విచారణకు సాక్షిగా హాజరుకావాలంటూ తాజాగా గురువారం సిట్ మరోసారి ఆయనకు నోటీసులిచ్చింది. మిథున్రెడ్డితో పాటు కొన్ని డిస్టిలరీల యజమానులను కూడా అదేరోజు విచారణకు పిలిచింది. వారందర్నీ కలిపి విచారించే అవకాశముంది.
దోపిడీ సొమ్ముతో ‘స్పై’ - బ్లాక్మనీని వైట్లోకి మార్చుకునేందుకు సినిమాలు
విచారణను రికార్డ్ చేయండి - ఎంపీ మిథున్రెడ్డి అభ్యర్థనను తిరస్కరించి హైకోర్టు