దుగరాజపట్నంలో షిప్ బ్రేకింగ్ యూనిట్ - రాష్ట్రానికి వస్తున్న కేంద్ర బృందం
కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలో భారీ ప్రాజెక్టు - షిప్ బ్రేకింగ్ యూనిట్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్రం నుంచి అనుమతి

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 12, 2025 at 9:35 AM IST
Ship Breaking Unit in Dugarajapatnam: కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో సముద్రయాన రంగంలో భారీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. తిరుపతి జిల్లా దుగరాజపట్నంలో షిప్ బ్రేకింగ్ యూనిట్ ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్రం నుంచి అనుమతి లభించింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చించేందుకు కేంద్ర నౌకాయాన, జల రవాణా శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఆధ్వర్యంలో ఓ టీమ్ మంగళవారం రాష్ట్రానికి రానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశం కానుందని ఉన్నతాధికారులు తెలిపారు.
ప్రాజెక్టుకు సుమారు రూ.3000 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో నౌకల మరమ్మతులు, నిర్వహణకు ఎటువంటి వ్యవస్థ లేకపోవడంతో కేరళలోని కొచ్చిన్, మహారాష్ట్రలోని ముంబయి షిప్ యార్డులతో పాటు గుజరాత్లోని ప్రైవేటు షిప్ యార్డులపై ఆధారపడాల్సి వస్తోంది. దేశంలో ఏటా సుమారు 300 నౌకలు రీసైక్లింగ్ కోసం వస్తున్నాయని అంచనా. తూర్పు తీరంలో ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని భావిస్తోంది.
రాష్ట్రంలో షిప్ల మరమ్మతులు, నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థ లేదు. ఈ సేవలకు కేరళలోని కొచ్చిన్, మహారాష్ట్రలోని ముంబయితో పాటు, గుజరాత్లోని ప్రైవేటు షిప్ యార్డులపై ఆధారపడాల్సి వస్తోంది. దేశంలో ఏటా దాదాపు 300 నౌకలు రీసైక్లింగ్ కోసం వస్తున్నాయని అంచనా. అందుకే ప్రపంచ స్థాయి ప్రమాణాలతో షిప్ మరమ్మతుల సెంటర్, రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదన పంపింది. తూర్పు తీరంలో ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది.
రాష్ట్రంలో విశాఖపట్నం మేజర్ పోర్టుతో పాటు గంగవరం, కృష్ణపట్నం, కాకినాడలో డీప్ వాటర్, యాంకరేజ్, రవ్వ పోర్టులు ఉన్నాయి. కొత్తగా మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ సెజ్ పోర్టులు అందుబాటులోకి రానున్నాయి. వీటి నిర్వహణకు అవసరమైన వాతావరణం కల్పించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. పైగా విభజన చట్టం మేరకు దుగరాజపట్నంలో కేంద్రం ఓడరేవు నిర్మించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం అక్కడ పోర్టు అవసరం లేదు. దీంతో దీనికి ప్రత్యామ్నాయంగా షిప్ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని అనుమతి కోరింది.
విశాఖ మేజర్ పోర్టుతో పాటు 5 నాన్ మేజర్ పోర్టుల ద్వారా ప్రతి సంవత్సరం సుమారు 117.62 మిలియన్ టన్నుల సరకు రవాణా జరుగుతోంది. దేశంలో పోర్టుల ద్వారా జరిగే సరకు రవాణాలో రాబోయే 20 ఏళ్లలో రాష్ట్ర వాటా 25% సాధించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీనికోసం పోర్టుల మౌలిక సదుపాయాల కల్పనపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. కొత్త పోర్టులు వస్తే రాష్ట్రంలో కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంది.
పర్యావరణానికి ఇబ్బంది లేకుండా: దుగరాజపట్నంలో షిప్ బ్రేకింగ్ యూనిట్ ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణ ఇబ్బందులు ఉండబోవని విశాఖ పోర్టు ఇచ్చిన ఫీజుబులిటి నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. ఈ ప్రాంతంలో గతంలో ఓడరేవు నిర్వహించారని, అందువల్ల నౌకల రాకపోకలకు ఇబ్బందులు ఉండబోవని తెలిసింది. సమీపంలోని పులికాట్ సరస్సు, శ్రీహరికోట అంతరిక్ష కేంద్ర కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా నిర్మాణాలు చేయడానికి ఉన్న అవకాశాలనూ నివేదికలో ప్రస్తావించారు. ఈ రిపోర్టు ఆధారంగా మంగళవారం చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు.
రామాయపట్నం పోర్టు నిర్మాణంలో నవ‘యుగం’- గుత్తేదారు మార్పుతో ప్రారంభమైన పనులు
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం - పోర్టులకు అనుసంధానంగా 8 పారిశ్రామిక నగరాలు!

