Samatula Gundam Village Issue in Asifabad : ప్రకృతి సౌందర్యం మధ్య ఉంది ఆ గ్రామం. స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణంలో ఓ 11 కుటుంబాలు చిన్న చిన్న గుడిసెలు వేసుకొని జీవిస్తున్నాయి. అయితే ఆ చిన్న ఊరిని ఓ భయం వెంటాడుతోంది. అంతే అక్కడ కొన్నేళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ నివసిస్తున్న 11 కుటుంబాలు ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోయాయి. 6 కిలోమీటర్ల దూరంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో బిక్కుబిక్కుమంటూ తలదాచుకుంటున్నారు.
8 కిలోమీటర్లు రోడ్డు లేదు : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని సమతులగుండంలో జీవించే అమాయక ప్రజల పరిస్థితి ఇది. ఆసిఫాబాద్ పట్టణం నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఈ చిన్న గ్రామం ఉంది. అక్కడ మొన్నటి వరకు ఆనందంగా 11 కుటుంబాలు నివసించేవి. సమతులగుండానికి వెళ్లాలంటే దాదాపు 8 కిలో మీటర్ల మేర రోడ్డు సౌకర్యం కూడా లేదు. మధ్యలో ఓ వాగు కూడా దాటాల్సి ఉంది.
కుటుంబంలో నలుగురు మృతి : మార్చిలో సమతులగుండం గ్రామానికి చెందిన ఆత్రం రాజు(40), సోనుబాయి(35) దంపతులతో పాటు వారి పిల్లలు భీము(22), మారుతి(20) అనారోగ్య కారణాలతో కేవలం నెల రోజుల వ్యవధిలో చనిపోయారు. దీంతో మిగతా కుటుంబాలకు భయం పట్టుకుంది. ఈ నేపథ్యంలో ఊరికి ఏదో జరిగిందని భావించి వారంతా ఇళ్లను వదిలేసి 6 కిలో మీటర్ల దూరంలో ఉన్న లింగాపూర్ మండలం భీమన్గొందిలోని ప్రాథమిక పాఠశాలలో తలదాచుకుంటున్నారు.
ప్రభుత్వ పాఠశాలలోనే : వ్యవసాయ పనులు యాథావిధిగా చేసుకుంటూ సాయంత్రానికి ప్రభుత్వ పాఠశాలలో బస చేయడానికి సుమారు 40 మంది గ్రామస్థులు తిరిగి చేరుకుంటున్నారు. మళ్లీ సమతులగుండంకు వెళ్లేది లేదని, అక్కడే కొత్త గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగిస్తామని చెబుతున్నారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సామాజిక వేత్తలు సూచిస్తున్నారు.