Revenue Officials Negligence In Chittoor District: ప్రజలకు సేవ చేయడం అధికారుల విధి. అందుకే ప్రభుత్వం ప్రజాధనాన్ని అధికారులకు వేతనంగా అందిస్తోంది. కానీ క్షేత్రస్థాయిలో కొందరు అధికారులు తమ విధుల్ని సక్రమంగా నిర్వర్తించడం లేదు. ప్రజా సమస్యలకు సరైన పరిష్కారం చూపడం లేదు. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో గత ఏడాది కాలంలో భూ సమస్యలపై 30 వేలకుపైగా అర్జీలు వచ్చాయి. రాష్ట్రంలోనే భూ సమస్యలపై అత్యధిక అర్జీలు వచ్చిన జిల్లాల్లో చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో ఉంది.
రెవెన్యూ శాఖలో అవినీతి వేళ్లూనుకుంది. చేయి తడపనిదే పని చేయడం లేదు. సదుం వ్యవహరంలో బాధితుడు ధైర్యంగా ఫిర్యాదు చేశారు, అందువల్ల విషయం వెలుగులోకి వచ్చింది. ఇంకా వెలుగు చూడని వ్యవహారాలు జిల్లాలో ఎన్నో ఉన్నాయి. బాధితులు ఏళ్ల తరబడి తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగలేక విసిగివేసారి పోతున్నారు. ఉన్నతాధికారులు చెప్పినా కొన్ని మండలాల్లో వీఆర్వోలు ఏళ్ల తరబడి రైతులను తిప్పుతుండటం గమనార్హం. ఇక ఒంటరి మహిళలలయితే వారి పరిస్థితి మరింత దయనీయం.
నిర్వీర్యమైన రెవెన్యూ వ్యవస్థ: దీంతో అసలు పాసు పుస్తకం లేకపోతే ఏముందిలే ఆ భూమి మనదేగా అని ప్రజలు అనుకుంటున్నారంటే రెవెన్యూ వ్యవస్థలో గత ఐదేళ్లలో అవినీతి ఏ మేరకు వేళ్లూనుకుందనేది వేరే చెప్పనక్కర్లేదు. తమ గ్రామాల నుంచి వచ్చి తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగలేక, వారు అడిగినంతా లంచం ఇచ్చుకోలేక ఏళ్ల తరబడి లోలోన మదనపడుతున్న వారు జిల్లాలో కోకొల్లలు. నిత్య సమీక్షలతో ఊదరగొట్టే జిల్లా అధికారులు దీనిపై కనీసం దృష్టి సారించకపోవడం గమనార్హం. ఇక అసోసియేషన్లను అడ్డుపెట్టుకుని కొందరు ఉద్యోగులు, అధికారులు వ్యవహరిస్తున్న తీరు నిబద్ధతతో పనిచేసే వారిపైనా ప్రభావం చూపుతోందని సహచర ఉద్యోగులు వాపోతున్నారు.
కలెక్టర్లకు క్యాంప్ క్లర్క్గా విధులు: సదుం అవినీతి నిరోధక శాఖ దాడిలో చిక్కిన ఇన్ఛార్జి తహశీల్దార్ ఎస్ఎం హుస్సేన్ డిప్యూటీ తహసీల్దార్ కేడర్ అధికారి. ఇతను జిల్లాలో పలువురు కలెక్టర్లకు క్యాంప్ క్లర్క్గా వ్యవహరించారు. ఆ పలుకుబడితో గతేడాది జరిగిన తహసీల్దార్ల బదిలీల్లో ఆయన సదుం ఇన్ఛార్జి తహసీల్దార్గా పోస్టింగ్ పొందడం గమనార్హం.
ఓ రైతుకు చెందిన సెటిల్మెంట్ భూమి డీకేటీగా నమోదైంది. తప్పు సరిదిద్ది తన భూమిని దస్త్రాల్లో సెటిల్మెంట్గా నమోదు చేయాలని అతడు తహసీల్దార్కు విన్నవించుకున్నారు. దీనికోసం దస్తావేజుల్ని పరిశీలించి రైతుకు పరిష్కారం చూపడం అధికారుల విధి. కానీ ఆ తహసీల్దార్ తన పనిచేయడానికి లంచం డిమాండ్ చేశారు. చివరకు లంచం తీసుకుంటూ తహసీల్దార్, వీఆర్వో అనిశా వలకు చిక్కిన ఘటన రెవెన్యూశాఖ వర్గాల్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఉలికిపాటుకి కారణమేంటంటే? సదరు తహసీల్దార్ ఎస్ఎం హుస్సేన్ జిల్లా రెవెన్యూ సర్వీసుల సంఘం అధ్యక్షుడు, ఏపీ జేఏసీ అమరావతి చిత్తూరు జిల్లా ఛైర్మన్ కావడమే.
బయటకు వెలువడని విషయాలు మరెన్నో: రెవెన్యూలో వేళ్లూనుకున్న అవినీతి ఇలాంటి అనిశా దాడుల సమయంలో వెలుగుచూస్తున్నాయి. మరికొన్ని వ్యవహారాలు బయటకు రావడం లేదు. రెవెన్యూ శాఖకు సంబంధించి సేవలు ఎలా ఉన్నాయనే అంశంపై ప్రభుత్వం ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా ప్రజాభిప్రాయాల్ని సేకరించింది. ఈ సర్వేలో అధికారులు లంచం తీసుకున్నారా అనే ప్రశ్నలు సైతం ఉన్నాయి. అయినా అవినీతికి అడ్డుకట్ట పడటం లేదు. ఇకనైనా రెవెన్యూ శాఖ పారదర్శకంగా అందించాలని ప్రజలు కోరుతున్నారు.
209 ఎకరాల భూ రికార్డులు తారుమారు.. రెవెన్యూ అధికారులపై క్రిమినల్ కేసు