Retired DG ABV visited victims of stone pelting case on Jagan: జగన్మోహన్ రెడ్డిపై రాయి దాడి కేసులో విచారణ ఎదుర్కొంటున్న బాధితులను రిటైర్డ్ డీజీ వెంకటేశ్వరరావు పరామర్శించారు. మనుషుల్ని వాళ్ల జీవితాల్ని, శవాలను తొక్కుకుంటూ రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డికి ఇదొక తార్కాణమని మండిపడ్డారు. లేనిపోని దాన్ని తీసుకుని మభ్య పెట్టే పని జగన్ చేశారని దుయ్యబట్టారు. ఒక వడ్డెర కులస్తుడు జీవితాన్ని అతని కుటుంబాన్ని నాశనం చేశారని ఆక్షేపించారు. గజమాల వేసినప్పుడు తగిలిన దెబ్బను ఎప్పటికప్పుడు రాయి దాడిగా చిత్రీకరించి రాజకీయ ప్రయోజనాలకోసం వాడుకొన్నారని ఆరోపించారు.
బలహీనుడు కాబట్టి సతీష్ను బలి చేశారని ఇంక 45 రోజులు జైలులో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారాక కూడా తప్పుడు కేసును కొట్టివేయకుండా నేటికి తిప్పుతున్నారని దుయ్యబట్టారు. ఈరోజు వరకు ఆ కేసులో ఎటువంటి పురోగతి లేదని వాళ్లపై ఏ రకమైన థర్డ్ డిగ్రీ ప్రయోగించారో వింటుంటే గుండె తరుక్కుపోతుందన్నారు. 2 లక్షలు డబ్బులు ఇస్తామని మభ్య పెట్టారు కాని వారు నేటికి అన్నం తినలేని పరిస్థితిలో ఉన్నారని ఏబీవీ ఆక్షేపించారు.
ఇంత దుర్మార్గం చేసిన పోలీసులపై ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నించారు. సమాజానికి ఏ రకమైన సందేశం ఇస్తున్నారని నిలదీశారు. బాధితులు చేసిన తప్పు ఏంటి ఏ మాత్రం సంబంధం, సాక్ష్యం లేని కేసులో ఎందుకు వాళ్లు బాధపడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆకృత్యాలకు ఇది ఒక ఉదాహరణ అని ఇప్పటికైనా ఇటువంటి వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కేసులో బాధితులను బలి చేసిన బాధ్యులపై ప్రభుత్వం, సీపీ, డీజీపీ చర్యలు తీసుకోవాలని ఏబీవీ అన్నారు. కేసు తక్షణమే ఈ కేసును మూసేయాలని బెయిల్ బాండ్స్ రద్దు చేసి వారు కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం వారికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి తనపై ఉన్న కేసుల్లో కోర్టుకు వెళ్లని జగన్ను చూస్తే ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పోతుందన్నారు. పోలీసులకు ప్రొఫెషనల్గా పని చేయడం రాకపోతే పని చేయడం మానుకోవాలని హితవుపలికారు.
రాష్ట్ర పోలీసుశాఖ చరిత్రలోనే మచ్చగా మిగిలిపోయే దర్యాప్తు ఇది : ఏబీవీ
వారి తరపున పోరాటం - జగన్ మళ్లీ అధికారంలోకి రావద్దు: ఏబీ వెంకటేశ్వరరావు