సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనులు - 60 రైళ్లకు స్టేషన్ల మార్పు
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనులు - దశలవారీగా ప్లాట్ఫామ్స్ మూసివేత - 60 రైళ్లను ఇతర స్టేషన్లకు మార్చిన దక్షిణ మధ్య రైల్వే

Published : April 15, 2025 at 9:50 PM IST
Reconstruction Work at Secunderabad Railway Station : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సూచన చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కొనసాగుతున్న పునరాభివృద్ధి పనుల దృష్ట్యా 60 రైళ్లను ఇతర టర్మినళ్ల నుంచి నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. నిర్మాణ పనుల నేపథ్యంలో నేటి నుంచి 5,6 ప్లాట్ ఫారమ్లను మూసివేసి 63 రోజుల పాటు నిర్మాణం చేపట్టనున్నారు. ఆ తర్వాత దశలవారీగా ఇతర ప్లాట్ ఫారమ్లను సైతం మూసివేయనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఏయే ప్రాంతాల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ పనుల నేపథ్యంలో భారీగా రైళ్లను ఇతర స్టేషన్ల నుంచి నడిపిస్తున్నారు. ఇంతకీ ఏ రైళ్లను ఏ టర్మినళ్ల నుంచి నడిపిస్తున్నారు? వాటికి సంబంధించిన వివరాలపై ప్రత్యేక కథనం
చర్లపల్లి టెర్మినల్ నుంచి రాకపోకలు : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పునరాభివృద్ధి పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణంలో భాగంగా భారీ స్కై కాంకోర్స్, లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్ ఓవర్ వంతెన పనులు ప్రారంభిస్తుండటంతో 115 రోజుల పాటు సగం ఫ్లాట్ ఫారమ్లను మూసి వేయనున్నారు. ఈ నెల 13వ తదీ నుంచి దశలవారీగా 60కి పైగా రైళ్లను దారిమళ్లించి వేరే స్టేషన్ల నుంచి తిప్పనున్నారు. వీటిల్లో సింహభాగం రైళ్లు చర్లపల్లి టెర్మినల్ నుంచి రాకపోకలు సాగించనుండగా, కొన్ని నాంపల్లి, మరికొన్ని కాచిగూడ స్టేషన్ల నుంచి నడుస్తాయి. సికింద్రాబాద్ రీ-డెవలప్మెంట్లో భాగంగా రెండంతస్తుల్లో భారీ స్కై కాంకోర్ను ఏర్పాటు చేస్తున్నారు. రైల్వేస్టేషన్ నిర్మాణంలో ఇదే కీలక భాగం. ఇది ఏకంగా 1.10 మీటర్ల వెడల్పు, 120 మీటర్ల పొడవు ఉంటుంది. ప్రయాణికులకు అన్ని వసతులు ఇక్కడే ఉంటాయి. వేచి ఉండే ప్రాంతంతో పాటు రిటైల్ ఔట్ లెట్స్, రెస్టారెంట్లు తదితర సౌకర్యాలు అన్నీ ఇందులోనే ఏర్పాటు చేస్తున్నారు. ఇది లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్ ఓవర్ వంతెనతో అనుసంధానమై ఉంటాయి.
63 రోజులపాటు పనులు : సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ప్రతిరోజూ 250 జతల రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. వీటిలో ఇప్పటికే 6 జతల రైళ్లను చర్లపల్లి టెర్మినల్ స్టేషన్కు శాశ్వతంగా మళ్లించారు. మరో 26 జతల రైళ్లను తాత్కాలిక పద్ధతిలో ఇతర స్టేషన్ల మీదుగా నడుపుతున్నారు. ఇప్పుడు 113 రోజులపాటు సింహభాగం ప్లాట్ ఫారమ్స్ను మూసేస్తుండటంతో 60 జతల రైళ్లు బయలుదేరే టర్మినళ్లను మార్చుతున్నారు. దీంతో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరే రైలు సేవలు పరిమితంగానే ఉండనున్నాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ముందుగా ప్లాట్ ఫారమ్ నంబర్ 5,6లను మూసివేస్తారు. ఈ ప్లాట్ ఫారమ్లలో 63 రోజులపాటు పనులు కొనసాగనున్నాయి.
ఆ తర్వాత దశల వారీగా రెండేసీ ప్లాట్ ఫారమ్లను మూసివేసి కీలకమైన పనులు కొనసాగిస్తారు. ఈ పనుల కోసం మధ్యలో ఉండే ప్లాట్ ఫారమ్ 5,6 లలో 500 టన్నుల సామర్థ్యం గల భారీ క్రేన్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెండు ట్రాక్లపై ఇసుక బస్తాలు నింపి, దాని మీద క్రేన్లను ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం ముందుగా 13 రోజులపాటు ఈ రెండ్ ప్లాట్ ఫారమ్లను మూసివేస్తారు. ఆ తర్వాత మరో 50 రోజులపాటు మూసివేస్తారు. మొత్తం 63 రోజులపాటు ఈ రెండు ఫ్లాట్ ఫారమ్లను మూసివేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి చర్లపల్లి, కాచిగూడ స్టేషన్లకు 8 రైళ్లను మార్చినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. సికింద్రాబాద్ నుంచి బయలుదేరే పలు రైళ్లను చర్లపల్లి స్టేషన్కు డైవర్ట్ చేశారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కొత్త ఎంట్రీ, ఎగ్జిట్లు - తెలుసుకోకపోతే ఇబ్బందులు తప్పవు!
సికింద్రాబాద్లో ఈ ఐకానిక్ బిల్డింగ్ ఇక కనబడదు - ఇప్పుడే వెళ్లి చూసేయండి

