Raj Kasireddy Audio : లిక్కర్ స్కామ్ కేసులో కొన్నాళ్లుగా తనపై అసత్య ప్రచారం జరుగుతోందని కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి (రాజ్ కసిరెడ్డి) పేర్కొన్నారు. తాను లేనప్పుడు సిట్ అధికారులు తన ఆఫీసుకు, ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చారని చెప్పారు. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తనపై చేసిన ఆరోపణలపై త్వరలోనే మీడియా ముందుకు వచ్చి వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ఆడియోను విడుదల చేశారు.
మద్యం కుంభకోణంలో సిట్ రెండుసార్లు నోటీసులు ఇచ్చిందని రాజ్ కసిరెడ్డి తెలిపారు. దీనిపై న్యాయస్థానానికి వెళ్లానని చెప్పారు. నిర్ణీత సమయం ఇచ్చి నోటీసులు ఇవ్వాలని కోర్టు ఆదేశించిందని పేర్కొన్నారు. అదేవిధంగా న్యాయరక్షణ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్లు వివరించారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల కోసం నిరీక్షిస్తున్నానని వెల్లడించారు. లిక్కర్ స్కామ్తో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తనపై విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారని చెప్పారు. తన న్యాయపోరాటం పూర్తయిన తర్వాత మీడియాను పిలిపించి ఆయన చరిత్ర బయటపెడతానని రాజ్ కసిరెడ్డి ఆడియోలో తెలియజేశారు.
AP Liquor Scam Updates : వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్లో నాటి ప్రభుత్వ పెద్దల తరఫున అన్ని తానై కసిరెడ్డి రాజశేఖర్రెడ్డి (రాజ్ కసిరెడ్డి) కీలక పాత్రధారిగా వ్యవహారించారు. 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్తో కలసి పనిచేసిన ఆయన వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఐటీ సలహాదారుగా నియమితులయ్యారు. ఆ పదవిలో ఉంటూనే తెరవెనుక మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించారు. అప్పట్లో ప్రభుత్వమే నిర్వహించిన మద్యం షాపులకు జే బ్రాండ్ల మద్యం సరఫరాలో ఈయన ఆదేశాలు కీలకంగా పనిచేశాయి.
కమీషన్లు చెల్లించిన కంపెనీల నుంచి ప్రతి నెలా రూ.60 కోట్లకు తగ్గకుండా వసూలు చేసి దాదాపు రూ.3000 కోట్ల వరకూ తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు రాజ్ కసిరెడ్డి చేర్చినట్లు సిట్ ఆధారాలు సేకరించినట్లు సమాచారం. లంచాల నెట్వర్క్ను రూపొందించడంతో పాటు వైఎస్సార్సీపీ సర్కార్లో పేరున్న ఓ నేతతో కలసి హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ప్రత్యేకంగా కార్యాలయమే ఏర్పాటు చేసి దందా నిర్వహించినట్లు అధికారులకు ఆధారాలు లభించాయి. ఏ మద్యం కంపెనీ నుంచి ఎంత సరుకు కొనుగోలు చేయాలో ఏ రోజు, ఏ బ్రాండ్లు ఎంత మేరకు విక్రయించాలో రాజ్ కసిరెడ్డే నిర్ణయించేవారని తెలుస్తోంది.
రాజ్ కసిరెడ్డి క్రిమినల్ - ప్రాంతీయ పార్టీల్లో నెంబర్-2 ఉండదు: విజయసాయి
లిక్కర్ స్కామ్ - రాజ్ కసిరెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో సిట్ సోదాలు