PSR Anjaneyulu Admitted Hospital : విజయవాడ ప్రభుత్వాస్పత్రికి పీఎస్ఆర్ ఆంజనేయులును పోలీసులు తరలించారు. బీపీలో హెచ్చుతగ్గుల కారణంగా ఆయణ్ని ఆసుపత్రిలో చేర్పించారు. విజయవాడలోని జిల్లా జైలులో పీఎస్ఆర్ రిమాండ్లో ఉన్న విషయం తెలిసిందే. మరోవైపు గ్రూప్-1 పరీక్షల అక్రమాల్లో ప్రధాన నిందితుడు, ఏపీపీఎస్సీ నాటి కార్యదర్శిగా పనిచేసిన పీఎస్ఆర్ లీలలెన్నో బయటికొస్తున్నాయి.
పీఎస్ఆర్ ఆంజనేయులు అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి అండ చూసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. మాన్యువల్ మూల్యాంకనం పేరుతో హాయ్ల్యాండ్లో నిర్వహించిన తంతుకు సంబంధించి ఆధారాలు మాయం చేసినట్లు తెలిసింది. ఏకంగా ఏపీపీఎస్సీ కార్యాలయంలోని హార్డ్డిస్క్తో పాటు ఈ వ్యవహారానికి సంబంధించి నోట్ఫైల్స్ కూడా తనతో తీసుకెళ్లిపోయారు. తన పాత్ర ఎక్కడా బయటపడకుండా ఉండేందుకే ఇలా చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కరోనా సాకుతో పీఎస్ఆర్ మెయిన్స్ జవాబు పత్రాలను డిజిటల్ మూల్యాంకనం చేయించారు. పరీక్ష పత్రాలను స్కాన్ చేయించి వాటిని అధ్యాపకులకు పంపించి మూల్యాంకనం చేయించారు. ఆ మార్కులను 2021 ఏప్రిల్లో ప్రకటించారు. డిజిటల్ మూల్యాంకనంపై అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు. మాన్యువల్ పద్ధతిలోనే మూల్యాంకనం చేయాలని ధర్మాసనం తీర్పునిచ్చింది. ఇది ఏమాత్రం ఇష్టం లేని పీఎస్ఆర్ హైకోర్టును మభ్యపెట్టేందుకు హాయ్ల్యాండ్లో ఏర్పాట్లు చేశారు.
మాన్యువల్ మూల్యాంకనం చేయకుండా, డిజిటల్ విధానంలో ఆయా అభ్యర్థులకు వచ్చిన మార్కులనే ఓఎంఆర్ షీట్లలో నమోదు చేయించారు. ఓఎంఆర్ షీట్లను స్కాన్ చేశారు. ఆ మార్కులను ఏపీపీఎస్సీ సర్వర్లో నిక్షిప్తం చేయించారు. ఈ మార్కులనే ప్రకటించేందుకు సిద్ధమయ్యే తరుణంలో కమిషన్లో భేదాభిప్రాయాలు రావడంతో ఈ విషయం బయటకొచ్చింది. అనంతరం పి.సీతారామాంజనేయులును మార్చారు. మూల్యాంకనానికి సంబంధించి డేటా ఉన్న హార్డ్డిస్క్ను కూడా పీఎస్ఆర్ తీసుకెళ్లిపోయినట్లు దర్యాప్తులో తేలింది.
నోట్ ఫైల్స్ కూడా గల్లంతు : సీతారామాంజనేయులు పేపర్ల మూల్యాంకనం బాధ్యతలను క్యామ్సైన్కు అప్పగించి ఆ సంస్థ ప్రతినిధి మధుసూదన్ ద్వారా అంతా ఈ తంతగాన్ని నడిపించారు. దీనికిగాను మధుకు రూ.1.14 కోట్ల చెక్కు ఇచ్చారు. ఇందులో రూ.20 లక్షలు హాయ్ల్యాండ్లో అద్దె, సిబ్బందికి భోజనం, అల్పాహారం, వసతి, తదితర ఏర్పాట్లకు చెల్లించారు. మార్కుల నమోదుకు వచ్చిన 66 మందికి రూ.10.30 లక్షలు ఇచ్చారు. మిగిలిన డబ్బు ఏమైందన్న సంగతి తేలలేదు.
ఎలాంటి ఎంవోయూ లేకుండానే క్యామ్సైన్కు వర్క్ ఆర్డర్ ఇచ్చారు. హాయ్ల్యాండ్ వేదికగా మాన్యువల్ మూల్యాంకనం పేరిట తంతు నడిపించేందుకు పమిడికాల్వ మధుసూదన్ 66 మందిని నియమించుకున్నారని దర్యాప్తులో తేలింది. ఈ మొత్తం వ్యవహారంలో నడిచిన నోట్ ఫైళ్లలో పీఎస్ఆర్ సంతకాలు చేసినట్లు తెలిసింది. కానీ అవేవీ ఇప్పుడు ఏపీపీఎస్సీ కార్యాలయంలో లేవని పోలీసులు నిర్ధారించారు. వీటిని కూడా సీతారామాంజనేయులు మాయం చేశారన్న అంచనాకు వచ్చారు.
మధు ఖాతాల పరిశీలనతో వెలుగులోకి : మధుసూదన్ బ్యాంకు ఖాతాలను పోలీసులు పరిశీలిస్తుండగా మూల్యాంకనంలో పాల్గొన్న చాలామంది ఖాతాలకు సొమ్ము బదిలీ చేసినట్లు వెలుగులోకి వచ్చింది. వారిని పిలిచి విచారించి ఇప్పటికే స్టేట్మెంట్లు తీసుకున్నారు. సంతకాలు వారివే అని పోలీసులు ధ్రువీకరించుకున్నారు. ఇప్పుడు దర్యాప్తులో అవే కీలకంగా మారాయి.
గ్రూప్-1 పరీక్షా పత్రాల మూల్యాంకనం - వెలుగులోకి పీఎస్ఆర్ అవినీతి బాగోతం
'వాల్యూయేషన్ అవసరం లేదు' - మేమిచ్చిన మార్కులు ఎంటర్ చేస్తే చాలు