Dead Body Issue In Nalgonda District : ఓ యువకుడు ప్రేమించి వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడనే విషయంలో సరూర్నగర్లో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇవాళ మృతురాలి బంధువులు మృతదేహంతో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆ యువకుడి ఇంటిముందు ఆందోళనకు దిగారు. ఎంతకీ ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు నిందితులకు కచ్చితంగా శిక్ష పడేలా చేస్తామని హామీ ఇవ్వడంతో దహన సంస్కారాలకు ఒప్పుకున్నారు. మృతురాలి బంధువులతో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర రాజు ప్రత్యేక హమీ మేరకు ఆందోళన విరమించేలా ఒప్పించారు.
నిందితులను విడిచిపెట్టం : ఈ నేపథ్యంలో డీఎస్పీ మాట్లాడుతూ ఆ యువతి మృతికి కారణమైన వారందరి పేర్లు ఎఫ్ఐఆర్లో చేర్చేందుకు నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సరూర్నగర్ పోలీసులతో సంప్రదింపులు జరిపినట్లు తెలిపారు. ఈ కేసు విషయంలో నిందితులను వదలబోమని డీఎస్పీ తేల్చి చెప్పారు. బాధితులకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేస్తామని తెలిపారు.
"బొక్కమంతలపహడ్కు ధర్మారపు మల్లేశ్వరి అనే యువతి హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదైంది. దానిలో కొంత మంది నిందితుల పేర్లు చేర్చలేదనే కారణంతో ఆందోళన చేయడం జరిగింది. నిందితులు ఎవరైతే ఉన్నారో వారి అందరి పేర్లు చేర్చి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఎస్పీ గారు అక్కడి డీసీపీతో మాట్లాడటం జరిగింది. ఈ కేసులో తప్పకుండా న్యాయం చేస్తాం" రాజశేఖర రాజు, మిర్యాలగూడ డీఎస్పీ
వివరాల్లోకి వెళ్తే : నల్గొండ జిల్లా నిడమనూర్ మండల బొక్కమంతలపహడ్కు చెందిన కుక్కల జానారెడ్డి, అదే గ్రామంలోని ధర్మారపు మల్లేశ్వరి అనే యువతి ప్రేమించుకున్నారు. ఇటీవల జానారెడ్డి మరో యువతిని వివాహం చేసుకున్నాడన్న విషయం తెలుసుకున్న మల్లేశ్వరి తీవ్ర మనస్థాపంతో సోమవారం(ఏప్రిల్ 14) ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి యువకుడి ఇంటి ముందు పెట్టి ధర్నాకు దిగారు. మృతదేహాన్ని అక్కడి నుంచి తొలగించాలని కోరితే అంగీకరించలేదు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో మృతిరాలి తరఫు బంధువులు అంగీకరించారు.