Government Appointing Special Advocate For Diver Subramaniam Case : కాకినాడకు చెందిన దళిత యువకుడు, డైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్యచేసి, డోర్ డెలివరీ చేశారన్న నేరారోపణలపై నమోదైన కేసులో కదలిక వచ్చింది. ఈ కేసు విచారణకు సంబంధించి ప్రాసిక్యూషన్కు సహకరించేందుకు రాజమహేంద్రవరానికి చెందిన న్యాయవాది, పౌరహక్కుల నేత ముప్పాళ్ల సుబ్బారావును ప్రత్యేక న్యాయవాదిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. కాకినాడలో 2022 మే 19న సుబ్రహ్మణ్యం హత్య జరిగింది.
తన మాజీ డ్రైవర్ను తానే హత్య చేశానంటూ అనంత ఉదయభాస్కర్ (అనంతబాబు) అంగీకరించినట్లుగా అప్పటి ఎస్పీ వెల్లడించారు. తరువాత ఆయన్ను జైలుకు తరలించారు. నిందితుడు అప్పటి అధికార పార్టీ ప్రజాప్రతినిధి కావడంతో ఈ కేసు దర్యాప్తును నీరుగార్చేందుకు కొందరు పోలీసులు చక్రం తిప్పారు. ఈ క్రమంలో మధ్యంతర బెయిల్ పొందిన అనంతబాబు రెండేళ్లుగా బయటే తిరుగుతున్నారు. కానీ నిరుపేదలైన సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు నూకాలమ్మ, సత్యనారాయణ మూడేళ్లుగా న్యాయపోరాటం చేస్తున్నారు.

సమగ్రంగా విచారించలేదు : ఈ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుతోపాటు మరికొందరి ప్రమేయం ఉందన్న ఆరోపణలున్నాయి. దానికి బలం చేకూర్చేలా హత్య జరిగినప్పుడు అంతకుముందు, తరువాత నిందితుడు తన ఫోన్ నుంచి ఎవరెవరితో మాట్లాడారో పోలీసులు తేల్చలేదు. ఘటనా స్థలంలో ఎవరున్నారో టవర్ లోకేషన్, గూగుల్ టేక్అవుట్, సీసీ ఫుటేజీలతో గుర్తించలేదు. ఘటన జరిగినప్పుడు ఎమ్మెల్సీ వెంట ఉన్న గన్మెన్లనూ సమగ్రంగా విచారించలేదు.
సాంకేతిక ఆధారాలు, ఇతర నిందితుల ప్రస్తావన లేకుండా 88 రోజులకు 2022 ఆగస్టు 22న పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీటును న్యాయస్థానం తిరస్కరించింది. 2023 ఏప్రిల్ 14న అనుబంధ ఛార్జిషీట్ వేశారు. కావాలనే గడువులోగా ఛార్జిషీట్ వేయకుండా నిందితుడికి బెయిల్ వచ్చేలా అప్పటి ఎస్పీ, డీఎస్పీలు సహకరించారన్న విమర్శలున్నాయి. ఇప్పటికైనా ఈ కేసు దర్యాప్తును సిట్కు అప్పగించాలన్న వాదన దళిత వర్గాల నుంచి వినిపిస్తోంది.
ఒక్కరివల్ల సాధ్యమవుతుందా? : సుబ్రహ్మణ్యం హత్య కేసు దర్యాప్తును తప్పుదారి పట్టించేలా ముద్దాయికి కొందరు పోలీసు అధికారులు, గత ప్రభుత్వం సహకరించిందని ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు ఆరోపిస్తున్నారు. యువకుడి శరీరంపై 31, అంతర్గతంగా మరో మూడు గాయాలు చేయడం ఒక్కరివల్ల సాధ్యమవుతుందా? అని ప్రశ్నించారు. ఈ కేసులో మరింతమంది ప్రమేయం ఉందనే దిశగా పోలీసులు విచారణ చేయలేదన్నారు. ప్రభుత్వం తనకు అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తానని తెలిపారు. ప్రాసిక్యూషన్కు సహకరిస్తూ నిందితులందరికీ చట్టప్రకారం శిక్ష పడేలా కృషి చేస్తానని వెల్లడించారు.
Prathidwani: అనంతబాబు డ్రైవర్ హత్య కేసు.. తేలాల్సిన నిజాలెన్ని..?
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో కానరాని పురోగతి- రెండేళ్లుగా బయట తిరుగుతున్న అనంతబాబు