Preferential Policy for Job Recruitment : ఇవాళ్టి నుంచి ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రానుండటంతో ప్రభుత్వ ఉద్యోగాలను క్రమబద్ధంగా, సమాన పద్ధతిలో భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రిఫరెన్షియల్ విధానాన్ని అమలు చేయనుంది. ఇప్పటికే దివ్యాంగులకు ఉద్యోగాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. ఉదాహరణకు ఎస్సీల్లోని గ్రూప్-1 కులాలకు నోటిఫై చేసిన ఖాళీలు భర్తీ కాకుంటే తదుపరి ప్రాధాన్యం కలిగిన గ్రూప్-2 కేటగిరీలోని అర్హులైన అభ్యర్థులతో ఆ పోస్టులను భర్తీ చేస్తారు. ఒకవేళ గ్రూప్-2లో సరైన అభ్యర్థులు లేకుంటే గ్రూప్-3లోని అభ్యర్థులతో భర్తీ చేస్తారు.
ఒకవేళ గ్రూప్-1,2,3 మూడింటిలోనూ సరైన అభ్యర్థులు లేకుంటే ఆ పోస్టులను క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ప్రస్తుతం ఈ ప్రిఫరెన్షియల్ విధానం దివ్యాంగుల కేటగిరీలోని అభ్యర్థులకు అమలు అవుతోంది. ఈక్రమంలో ఎస్సీ వర్గీకరణ ఇవాళ్టి నుంచి ప్రారంభించడం వల్ల ఈ విధానాన్ని ఎస్సీ అభ్యర్థులకూ అమలు చేసేందుకు ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది.
మూడో రోస్టర్ పాయింట్ గ్రూప్-2 కులాలకు : ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రోస్టర్ పాయింట్లు ఎంతో కీలకం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగుల రిజర్వేషన్ శాతాల ప్రకారం ఇవి ఉంటాయి. అయితే ఎస్సీల వర్గీకరణపై ఏర్పాటైన ఏకసభ్య కమిషన్ రోస్టర్ పాయింట్లను గ్రూపుల వారీగా విభజించింది. ప్రతిపాదిత రిజర్వేషన్ల ప్రకారం కేటాయించింది. దీని ప్రకారం గ్రూప్-1కు ఒకటి, గ్రూప్-2కు తొమ్మిది, గ్రూప్-3కు ఐదు రోస్టర్ పాయింట్లు రానున్నాయి. ఉద్యోగాల భర్తీ, పదోన్నతుల్లో 100 పాయింట్లు రోస్టర్ పట్టికలో ఎస్సీలకు కేటాయించిన తొలి రోస్టర్ పాయింట్ గ్రూప్-2లోని కులాలకు దక్కనుంది. అలాగే రెండో రోస్టర్ పాయింట్ గ్రూప్-1లోని కులాలకు లభిస్తుంది. గ్రూప్-2లోని కులాలకు తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఉండటంతో మూడో రోస్టర్ పాయింట్ గ్రూప్-2 కులాలకు రానుంది. నాలుగో రోస్టర్ పాయింట్ గ్రూప్-3లోని కులాలకు లభించనుంది.
మొత్తం రోస్టర్ పాయింట్లలో ఎస్సీల్లోని గ్రూపులకు దక్కేవి :
- గ్రూప్-1: 7
- గ్రూప్-2: 2, 16, 27, 47, 52, 66, 72, 87, 97
- గ్రూప్-3: 22, 41, 62, 77, 91
గ్రూప్ 1 పోస్టుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు ఖరారు చేసిన టీజీపీఎస్సీ - అభ్యర్థులకు సూచనలివే!
నేటి నుంచి అమల్లోకి ఎస్సీ వర్గీకరణ చట్టం - తొలి కాపీ సీఎం రేవంత్ రెడ్డికి