Police on Misleading Complaints : తప్పుడు కంప్లైంట్లతో పోలీసులను కొందరు ముప్పుతిప్పలు పెట్టిస్తున్నారు. చోరీ జరగకున్నా జరిగిందని ఆర్థిక సమస్యలు, వ్యక్తిగత కారణాలు, ఇతరుల్ని కటకటాల్లోకి నెట్టాలని ఇలా వేర్వేరు కారణాలతో పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. వారిచ్చిన ఫిర్యాదును ఆధారంగా చేసుకుని పోలీసులు ఉరుకులు పరుగులు పెట్టడం రోజుల తరబడి దర్యాప్తు చేశాక ఒట్టిదేనని తేలడంతో ఉసూరుమంటున్నారు. ఎందుకు ఈ విధంగా చేశావంటే పొరపాటు జరిగిందని ఫిర్యాదుదారులు నాలుక మడతేస్తున్నారు.
ఇటీవల జరిగిన ఘటనలు : నగరంలోని కేపీహెచ్బీ వసంత్నగర్లోని ఓ ఇంట్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న వ్యక్తి తన భార్య నిద్రిస్తున్న సమయం చూసి ఆమె మెడలోని పసిడి పుస్తెలతాడు కొట్టేశాడు. తప్పు తన మీదకు రావొద్దని ఉదయాన్నే దొంగ వచ్చి ఎత్తుకెళ్లాడని పోలీసులకు కంప్లైంట్ చేశాడు. దర్యాప్తు చేసినటువంటి పోలీసులు ఇంటిలోకి కొత్త వ్యక్తులు రాలేదని గుర్తించి అతడిని ప్రశ్నించగా తానే చోరీ చేశానని అంగీకరించాడు.
ఎంఎంటీఎస్ ట్రైన్లో తనపై ఓ వ్యక్తి అత్యాచారానికి యత్నించినట్లుగా యువతి ఫిర్యాదు చేసింది. ఈ కేసుపై పోలీసులు దాదాపు నెల రోజుల పాటు దర్యాప్తు చేశారు. దాదాపు వంద మంది వరకు అనుమానితుల్ని ప్రశ్నించి 250 సీసీ ఫుటేజీలను పరిశీలించారు. చివరకు సదరు యువతి రీల్స్ చేస్తూ కిందపడ్డట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
లైంగిక వేధింపులు, దొంగతనం(చోరీ) లాంటి తీవ్ర నేరాల్లోనూ తప్పుడు సమాచారం ఇవ్వడమనేది ఆందోళన కలిగిస్తోంది. అసలే సిబ్బంది కొరత, బందోబస్తు విధులు, మరోవైపు పని ఒత్తిడి భారంతో సతమతమయ్యే పోలీసులకు ఇలాంటి ఫిర్యాదులు సవాలుగా మారుతున్నాయి.
జైలు శిక్ష, జరిమానా తప్పవు : ఠాణాకు ఒక ఫిర్యాదు వచ్చినప్పుడు నేర తీవ్రతను బట్టి సిబ్బందికి పనులను అప్పగిస్తారు. తీరా తప్పుడు కంప్లైంట్ అని తేలినప్పుడు సిబ్బంది పడ్డ శ్రమంతా వృథా అవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసుల్ని తప్పు దోవ పట్టించడం, ఇతర ఉద్దేశాలతో నకిలీ కంప్లైంట్ చేసినవారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసే అధికారముంది. ఇలాంటి కేసుల్లో గరిష్ఠంగా ఏడాది జైలు, రూ.10 వేల జరిమానా కూడా విధించొచ్చు. కానీ పోలీసులు వారిని మానవతా దృక్పథంతో కౌన్సెలింగ్ ఇచ్చి వదిలేస్తున్నారు.
బాంబు బెదిరింపులతో సమస్య : హైదరాబాద్ నగరంలోని 3కమిషనరేట్లలో ఏటాసగటున 5% తప్పుడు కంప్లైంట్లు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పర్యాటక ప్రాంతాలు, ప్రభుత్వ ఆఫీసులకు బాంబు బెదిరింపు కాల్స్ నుంచి ఠాణాలకు వచ్చే ఫిర్యాదుల వరకూ ఈ కోవలోనివే. ముఖ్యంగా భార్యాభర్తల గొడవల్లో వచ్చేటువంటి ఫిర్యాదుల్లో సగానికిపైగా నకిలీవే ఉంటున్నాయి. ఇటీవల పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్య జరిగిందని డయల్ 100కు కంప్లైంట్ అందగా పోలీసులు హుటాహుటిన అక్కడికెళ్లగా ఉత్తదేనని తేలింది. ఈ విధంగా వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. ఈప్రభావం ఇతరకేసుల దర్యాప్తునపై ప్రభావం పడుతోందని పోలీసులు వాపోతున్నారు.
"పోలీసులకు కంప్లైంట్ చేసేటప్పుడు నిజం చెబితే సత్వర న్యాయమనేది దక్కుతుంది. తప్పుడు కంప్లైంట్తో విలువైన సమయం వృథా అవడంతో పాటు ఇతర కేసుల దర్యాప్తుపైన కూడా ప్రభావం చూపిస్తుంది. కొన్నిసార్లు దర్యాప్తు మొదలయ్యాక తప్పుడు సమాచారం, వ్యాఖ్యలతోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి" - కేపీవీ రాజు, ఇబ్రహీంపట్నం ఏసీపీ