Drugs Seized in Shadnagar : మత్తు పదార్థం ఏదైనా క్షణాల్లో తెచ్చివ్వడం అతడి స్టైల్. కోట్ల రూపాయల విలువ చేసే హెరాయిన్, లక్షలు, వేలల్లో ధర పలికే పాపీస్ట్రా, గంజాయి, ఓపీయం ఇలా సరుకు ఏదైనా అతడి దగ్గర నిత్యం అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ శివారులోని దాబా కేంద్రంగా పెద్దఎత్తున డ్రగ్స్ స్మగ్లింగ్కు పాల్పడిన వంటమేస్త్రి వికాస్ సాహూ నేపథ్యమిది.
ఈ కేసులో 3 కోట్ల రూపాయలకు పైగా హెరాయిన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తులో దాబా కేంద్రంగా జరిగిన మత్తు దందాలో కీలక విషయాల్ని గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కేవలం లారీ డ్రైవర్లు, తన దగ్గరకు వచ్చే వినియోగదారులే అతడి లక్ష్యం. గంజాయికి అలవాటుపడిన అతడే, కోట్ల రూపాయలు విలువచేసే మత్తు దందాకు కేంద్ర బిందువయ్యాడు.
ఉపాధి కోసం వచ్చి : రాజస్థాన్లోని నాగౌర్ జిల్లాకు చెందిన వికాస్ సాహు ఉపాధి కోసం 2019లో రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలానికి వచ్చాడు. తెలిసిన వారి సాయంతో షాద్నగర్ సమీపంలోని రాయికల్ టోల్గేట్ దగ్గర రాజస్థాన్కు చెందిన సంజు భాయ్ దాబాలో వాచ్మెన్గా చేరాడు. అప్పటికే సంజు గంజాయి తీసుకునేవాడు. ధూల్పేటకు చెందిన సలీమ్ ద్వారా గంజాయి తెప్పించుకుని తన అవసరాలు పోను మిగిలిన గంజాయిని లారీడ్రైవర్లకు అమ్మేవాడు. సంజు భాయ్తో సాన్నిహిత్యం పెంచుకున్న వికాస్ వంట మాస్టర్ అవతారమెత్తాడు. గంజాయి అలవాటు చేసుకున్నాడు. ఇద్దరూ 2022లో జడ్చర్ల పోలీసులకు పట్టుబడ్డారు. జైలు నుంచి బయటకొచ్చినా దందా మాత్రం ఆపకుండా మరింతగా విస్తరించారు.
రూ.3.05 కోట్లు ఉంటుందని అంచనా : మధ్యప్రదేశ్కు చెందిన గణపథ్ సాయంతో హెరాయిన్, పాపీస్ట్రా, ఓపియం తెప్పించారు. కమీషన్ల లెక్కన లారీ డ్రైవర్లకు విక్రయించేవారు. ఇటీవల సంజు మరణంతో వికాస్ దాబాను సొంతం చేసుకుని ఒక్కడే విక్రయించడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే 15 రోజుల క్రితం మధ్యప్రదేశ్కు చెందిన గణ్పథ్ ద్వారా 1.5 కిలోల హెరాయిన్, 750 గ్రాముల ఓపీయం, 3.5 కిలోల పాపీస్ట్రా, జల్పల్లికి చెందిన రాజు నుంచి 1.5 కిలోల గంజాయి తెప్పించాడు.
పోలీసుల అంచనా ప్రకారం మార్కెట్లో వీటి ధర సుమారు రూ.3.05 కోట్లు ఉంటుంది. ఈ సరుకులో నుంచి 15 రోజుల వ్యవధిలో అరకిలో గంజాయి, 700 గ్రాముల పాపీస్ట్రా, 100 గ్రాముల ఓపీయం విక్రయించేవాడు. ఆ తరువాత పోలీసులకు చిక్కాడు. వికాస్సాహు దాబాలోని ఓ గదిలోని చెక్కపెట్టెలో రూ.3 కోట్ల నగదు చూసి పోలీసులే విస్తుపోయారు.
సినీ స్టైల్లో పోలీసులు రెక్కీ : నిందితుడిని పట్టుకోవడానికి లారీ డ్రైవర్ల తరహాలో మారువేషాలు వేసి సినీ స్టైల్లో పోలీసులు రెక్కీ నిర్వహించారు. డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు పక్కాగా నిర్థారించుకుని అరెస్టు చేశారు. దాబాను సీజ్ చేశారు. నిందితుడి నుంచి మరింత సమాచారం సేకరించేందుకు కస్టడీకి తీసుకుంటామని, కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని పోలీసులు తెలిపారు.
లారీ డ్రైవర్లే అధికం : వికాస్ సాహు దగ్గర మత్తు పదార్థాలు కొనుగోలు చేస్తున్న వారిపై పోలీసులు దృష్టిసారించారు. నిందితుడిచ్చిన వాంగ్మూలం ప్రకారం ఎక్కువగా లారీ డ్రైవర్లు కొనుగోలు చేస్తున్నట్లు చెబుతున్నాడు, కానీ మరికొందరూ ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. డ్రైవర్లు గంజాయి, ఓపీయం, పాపీస్ట్రా లాంటి తక్కువ ధర ఉన్నవి వాడతారని తెలిపాడు. ఒక గ్రాము హెరాయిన్ను రూ.12 వేలకు కొని రూ.15 వేలకు విక్రయిస్తున్నట్లు సాహు చెబుతున్నాడు. డ్రైవర్లు వేలల్లో ధర చెల్లించి హెరాయిన్ కొనుగోలు చేసే అవకాశంలేదని పోలీసులు అంటున్నారు. ఈ నేపథ్యంలో కచ్చితంగా ఇతర కొనుగోలుదారులకు హెరాయిన్ విక్రయిస్తున్నట్లు భావిస్తున్నారు. నిందితుడి నుంచి మొత్తం ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫోన్ కాల్స్, ఇతర డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. దీని ప్రకారం కొనుగోలు దారులు ఎవరో తెలిసే అవకాశముంది. ఈ కేసులో పరారీలో ఉన్న సలీమ్, రాజు, గణపథ్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
దాబాలో రూ.3 కోట్ల డ్రగ్స్ పట్టివేత - ఇద్దరు అరెస్టు
దారి వెంట 'మత్తు' భయం - మహానగరంలో రెచ్చిపోతున్న గంజాయి బ్యాచ్లు!