Police Saved Two Children Lives In YSR District: కారులో ఊపిరాడక ఏడుస్తున్న ఇద్దరు చిన్నారుల ప్రాణాలను తిరుమల ట్రాఫిక్ పోలీసులు సమయస్ఫూర్తితో కాపాడారు. అత్యంత చాకచక్యంతో చిన్నారుల ప్రాణాలను కాపాడిన ట్రాఫిక్ పోలీసులపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్సార్ జిల్లా బద్వేలులో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోనికి వెళ్తే
అసలేం జరిగిందంటే? వైఎస్సార్ జిల్లా బద్వేలు ప్రాంతంలో వెంకటసుబ్బారెడ్డి, సుమలత దంపతులకు భాను(7), నీల(4) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. వెంకటసుబ్బారెడ్డి ఉపాధి కోసం విదేశాలకు వెళ్లారు. సుమలత తన పిల్లలతోపాటు వెంకటసుబ్బారెడ్డి అన్న గంగయ్య, అతని భార్య, అల్లుడు గురువారం తిరుమల శ్రీవారి దర్శనార్థం కారులో బయలుదేరారు. అలిపిరి వచ్చిన తరువాత సుమలత, గంగయ్య భార్య కాలినడకన తిరుమల వెళ్లారు. గంగయ్య, ఇద్దరు పిల్లలు, అల్లుడు మాత్రం తిరుమలకు కారులో చేరుకుని స్థానిక వరాహస్వామి అతిథిగృహం-1 పార్కింగ్ సమీపంలో పార్క్ చేశారు.
దర్శనానికి ఎలా వెళ్లాలో తెలుసుకునేందుకు పిల్లలను కారులోనే ఉంచి గంగయ్య, అతని అల్లుడు బయటకు వెళ్లారు. డోర్లు లాక్ చేసుకుని వెళ్లడంతో కొంతసేపటికి కారులోని పిల్లలు ఊపిరాడక విలపించారు. సమీపంలోని ట్యాక్సీ డ్రైవర్లు ఇది గుర్తించి తిరుమల ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు అక్కడికి చేరుకుని కారు అద్దాన్ని పగలగొట్టి చిన్నారులను కాపాడి టీటీడీ అశ్విని ఆసుపత్రికి తరలించారు. అనంతరం చిన్నారులను ట్రాఫిక్ హోంగార్డు జయచంద్ర, పీఎస్జీ వెంకటేశ్లు వన్టౌన్ పోలీసులకు అప్పగించి చిన్నారుల పెదనాన్న గంగయ్యపై ఫిర్యాదు చేశారు. పిల్లల ప్రాణాలను రక్షించిన పోలీసులకు తల్లి సుమలత ధన్యవాదాలు తెలిపారు.
కారులో మంటలు: తిరుమల సీఆర్వో కార్యాలయం పార్కింగ్ ప్రాంతంలో నిలిపిన కారులో మంటలు చెలరేగాయి. ఒంగోలు నుంచి తెల్లవారుజామున భక్తులు కారులో తిరుమల చేరుకున్నారు. కారులో నుంచి మంటలు చెలరేగడంతో అప్రమత్తమై భక్తులు బయటకు రావటంతో ప్రాణాపాయం తప్పింది. సమాచారం తెలుసుకుని అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలార్పారు.