Police Rescued Missing Women in Forest : తునికి ఆకు కోసం వెళ్లిన మహిళలు అడవిలో తప్పిపోవడంతో స్పెషల్ ఆపరేషన్ చేపట్టిన అధికారులు వారిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపిన వివరాల ప్రకారం,
నిర్మల్ జిల్లా మామడ మండలం కప్పన్ గ్రామానికి చెందిన కొందరు మహిళలు గ్రామ సరిహద్దుల్లో గల అటవీ ప్రాంతంలోకి గురువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వెళ్లారు. తునికాకు తీసుకుని ఇంటికి వెళ్దాం అనుకునే సరికి ఉన్నట్లుండి వర్షం పడింది. ఇంటికి వెళ్లిపోవాలి అన్న తొందర్లో సగం మంది దారి తప్పిపోయారు. ఇళ్లకు చేరిన మిగతా మహిళలు అటవీ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు నలుగురు తప్ప మిగతా అందరినీ సురక్షితంగా ఇళ్లకు చేర్చారు. రాధ, లింగవ్వ, లక్ష్మి, సరోజా వీరి జాడ మాత్రం కనిపెట్టలేకపోయారు.
డ్రోన్ సాయంతో : మిగతా నలుగురి కోసం సాయంత్రం నుంచి అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గ్రామస్థుల సహాయంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినా వారి జాడ కనిపించలేదు. శుక్రవారం ఉదయాన్నే నిర్మల్ జిల్లా స్పెషల్ ఫోర్స్కు సమాచారం అందించి వారి సహాయం తీసుకున్నారు. అందరూ కలిసి అక్కడ స్థానికంగా ఆల్ ఉమెన్ స్పెషల్ పార్టీ సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. వీరంతా కలిసి అత్యాధుని సాంకేతికత ఉపయోగించి, జీపీఎస్, డ్రోన్స్ సహాయంతో బాధితులను గుర్తించారు. వారందరికి పండ్లు, నీరు ఇచ్చారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
"గురువారం కొందరు మహిళలు తునికాకు కోసం అడవిలోకి వెళ్లారు. వర్షం పడేసరికి అందరూ భయపడ్డారు. ఇంటికి తొందరగా వెళ్లాలనే తొందరలో కొందరు మిస్ అయ్యారు. వెంటనే మాకు సమాచారం ఇచ్చారు. గ్రామస్థుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టాం. నలుగురు మాత్రం కనిపించలేదు. వారి కోసం జీపీఎస్, డ్రోన్ సాయంతో వెతికాం. చాలాసేపటికి వారిని గుర్తించాం. వారిని కుటుంబ సభ్యులకు అప్పగించాం." - జానకి షర్మిల, నిర్మల్ ఎస్పీ
భార్య మిస్సింగ్ - కంటి చూపు మందగించి భర్తకు ఆపరేషన్! కళ్లు తెరిచి చూస్తే పక్క బెడ్లో!
'కనీసం చనిపోయాడనైనా చెప్పండి' : కుమారుడి కోసం 12 ఏళ్లుగా ఎదురుచూపులు