వైఎస్ జగన్ హెలికాప్టర్ ఇష్యూ - కోపైలట్ను ప్రశ్నించిన పోలీసులు
వైఎస్ జగన్ హెలికాప్టర్ ఘటన - కోపైలట్ శ్రేయస్ జైన్ను విచారించిన పోలీసులు

By ETV Bharat Andhra Pradesh Team
Published : April 16, 2025 at 11:29 PM IST
YS Jagan Helicopter Incident : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ నెల 8న రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో పర్యటించిన విషయం తెలిసిందే. సందర్భంగా హెలిప్యాడ్ వద్ద జరిగిన పరిణామాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఆ రోజు చోటుచేసుకున్న పరిణామాలపై వివరణ ఇచ్చేందుకు పైలట్, కోపైలట్ విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీనిలో భాగంగా కోపైలట్ శ్రేయస్ జైన్ ఇవాళ విచారణకు హాజరయ్యారు.
శ్రీసత్యసాయి జిల్లా సీకేపల్లిలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) కార్యాలయంలో ధర్మవరం డీఎస్పీ హేమంత్కుమార్, సీకేపల్లి సీఐ శ్రీధర్ కలిసి సుమారు నాలుగు గంటలపాటు శ్రేయస్ జైన్ను ప్రశ్నించారు. విచారణ పూర్తయ్యాక కోపైలట్ బెంగళూరు తిరిగి వెళ్లిపోయారు. తాము అడిగిన అన్ని ప్రశ్నలకు శ్రేయస్ జైన్ సమాధానం ఇచ్చారని సీఐ శ్రీధర్ పేర్కొన్నారు. సెలవులో ఉన్నందున పైలట్ అనిల్ కుమార్ విచారణకు హాజరుకాలేదని చెప్పారు. ఆయనకు మరోసారి నోటీసులు ఇవ్వనున్నట్లు సీఐ శ్రీధర్ వివరించారు.
అసలేెం జరిగిదంటే : శ్రీసత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లిలో హత్యకు గురైన వైఎస్సార్సీపీ కార్యకర్త లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ జగన్ ఇటీవల గ్రామానికి వచ్చారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. అక్కడ దిగిన వెంటనే వైఎస్సార్సీపీ శ్రేణులు బారికేడ్లను తోసుకొని జగన్ను చుట్టుముట్టాయి. ఈ సందర్భంగా హెలికాప్టర్ విండ్ షీల్డ్ దెబ్బతిందని, ప్రభుత్వం, పోలీసుల భద్రతా వైఫల్యంతోనే జరిగిందని ఆ పార్టీ నేతలు ఆరోపణలు చేశారు.
తమ అధినేత వైఎస్ జగన్ హెలికాప్టర్లో వెళ్లే పరిస్థితి లేక రోడ్డుమార్గాన వెళ్లారని పేర్కొన్నారు. దీంతో హెలిప్యాడ్ వద్ద చోటుచేసుకున్న పరిణామాలపై నిగ్గు తేల్చేందుకు పోలీసులు పైలట్, కోపైలట్, కర్ణాటక రాష్ట్రం జక్కూరులోని నిర్వహణ సంస్థకు నోటీసులిచ్చారు.
ఆ హెలికాప్టర్ ఎటు వెళ్లింది? - జగన్ పర్యటనలో కుట్రకోణం
'తప్పు చేసినవారి బట్టలూడదీస్తాం' - పోలీసులపై జగన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

