Cricket Betting in Telangana : ఓవైపు ఐపీఎల్ మ్యాచ్లు ఉత్కంఠగా జరుగుతుంటే మరోవైపు కొన్ని చోట్ల బెట్టింగ్ దందాలు జోరుగా సాగుతున్నాయి. యువత, చిరు వ్యాపారులు ఈ దందాలో చిక్కుకుని భాగస్వాములవుతున్నారు. రుణ యాప్లు, వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూ అధిక వడ్డీలకు అప్పులు తీసుకుంటున్నారు. చివరకు వాటిని తీర్చలేక కొందరు ఇంట్లో, బయట తెలిస్తే పరువు పోతుందనే మనోవేదనతో ఇంకొందరు ప్రాణాలను ఆర్దాంతరంగా తీసుకుంటున్నారు. బెట్టింగ్ ముఠాల కార్యకలాపాలు జోరందుకోకముందే పోలీసుల నిఘా విస్తృతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఎలా చేస్తారంటే : ఎంతో ఉత్కంఠగా సాగే ఈ గేమ్పై టాస్ మొదలు ప్రతి బంతిపై బెట్టింగ్లు పెడుతుంటారు. ఇదే కాకుండా మ్యాచ్ గెలుపోటములపైనా ఉంటుంది. అందుకు రూ.500 నుంచి రూ.10 వేల వరకు బెట్టింగ్ కాస్తారు. ఇందుకోసం బెట్టింగ్ ముఠాలు ప్రత్యేకంగా పట్టణాల్లోని రహస్య ప్రాంతాల్లో రూంలను అద్దెకు తీసుకుంటుంటారు. అందులో టీవీతో పాటు ఇతర సదుపాయాలను కూడా ఏర్పాటు చేసుకుంటారు.
లేదంటే హోటళ్లు, అపార్ట్మెంట్లు, ఇంటర్నెట్ సెంటర్లు, నగరశివారుల్లోని అడ్డాలను తమ బెట్టింగ్ కార్యకలాపాలకు కేంద్రంగా మార్చుకుంటారు. ఈ వెసులుబాటు వద్దనుకునే వారు స్మార్ట్ఫోన్లలో ఆటను చూస్తూ బెట్టింగ్ కాస్తున్నారు.
డిజిటల్ చెల్లింపులు : గతంలో డబ్బులు పెట్టి బెట్టింగ్లు కాసేవారు. ప్రస్తుతం మారిన పరిస్థితులు పోలీసులకు చిక్కొద్దనే ఆలోచనతో ఆన్లైన్, ఎలక్ట్రానిక్ డివైజ్, సెల్ఫోన్లను వినియోగించుకుంటూ డిజిటల్ చెల్లింపులను బెట్టింగ్లకు వాడుకుంటున్నారు. మంగళవారం జరిగిన మ్యాచ్పై వరంగల్ నగరంలోని పద్మాక్షికాలనీలో బెట్టింగ్కు పాల్పడుతున్న 6 మందిలో ముగ్గురిని టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1,58,000 స్వాధీనం చేసుకున్నారు.’ కాగా మరో ముగ్గురు పారిపోయారు.
పదిశాతం కమీషన్ : బెట్టింగ్ గెలిచిన వ్యక్తికి చెల్లించాల్సిన డబ్బుల్లోంచి ముఠా సభ్యులు 10 శాతం కమీషన్ తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఇలాంటి ముఠాలు చాలా ఉన్నాయి. ఈ ఐపీఎల్ ముగిసేలోగా రూ.కోట్లలో చేతులు మారే అవకాశాలున్నాయి.
పోలీసులు ఇలా : గతంలోని బెట్టింగ్ ముఠాలు, అందులో డబ్బులు పెట్టిన వారి వివరాలను పోలీసులు సేకరించారు. వారు ప్రస్తుతం ఎం చేస్తున్నారు మళ్లీ బెట్టింగ్లకు పాల్పడుతున్నారా? అని ఆరా తీస్తున్నారు. పోలీస్ కార్యదళం వారి కార్యకలాపాలపై నిఘా పెట్టింది.
ఏదేమైనా బెట్టింగ్ ఊబిలో చిక్కుకొని అప్పులు చేసి, ఆస్తులు అమ్ముకున్న వారు చాలామందే ఉన్నారు. ఇంట్లో చెప్పలేక ఆత్మహత్యలు చేసుకున్న వారికి కొదవేం లేదు. సాప్ట్వేర్ ఇంజినీర్ల నుంచి వ్యాపార వేత్తల వరకు, చిన్న చిన్న పనులు చేసుకునే వారి దగ్గర నుంచి విద్యార్థుల వరకు అంతా బెట్టింగ్ ఊబిలో చిక్కుకుపోతున్న వారే.
IPL BETTING: కాయ్ రాజా కాయ్.. రాష్ట్రంలో జోరుగా ఐపీఎల్ బెట్టింగ్
మహానగరంలో జోరుగా క్రికెట్ పందేలు... ముగ్గురు నిందితులు అరెస్ట్