Pastor Praveen Case Updates : రాజమహేంద్రవరంలో పాస్టర్ ప్రవీణ్ మరణానికి ముందు విజయవాడలో ఏం జరిగిందనే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఆయన విజయవాడ రామవరప్పాడు చౌరస్తా సమీపంలోని ఓ పార్కులో విశ్రాంతి తీసుకున్న తర్వాత నుంచి మృతి వరకు మధ్యలో ఏం జరిగిందనే విషయాలు బయటికొస్తున్నాయి. ప్రధానంగా విజయవాడలో ఆయణ్ని చివరిసారిగా చూసిన ట్రాఫిక్ ఎస్ఐ, టీకొట్టు మాస్టర్ ఆ రోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు రామవరప్పాడు వద్ద ఏం జరిగిందనేది వివరించారు.
ప్రవీణ్ ద్విచక్రవాహనం హెడ్లైట్ పగిలిపోయి ఉండటం మరోవైపు చాలా నీరసంగా కనిపించడంతో ‘ఈ రాత్రి వేళ రాజమహేంద్రవరం వెళ్లొద్దని, స్థానికంగా ఉన్న హోటల్లో విశ్రాంతి తీసుకుని ఉదయం బయల్దేరి వెళ్లాలని ఎస్ఐ, టీకొట్టు మాస్టర్ ప్రవీణ్కు సూచించినా ఆయన వినిపించుకోలేదని సమాచారం. ‘రాజమహేంద్రవరంలో అత్యవసర పని ఉంది ఇప్పుడే వెళ్లాలి’ అంటూ ప్రవీణ్ లైట్లు లేని ఆ బైక్పైనే వెళ్లిపోయినట్లు వారిద్దరూ పేర్కొన్నారు.
బండి నడపలేని స్థితిలో గొల్లపూడిలోని పెట్రోల్ బంకుకు : గత నెల 24న సాయంత్రం 4.45 గంటలకు గొల్లపూడిలో పెట్రోల్ బంక్కు ప్రవీణ్ చేరుకున్నారు. అప్పటికే ద్విచక్ర వాహనంపై తూలుతూ ఉండటం, బైకు లైట్ పగిలిపోయి ఉండటం, బైక్ సేప్టీ రాడ్ వంకర పోవడం పెట్రోల్ బంకులోని సీసీ కెమెరాలో నమోదైంది. బంకులో సిబ్బంది ఎంత పెట్రోల్ కావాలని అడిగితే చేతితో 8 అని సైగ చేశారు. రూ.872 తన ఫోన్పే ద్వారా నగదు పంపించి విజయవాడ వైపు వెళ్లిపోయారు.
రామవరప్పాడు రింగ్ వద్ద తాను ఆ రోజు విధులు నిర్వహిస్తున్నట్లు ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు తెలిపారు. సాయంత్రం 5:20 గంటల ప్రాంతంలో సెల్ఫ్ యాక్సిడెంట్ అయిందని చెప్పారు. చుట్టుపక్కల వారు ప్రవీణ్ను లేపి పక్కన కూర్చోబెట్టారని వివరించారు. సమాచారం తెలిసిన వెంటనే తాను ప్రమాద స్థలానికి వెళ్లినట్లు పేర్కొన్నారు. బండికి హెడ్లైట్ ఊడిపోయిందని, కళ్లజోడుకు ఒక అద్దం లేదన్నారు. దెబ్బలు తగిలాయా? అని అడిగితే ప్రవీణ్ లేదని చెప్పారు. ఆయణ్ని సమీపంలోని పార్కులో కూర్చోబెట్టామని సుబ్బారావు వెల్లడించారు.
దాదాపు మూడు గంటలు ప్రవీణ్ అక్కడే కూర్చున్నారని సుబ్బారావు పేర్కొన్నారు. తన విధులు ముగిసిన తర్వాత ఎనిమిది గంటల సమయంలో వెళ్లి ప్రవీణ్ను పలకరించానని చెప్పారు. టీకొట్టుకు తీసుకెళ్లి టీ ఇప్పించినట్లు తెలిపారు. అప్పటికే హెడ్లైట్ వేలాడుతోందని తాను ట్రాఫిక్ బూత్లోకి తాడు కోసం వెళ్లానని వివరించారు. మళ్లీ తిరిగి వచ్చే సరికే కనిపించలేదని ఆయన బాగా నీరసంగా, మగతగా ఉన్నారని ట్రాఫిక్ ఎస్సై అన్నారు.
దెబ్బలు లేవు నీరసంగా ఉన్నారు : ద్విచక్ర వాహనం పడిపోవడంతో పగిలిపోయిన హెడ్లైట్ను మరమ్మతు చేసేందుకు ఎవరైనా స్థానికంగా మెకానిక్ ఉన్నారా అంటూ ప్రవీణ్ తనను అడిగారని టీకొట్టు మాస్టర్ నాగార్జున తెలిపారు. ఇక్కడ ఎవరూ లేరని తాము చెప్పామని అన్నారు. హెడ్లైట్ కిందకు వేలాడుతుండటంతో కనీసం దానిని తీగతో కడతాను ఉండండి అంటూ హోటల్లోకి వెళ్లి వచ్చేలోగానే అక్కడి నుంచి ప్రవీణ్ తన వాహనంపై వెళ్లిపోయారని వివరించారు.
తన హోటల్ వద్దకు వచ్చే సమయానికి పాస్టర్ శరీరంపై ఎలాంటి దెబ్బలూ లేవని, ఆయన వేసుకున్న షర్టుపై మాత్రం వెనుక వైపు మట్టి అంటుకుని ఉందని టీమాస్టర్ నాగార్జున వివరించారు. చాలా నీరసంగా ఉన్నారని, కనీసం నిలబడలేకపోతున్నారని తెలిపారు. తన దగ్గరే టీ తాగారంటూ పేర్కొన్నారు. తాను యూట్యూబ్లో పాస్టర్ చనిపోయారనే వీడియోలు చూసినప్పుడు ఆ ద్విచక్ర వాహనం హెడ్లైట్ పగిలిపోయి ఉండటం చూసి గుర్తుపట్టానన్నారు. తన హోటల్ దగ్గరకు వచ్చేసరికి ఆయన హెల్మెట్, మాస్క్ పెట్టుకుని ఉన్నారని చెప్పారు.
పాస్టర్ ప్రవీణ్ కేసు - కీలకంగా మారిన ఆ 3 గంటలు?
నిరసనల మధ్యే పాస్టర్ పోస్టుమార్టం - అతి కష్టం మీద హైదరాబాద్ తరలింపు