PM Modi Meeting in Amaravati: రాజధాని అమరావతి పనుల పునః ప్రారంభానికి మే 2 తేదీన ప్రధాని మోదీ రానున్న విషయం తెలిసిందే. పీఎం పర్యటనపై సీఎస్ కె. విజయానంద్ సమీక్ష నిర్వహించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ప్రధాని సభకు సుమారు 5 లక్షల మంది ప్రజలు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాన వేదిక వద్ద 50 వేల మంది కూర్చునేలా, లక్ష మంది రోడ్ల వెంబడి నిలబడి ప్రధానికి స్వాగతం పలికేందుకు, అలాగే మిగతా వారు వివిధ ప్రాంతాల్లో ఉండి వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్: అమరావతి నిర్మాణాల పునఃప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ పర్యటన షెడ్యూల్ ఖరారు అయింది. మే 2న సాయంత్రం 4 గంటలకు రాజధాని పనులను ప్రధాని ప్రారంభించనున్నారు. సచివాలయం వెనక బహిరంగసభ వేదికను ప్రభుత్వం ఎంపిక చేసింది. అక్కణ్నుంచే పనుల పునఃప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ప్రధాని నిర్వహించనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్ల ఎస్పీజీ బృందం పర్యవేక్షిస్తోంది.
వీఐపీలతో పాటు ప్రజలు సభా ప్రాంగణానికి చేరుకునేందుకు 9 రహదార్లను గుర్తించామని, ఆయా రహదార్లలో ఎక్కడా ట్రాఫిక్ సమస్య కలగకుండా తగిన తగిన చర్యలు తీసుకుంటామని సీఎస్ విజయానంద్ అన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఏలూరు, ప్రకాశం సమీప జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు వివరించారు. వేసవి దృష్ట్యా ప్రధాని పర్యటనకు వచ్చే ప్రజా ప్రతినిధులు, ప్రజలు తదితరులెవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాల్సి ఉందని సీఎస్ స్పష్టం చేశారు.
అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి పీఎం మోదీ రాష్ట్రానికి రానున్న నేపథ్యంలో అట్టహాసంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సచివాలయం వెనుక 250 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన వేదికను తూర్పు అభిముఖంగా ఉండేలా రెడీ చేస్తున్నారు. వర్షం పడినా కూడా ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ టెంట్లు వేయనున్నారు. ఈ నెల 28వ తేదీ నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. వీఐపీ పార్కింగ్కు 10 ఎకరాలు, వేదికల కోసం 28 ఎకరాలు కేటాయించారు.
ప్రముఖుల కోసం 4 హెలీప్యాడ్లు: ప్రధానితో పాటు ఇతర ప్రముఖుల కోసం 4 హెలీప్యాడ్లు అవసరమని అధికారులు భావిస్తున్నారు. సచివాలయం ఎదుట ముఖ్యమంత్రి ఉపయోగించే మూడు హెలీప్యాడ్లు ఉన్నాయి. వీటికి అదనంగా మరొకటి రెడీ చేయాలని నిర్ణయించారు. రైతుల లే ఔట్లో నాలుగో హెలీప్యాడ్ రెడీ చేయాలని నిర్ణయించారు. సభకు వచ్చేవారి కోసం 40 ఎకరాల్లో టెంట్లు వేయనున్నారు. ఎకరాకు 6 వేలు చొప్పున మొత్తం 2.40 లక్షల మంది కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
హెలీప్యాడ్ నుంచి వేదిక వరకు ఇరు వైపులా రైతులు, మహిళలు నిలబడి ప్రధాని మోదీకి పూలు చల్లుతూ స్వాగతం పలకనున్నారు. సచివాలయం ఎదుట ఉన్న హెలీప్యాడ్లు, సభాప్రాంగణాన్ని ఇప్పటికే అధికారులు పరిశీలించారు. రహదారి మార్గంలో అడ్డుగా ఉన్న విద్యుత్తు తీగలను, చెట్లను వేరే చోటుకు మార్చనున్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చుట్టూ ఉన్న రాజధాని రహదారులను తాత్కాలికంగా సిద్ధం చేయనున్నారు.
డయాగ్రిడ్ విధానంలో ఐకానిక్ టవర్లు - 47 అంతస్తులపై హెలీప్యాడ్