PM Modi Tour Ministers Committee: రాజధాని పనుల శంకుస్థాపన కోసం మే 2వ తేదీన ప్రధాని పర్యటన కోసం మంత్రులతో కూడిన ఆర్గనైజింగ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, మంత్రి కొల్లు రవీంద్రలతో కూడిన ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటైంది. ప్రధాని పర్యటన కోసం నోడల్ అధికారిగా జి.వీరపాండియన్ను నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రధాని పర్యటన ఏర్పాట్లతో పాటు నిర్మాణ పనుల శంకుస్థాపన, పెట్టుబడుల ప్రారంభోత్సవ కార్యక్రమాలను ఆర్గనైజింగ్ కమిటీ పర్యవేక్షించనుంది.

మరోవైపు అమరావతి పనుల పునః ప్రారంభానికి మే రెండో తేదీన ప్రధాని మోదీ రానున్న దృష్ట్యా భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ సభకు సుమారు 5 లక్షల మంది పాల్గొనేలా, ప్రధాన వేదిక వద్ద 50 వేల మంది కూర్చునేలా, లక్ష మంది రోడ్ల వెంబడి నిలబడి ప్రధానికి స్వాగతం పలికేలా ప్లానే చేస్తున్నారు. మే 2న సాయంత్రం 4 గంటలకు అమరాతి పనులను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. సచివాలయం వెనక ఏర్పాటు చేస్తున్న బహిరంగసభ వేదిక వద్ద నుంచే పనులను ప్రారంభించనున్నారు.
మోదీ పర్యటన దృష్ట్యా వీఐపీలతో పాటు ప్రజలు సభా ప్రాంగణానికి చేరుకునేందుకు 9 రహదార్లను గుర్తించారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఏలూరు, ప్రకాశం సమీప జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 250 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాన వేదిక తూర్పు అభిముఖంగా ఉండనుంది. వర్షం పడినా కూడా ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ టెంట్లు వేస్తున్నారు. వీఐపీ పార్కింగ్కు 10 ఎకరాలు, వేదికల కోసం 28 ఎకరాలను అధికారులు కేటాయించారు.
నాలుగు హెలీప్యాడ్లు: పీఎం మోదీతో పాటు ప్రముఖుల కోసం 4 హెలీప్యాడ్లు అవసరం కాగా, సచివాలయం ఎదుట ఇప్పటికే మూడు హెలీప్యాడ్లు ఉన్నాయి. వీటికి అదనంగా మరొకటి రెడీ చేస్తున్నారు. హెలీప్యాడ్ నుంచి వేదిక వరకు ఇరు వైపులా రైతులు, మహిళలు నిలబడి పీఎం మోదీకి పూలు చల్లుతూ స్వాగతం పలకనున్నారు.
మోదీ అమరావతి సభకు 5 లక్షల మంది - ప్రధాని పర్యటన షెడ్యూల్ ఖరారు