ఆ రైతులకు ప్రతి నెలా రూ.3 వేలు! - మీరు దరఖాస్తు చేసుకున్నారా?
60 ఏళ్లు దాటిన రైతులకు ప్రతినెలా రూ.3 వేలు చొప్పున పింఛన్ - ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన పథకం - అసలు ఈ పథకానికి అర్హతలు ఏంటి?

Published : July 3, 2025 at 2:46 PM IST
Prime Minister Kisan Maandhan Yojana Scheme : కేంద్రంలో గానీ, రాష్ట్రంలో గానీ ఏ ప్రభుత్వం వచ్చినా రైతుల కోసం ప్రత్యేకంగా వరాలను కురిపిస్తారు. ఈ క్రమంలో వారి కోసమే అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారు. అయితే వీటిలో చాలా పథకాలు వారు వ్యవసాయం చేస్తున్నంత కాలమే అండగా ఉంటున్నాయి. వీరు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత చాలా మందికి ఆదాయం అనేది ఉండటం లేదు. ఈనేపథ్యంలో 60 ఏళ్లు దాటిన సన్న, చిన్నకారు రైతులకు ప్రయోజనం కలిగించే విధంగా ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇందులో వృద్ధులైన ప్రతి రైతులకు ప్రతినెలా రూ.3 వేలు చొప్పున జీవిత కాలం పింఛన్ ఇవ్వనున్నారు. అయితే ఈ పథకం గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ పథకం లక్ష్యాలు ఏంటి? ఎలా చెల్లిస్తారు? ఎవరు అర్హులు అనే విషయాలు తెలుసుకుందాం?
అర్హులు ఎవరు :
- 18 నుంచి 40 ఏళ్ల వయసు ఉన్న సన్న, చిన్నకారు రైతులు.
- వారికి ఐదు ఎకరాలలోపు సొంత వ్యవసాయ భూమి ఉండాలి.
- ఆ భూమి ఆయా ప్రభుత్వాల భూ రికార్డుల్లో నమోదై ఉండాలి.
- ఆసక్తి ఉన్న రైతులు వయసు వారీగా నర్దేశించిన ప్రీమియం డబ్బులు చెల్లించాలి.
- అనంతరం పీఎం కిసాన్ మాన్ధన్ కోసం దరఖాస్తు చేసుకోవాలి.
వీరు అనర్హులు :
- నేషనల్ పెన్షన్ స్కీమ్(ఎన్పీఎస్)
- ఈఎస్ఐ
- ఈపీఎఫ్వో
- ప్రభుత్వ ఉద్యోగులు
- పన్ను చెల్లింపుదారులు
- ఆర్థికంగా బాగున్న వారు
- సామాజిక భద్రత పథకాల పరిధిలో ఉన్నవారు
ప్రీమియం ఏ విధంగా కట్టాలి :
- ప్రతి నెలా రూ.55 నుంచి రూ.200 వరకు 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు ప్రీమియం చెల్లించాలి.
- ఈ ప్రీమియం వయసు ప్రకారం పెరుగుతుంది.
- 18 ఏళ్ల వయసున్న రైతు నెలకు రూ.55 చొప్పున చెల్లిస్తే కేంద్రం తన వాటా కింద మరో రూ.55 కలిపి చెల్లిస్తోంది. దీంతో రూ.110 బీమా చెల్లిస్తుంది.
- ఇలా రైతులు చెల్లించిన మొత్తానికి సమాన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుంది.
- 60 ఏళ్లు వచ్చే వరకు ప్రీమియం చెల్లిస్తే తర్వాత నెలకు రూ.3 వేలు చెప్పున పింఛన్ ఇస్తారు.
- బీమా చెల్లించిన రైతు మరణిస్తే ఆయన భార్యకు ప్రతినెలా రూ.1500 పింఛన్ అందుతుంది.
దరఖాస్తు చేసుకోండిలా :
- పీఎం కిసాన్ మాన్ధన్ కింద పింఛను ప్రయోజనం పొందేందుకు ఆసక్తి ఉన్న రైతులు సీఎస్సీ కేంద్రానికెళ్లి పీఎం కిసాన్ కేఎంవై పోర్టల్లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని ఆధార్, నామినీ వివరాలు, రైతు సంతకంతో అప్లోడ్ చేయాలి.
- అనంతరం పింఛన్ కార్డు వస్తుంది.
- తర్వాత పీఎం కిసాన్ పథకానికి అనుంసంధానమైన బ్యాంకు ఖాతా నుంచి ప్రీమియం నగదు చెల్లించాలి.
- ఆసక్తి ఉన్న రైతులు పింఛన్ ప్రయోజనాల కోసం మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి.
రైతులకు పీఎం కిసాన్ సాయం అందట్లేదా? - నగదు రాకపోవడానికి ప్రధాన సమస్యలు ఇవి కావొచ్చు!
ఎన్ని ఎకరాలు కాదు - లాభం ఎంత అనేదే మ్యాటర్ - రూటు మారుస్తున్న రైతులు

