Playing Poker in Lorry: విజయనగరంలో లారీలో పేకాడుతూ డ్రోన్ కెమెరా ద్వారా పలువురు పోలీసులకు దొరికిపోయారు. ఇది విజిబుల్ పోలీసింగ్-ఇన్విజిబుల్ పోలీస్ అన్న నినాదానికి అర్థం చెప్పిన ఘటన అని హోంమంత్రి వంగలపూడి అనిత ట్వీట్ చేశారు. ఎవరికీ దొరక్కుండా లారీలో పేకాడుతున్న వారిని విజయనగరం పోలీసులు డ్రోన్ సాయంతో గుర్తించి అరెస్టు చేశారు. టెక్నాలజీతో నేరాలను నియంత్రిస్తున్న పోలీసులకు ఆమె అభినందనలు తెలిపారు.
టెక్నాలజీ సాయంతో పోలీసులు తమ పనిని అత్యంత వేగంగా చేస్తున్నారు. డ్రోన్లను ఉపయోగించి నేరాలను నియంత్రిస్తున్నారు. ఆకాశంలో డ్రోన్ ఎగుర వేసి అనుమానిత ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. తద్వారా నేరాలను నియంత్రిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇటీవల ఏపీ పోలీసులు డ్రోన్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే పలు కేసులను క్షణాల్లో పరిష్కరించారు.
క్షణాల్లో కేసులు పరిష్కారం: ఇటీవల బాపట్ల జిల్లాలోనూ పోలీసులు ఇదేవిధంగా పేకాటరాయుళ్లను పట్టుకున్నారు. చుండూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని యడ్లపల్లి గ్రామంలోని మారుమూల ప్రదేశంలో కొంతమంది పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో చుండూరు ఎస్సై రహిమాన్, సిబ్బంది ఆ ప్రదేశానికి చేరుకున్నారు. మారుమూల ప్రాంతం కావడం వల్ల పేకాట ఆడుతున్న ప్రదేశాన్ని గుర్తించడం కష్టతరంగా మారింది. దీంతో ఆ ప్రాంతంలో డ్రోన్ ఎగురవేసి దట్టమైన చెట్ల మధ్య పేకాట ఆడుతున్న 10 మందిని అదుపులోకి తీసుకున్నారు.
కొద్ది రోజుల క్రితం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నాన్నమ్మ వద్ద నుంచి తప్పిపోయిన చిన్నారిని డ్రోన్ సాయంతో పోలీసులు తిరిగి ఆమె వద్దకు చేర్చారు. మనవడు, మనవరాలతో కలిసి ఆధార్ కార్డు ఆప్డేట్ కోసం పోస్టాఫీసుకు ఓ మహిళ వచ్చింది. అక్కడ్నుంచి తన మనవరాలు తప్పిపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, డ్రోన్ సహాయంతో పరిసరాలను జల్లెడ పట్టారు. ఈ విధంగా కొద్దిసేపటికే చిన్నారిని గుర్తించారు.
మరోవైపు మారుమూల ప్రాంతాల్లో గంజాయి ఉనికిని గుర్తించేందుకు సైతం పోలీసులు డ్రోన్లతో నిఘా పెడుతున్నారు. డ్రోన్ల ద్వారా గంజాయి తోటలను గుర్తించిన ప్రాంతాల్లోకి బృందాలను పంపించి, వాటిని ధ్వంసం చేస్తున్నారు. అదే విధంగా గతంలో గంజాయిని ధ్వంసం చేసిన చోట ఇప్పుడు ప్రత్యామ్నాయంగా ఏ పంటలు వేశారో అనే విషయాన్ని కూడా డ్రోన్ల ద్వారానే పరిశీలిస్తున్నారు.
క్లౌడ్ పెట్రోలింగ్: కాగా నేరాలను నియంత్రించేందుకు ఏపీ పోలీసులు ‘క్లౌడ్ పెట్రోలింగ్’ చేస్తున్నారు. కాలానికి తగ్గట్టుగా నూతన పద్ధతులను పాటిస్తున్నారు. డ్రోన్ కెమెరాలను రంగంలోకి దింపి, పలుచోట్ల గస్తీ చేపడుతున్నారు. ట్రాఫిక్ సమస్యలను గుర్తించేందుకు సైతం డ్రోన్లు ఉపయోగపడుతున్నాయి. ఇప్పటికే విశాఖపట్నంలో చర్యలు చేపట్టారు.
జెట్ స్పీడ్లో కేసు సాల్వ్! - టెక్నాలజీ సాయంతో అదరగొట్టిన పోలీసులు